విడుదలకు ముందే ఉత్కంఠ రేపుతున్న 2.0
ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ‘2.0’ ముందుంది. ఎందుకంటే భారీ బడ్జెట్, పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కించారు. ఆ విషయం ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పుడే అందరికీ అర్ధమై ఉంటుంది. ఈ సినిమా ఈ నెల 29న విడుదలవుతోంది. ఈ సందర్భంగా తాజాగా ఈ చిత్రం మేకింగ్ వీడియోను విడుదల చేశారు. దీంతో ఈ సినిమాలో ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు ఎంతగా శ్రమించారో మరింత స్పష్టత ఏర్పడనుంది. రజనీకాంత్ హీరోగా, బాలీవుడ్ కథానాయకుడు అక్షయ కుమార్ ప్రతినాయకుడిగానూ చేశారు. ఇందులో వీరిద్దరికీ మేకప్ వేసుకోవడానికి, మళ్లీ దాన్ని తీయడానికే గంటల కొద్దీ సమయం పట్టిందట. ముఖ్యంగా అక్షయ కుమార్ పాత్రకు పడ్డ కష్టం ఇంతకు ముందు తానెప్పుడూ పడలేదని ఆయనే ఇటీవల స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అది నిజమే అనిపిస్తుంది. కేవలం మేకప్ వేసుకోవడానికి మూడు గంటల సమయం పడితే, తీయడానికి గంటన్నర సమయం పట్టేదట. ఆయన కోసం మేకప్ టీమ్ కూడా అంతే శ్రమించింది. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. అమీ జాక్సన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈనెల 29న ఈ సినిమా విడుదల కానుంది.