తెలుగు సంఘం ఏర్పడి ఒకటిన్నర దశాబ్దం పైబడింది. మొదట్లో తెలుగువాళ్ళం కాబట్టి ‘మన’ పండగ ఉగాది కార్యక్రమం తప్పనిసరిగా నిర్వహించాలి అని ఆ రోజుల్లో ఉన్న కొద్ది మందితో పండగ కార్యక్రమం చేసుకునేవారు. కాలానుగుణంగా ‘ఉగాది’ పండగ తెలుగు సంఘానికి కేంద్ర బిందువుగా మారి ఈ పండగ కోసమే సంవత్సరం పొడగునా ఎదురు చూసేవారి సంఖ్య ఇప్పుడు వందలు దాటింది. ఈ ఉగాది పండగ ముందు షుమారు నాలుగైదు నెలల నుండి క్రికెట్, బాడ్మింటన్ మొదలైన ఆటల పోటీలు నిర్వహించి ఈ పర్వదినాన విజేతలకు బహుమతులు అందజేయడం జరుగుతుంది. అదే కాకుండా కాన్బెర్రా నగరానికి ప్రతీ ఏటా పలువురు క్రొత్తవారు రావడం జరుగుతుంది. క్రొత్త సంవత్సరానికి స్వాగతిస్తూ వారికి కూడా సభ్యత్వం ఇచ్చి సగౌరవంగా క్రొత్త పరిచయాలతో అనువైన వాతావరణం కలిగించి తెలుగు సంఘానికి ఆహ్వానించడం జరుగుతుంది.
క్రమం తప్పకుండా పదిహేనేళ్ళు పిల్లలు, పెద్దలు కలిసి చేసుకునే ఉగాది ఈ సంవత్సరం షుమారు 700 మంది తెలుగు సంఘం సభ్యులు సంప్రదాయ రీతిలో ఇటు స్థానిక అతిరధ మహారధులు, అటు తెలుగు భాషపై అత్యంత ప్రీతిపాత్రమైన పాటలు, గేయాలు వ్రాసిన సినీ గీత రచయిత శ్రీ చంద్ర బోస్ సమక్షంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది.
180 మంది పాల్గొని తెలుగుదనాన్ని తమదైన శైలిలో రంగస్థలంపై ప్రదర్శించి ఆహూతులను మంత్రముగ్దులను చేసారు. ఈ సందర్భంగా తెలుగు సంఘలోని ప్రముఖులతోపాటు విచ్చేసిన అతిధులకు సాదరంగా గౌరవించడం జరిగింది. ఈ సంవత్సరం వచ్చిన అతిధులు:
His Excellency Dr. Ajay Gondane – High Commissioner of India
Senator Zed Seselja – Australian Assistant Minister for Treasury and Finance
Senator David Smith
Alistair Coe – Leader of opposition ACT
Chris Steel – Minister for Multicultural Affairs and Community Facilitates
Dr Krishna Nadimpalli, President of Federation of Indian Associations of ACT
అధ్యక్షోపన్యాసంలో శ్రీ నరసింహారావు కొలను గారు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సంవత్సరం జరిగిన కార్యక్రమాలను వివరిస్తూ కాన్బెర్రా తెలుగు సంఘం అధ్వర్యంలో తెలుగువారు జరుపుకున్న పండగలు వివరించారు.
1. వినాయక చవితి (కవి జొన్నవిత్తుల వారి బృందంతో)
2. రాగం తానం పల్లవి
3. దీపావళి కుంకుం పూజ
4. వివిధ ఆటల పోటీల వివరాలు
5. శ్రీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారి గౌరవార్ధం వందన సభ
6. ఉగాది
సుమారు 3300 పై చిలుకు తెలుగు సినీ పాటలు, గేయాలు వ్రాసిన శ్రీ చంద్ర బోస్ గారు తెలుగు భాషపైన మరియు చిత్రసీమలో వారి విచిత్ర ప్రయాణంపై కొన్ని సంఘటనలు వివరించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఈ కార్యక్రమానికి ఎంతోమంది స్వచ్చందంగా వారి సేవలందించి దిగ్విజయంగా నిర్వహించడానికి తోడ్పడ్డారు. వారందరికీ పేరు పేరునా కార్యవర్గం కృతజ్ఞతలు తెలుపుకున్నారు. చాలా మంది వ్యాపారవేత్తలు ఆర్ధిక సహాయాన్నందించారు. వారికీ కార్యవర్గం తరఫున అధ్యక్షులు శ్రీ నరసింహారావు గారు కృతజ్ఞతాభినందనలు తెలిపారు.
పసందైన విందు భోజనం కార్యక్రమానికి శోభ కూర్చింది.
తెలుగుబడి పిల్లలందరికీ ప్రోత్సాహక పతకాలతో సత్కరించడం జరిగింది.