– మొత్తం 26 స్వర్ణాలతో ప్రపంచంలో మూడో స్థానం
– ఘనంగా ముగిసిన కామెన్వెల్త్ గేమ్స్
– చివరి రోజు సైనాకు స్వర్ణం
గోల్డ్కోస్ట్ లో గత పన్నెండు రోజులు పాటు ఘనంగా జరిగిన 21వ కామెన్వెల్త్ గేమ్స్ ఆదివారంతో ముగిసాయి. చివరి రోజు కూడా భారత్ ఈ గేమ్స్లో పతకాల వేట కొనసాగించింది. బ్యాడ్మింటెన్ మహిళల సింగిల్స్లో సైనా నెహ్వాల్ స్వర్ణం సాధించింది. పివి సింధూపై సైనా విజయం సాధించింది. సింధూ రజతంతో సరిపెట్టుకుంది. ఈ గేమ్స్లో భారత్ మొత్తంగా 26 స్వర్ణ పతకాలతో మూడోస్థానంలో నిలిచింది. భారత్ మొత్తంగా 66 పతకాలను సొంతం చేసుకుంది. ఈ గేమ్స్ చరిత్రలో ఇంత ఎక్కువ సంఖ్యలో పతకాలను సాధించడం భారత్కు ఇది మూడోసారి. 2010లో న్యూఢిల్లీలో జరిగిన గేమ్స్లో భారత్ 38 స్వర్ణాలతో మొత్తంగా 101 పతకాలు సాధించింది. 2002 మాంచెస్టర్ గేమ్స్లో 30 స్వర్ణాలతో 69 పతకాలు సొంతం చేసుకుంది. 2014లో గ్లాస్గోలో జరిగిన కామెన్వెల్త్ గేమ్స్లో భారత్ 15 స్వర్ణాలతో మొత్తంగా 64 పతకాలు సాధించింది. 5వ స్థానంలో నిలిచింది.
Year | Gold | Silver | Bronze | Total | Position |
2002 | 30 | 22 | 17 | 69 | 4th |
2006 | 22 | 17 | 11 | 50 | 4th |
2010 | 38 | 27 | 36 | 101 | 2nd |
2014 | 15 | 30 | 19 | 64 | 5th |
2018 | 26 | 20 | 20 | 66 | 3rd |
200 మంది అథ్లెట్లతో కూడిన భారత బృందం గోల్డ్కోస్ట్లో అత్యంత మెరుగైన ప్రదర్శన చేసింది. అథ్లెట్లు ఊహించిన దాని కంటే మంచి ఫలితాలను సాధిం చారు. ఈ గేమ్స్లో ఆస్ట్రేలియా (198), ఇంగ్లాండ్ (136) తరువాత స్థానంలో భారత్ నిలిచింది.
ఆదివారం ముందుగా భారత్ నుంచి జోష్న చిన్పప్ప-దీపికా పల్లికల్ జోడీ స్వాష్ మహిళ డబుల్స్లో రజతం సాధించింది. భారత్ జంటపై న్యూజిలాండ్ చెందిన జోఎల్లె కింగ్- అమంద లాండర్స్ విజయం సాధించి స్వర్ణం సొంతం చేసుకుంది. అలాగే బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్లో భారత్కు చెందిన కె శ్రీకాంత్ తృటిలో స్వర్ణం కోల్పోయాడు. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో ప్రపంచ నంబర్వన్ శ్రీకాంత్పై మలేషియాకు చెందిన లీ చాంగ్ వై విజయం సాధించాడు. ఈ మ్యాచ్లో తొలి గేమ్ను శ్రీకాంత్ 21-19తో గెలుచుకున్నాడు. అయితే తరువాత గేమ్స్లో 21-14, 21-14తో వై గెలుపొందాడు. శ్రీకాంత్ రెండో స్థానంలో నిలిచాడు. టేబుల్ టెన్నిస్లోనూ భారత్ పతకం సాధించింది. ఈ విభాగంలో శరత్ కమల్ కాంస్య సాధించాడు. ఇంగ్లాండ్కు చెందిన సామ్యూల్ వాల్కర్పై 11-7, 11-9, 9-11, 11-6, 12-10 స్కోరుతో శరత్ విజయం సాధించాడు. ఈ గేమ్స్లో శరత్కు ఇది మూడో పతకం. టిటిలో స్వర్ణం సాధించి పురుషుల జట్టు విభాగంలోనూ, పురుషుల డబుల్స్ విభాగంలోనూ కూడా శరత్ సభ్యుడిగా ఉన్నాడు. టీటీ మిక్సిడ్ డబుల్స్ విభాగంలోనూ భారత్కు పతకం లభించింది. మానికా బత్రా- సాతియాన్ జోడీ క్యాంసం సొంతం చేసుకుంది. భారత్కే చెందిన మౌమా దాస్-శరత్కమల్ జోడీపై మానికా జోడీ 3-0తో విజయం సాధించింది. ఈ విజయంతో ఈ గేమ్స్లో అత్యంత విజయవంతమై భారత అథ్లెట్గా మానికా నిలిచింది. ఈ గేమ్స్లో బాత్ర నాలుగు పతకాలు సాధించింది. సింగిల్స్లో స్వర్ణంతో పాటు, మహిళ టీమ్లో స్వర్ణం, మహిళల డబుల్స్లో రజతాలను కూడా బాత్రా సాధించి రికార్డు నెలకొల్పారు.
మేరీకోమ్ నేతృత్వంలో భారత్ బృందం ఆదివారం ముగింపు వేడుక లను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న భారత్ బృందానికి ప్రముఖ బాక్సర్ మేరీకోమ్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా కామెన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షలు మాట్లాడుతూ లూయిస్ మార్టిన్ మాట్లాడుతూ పాల్గొన్న ఆటగాళ్లకు అభినందనలు తెలిపారు. ఈ గేమ్స్లో మొత్తం 71 దేశాల పాల్గొన్నాయి. 19 క్రీడల్లో 275 విభాగాల్లో ఈ గేమ్స్ను నిర్వహించారు. 2022 కామెన్వెల్త్ గేమ్స్ను బర్మింగమ్లో నిర్వహించనున్నారు.