ఆకట్టుకోలేకపోయిన ‘నేల టిక్కెట్టు”
మాస్ ని ఎంటర్ టైన్ చేసే మాస్ మహారాజాగా టాలీవుడ్ లో పేరొందిన రవితేజ తాజా సినిమా ‘నేల టిక్కెట్టు’ మాత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది.
ఒకప్పుడు మాస్ ప్రేక్షకులతో పాటు, కుటుంబ ప్రేక్షకులను రవితేజ సినిమాలు విశేషంగా అలరించేవి. ఎవరి కెరీర్లోనైనా జయాపజయాలు సహజం. అవి రవితేజను పలకరించాయి. అయితే ‘రాజా ది గ్రేట్’తో మళ్లీ తానేంటో ప్రేక్షకులకు రుచి చూపించారు. అయితే ఆ తర్వాత వచ్చిన ‘టచ్ చేసి చూడు’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం అందుకోలేదు. ఈ నేపథ్యంలో ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రాలతో విజయాలను అందుకున్న కల్యాణ్కృష్ణ దర్శకత్వంలో ఆయన నటించిన సినిమా ఈ ‘నేల టిక్కెట్టు’. పేరు మాస్ను ఆకట్టుకునేలా పెట్టి సినిమాపై ఆసక్తిని రేకెత్తించారు.
కథలోకి వెళ్తే
హీరో రవితేజ (నేల టిక్కెట్టు) ఓ అనాథ. నలుగురితో కలిసి సంతోషంగా ఉండాలనుకునే రకం. ఎవరినైనా సరే వరుసలు పెట్టి పిలిచేస్తాడు. ఆఖరికి దేవుడినైనా సరే. మరోవైపు జగపతిబాబు (ఆదిత్య భూపతి)కి స్వార్థమెక్కువ. డబ్బుకోసం కన్నతండ్రి(శరత్బాబు)ని చంపేస్తాడు. హోంమంత్రి నుంచి ముఖ్యమంత్రి పదవికి ఎదగాలని ఎదురుచూస్తుంటాడు. ఆదిత్య భూపతికి నేల టిక్కెట్టుకి మధ్య ఎలాంటి సంఘర్షణ మొదలైంది. ఆదిత్య అక్రమాలను నేల టిక్కెట్టు ఎలా ఎదుర్కొన్నాడు? అన్నదే ఈ సినిమా కథ
విశ్లేశణః
‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు కల్యాణ్ కృష్ణ. ఈ రెండు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు అందుకున్నాయి. అతని నుంచి వచ్చిన మూడో సినిమా ఇదే. కానీ, గత రెండు చిత్రాల నైపుణ్యం వాటిల్లో చూపించిన ప్రతిభ ‘నేల టిక్కెట్టు’లో కనిపించకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కథలో కొత్తదనం లోపించింది. మంచికీ చెడుకీ మధ్య యుద్ధం ఎన్నో ఏళ్లుగా చూస్తున్నదే. ప్రతి సినిమాలోనూ అదే పాయింట్ ఉంటుంది. అదే కథను ఎంత కొత్తగా చూపించాం అన్నదే కీలకం. కానీ, కల్యాణ్ అటు వైపుగా ఆలోచించలేదు. చుట్టూ జనం, మధ్యలో మనం అనే కాన్సెప్ట్ జనరంజకంగా తీయొచ్చు. పైగా రవితేజ లాంటి కథానాయకుడు దొరకడం కల్యాణ్కు కలిసొచ్చిన విషయం. అయితే కాన్సెప్ట్ని, రవితేజలోని బలాలను దర్శకుడు సరిగ్గా వాడుకోలేదనిపిస్తుంది. కథ ప్రారంభం నుంచి సన్నివేశాలు నడుస్తాయింటాయి కానీ, వాటికి అసలు కథకు సంబంధం ఉందా లేదా? అన్నది మాత్రం ప్రేక్షకుడికి అంతుచిక్కదు.
సెకండాఫ్ కూడా ఇలాగే ఉంది. లెక్కకు మించి సన్నివేశాలు, ఫ్రేమ్ పట్టనంత నటీనటులు ఉన్నా ఒక్క సందర్భంలోనూ ప్రేక్షకుడు కథలో లీనమవ్వలేడు. రవితేజ ఎనర్జీ, అతను అందించే వినోదం అక్కడక్కడా అప్పుడప్పుడూ ప్రేక్షకుల్లో ఉత్తేజాన్ని కలిగిస్తుంది. కానీ, అదే టెంపోను చివరి వరకూ కొనసాగించలేకపోయాడు దర్శకుడు. ద్వితీయార్ధంలో మరింత గందరగోళం కనిపించింది. కథను ఎలా ముగించాలో తెలియక సన్నివేశాలను పొడిగించుకుంటూ వెళ్లాడు. పతాక సన్నివేశాల్లో ప్రతి నాయకుడు కూడా మారిపోవడం మరింత మెలో డ్రామాగా అనిపిస్తుంది. పాటలు, సందర్భానుసారంగా లేకపోవడంతో పాటు వాటిలో మెరుపు తగ్గడంతో అవి కూడా స్పీడు బ్రేకర్లలాగే పనిచేస్తాయి.
నటీనటుల తీరుః
రవితేజ ఎప్పటిలాగే హుషారుగా కన్పించడానికి ప్రయత్నించారు. ఆయనొక్కడే సినిమాను నెట్టుకురావడానికి శతవిధాలా ప్రయత్నించారు. కానీ, కథలో పాత్రలో బలం లేకపోవడంతో ఆయన కూడా ఏమీ చేయలేకపోయారు. మాళవిక శర్మకు ఇదే తొలి చిత్రం. చూడ్డానికి బాగానే ఉన్నా రవితేజతో పాటు ఆమె కెమెస్ట్రీ అంతగా పండలేదనే చెప్పాలి. జగపతిబాబు మరోసారి ప్రతినాయకుడి పాత్రలో కన్పించారు. ఆయన పాత్రని డీల్ చేసిన విధానం సరిగ్గా లేదు. సీనియర్ నటులు చాలా మంది ఉన్నా, వాళ్లను దర్శకుడు సరిగ్గా ఉపయోగించుకోలేదు. బ్రహ్మానందం పాత్రకు ఒక్క డైలాగు లేకపోవడం ఇందుకు అద్దం పట్టింది. శక్తినాథ్ సంగీతంలో మెరుపు తగ్గింది. ‘ఫిదా’కు సంగీతం అందించి ఈ దర్శకుడేనా అనిపించింది. పాటలేవీ చెవికి ఇంపుగా అనిపించలేదు. దరువు ఎక్కువగా అనిపించింది. సాహిత్యం కనిపించలేదు. బడ్జెట్ పరిమితుల వల్లో ఏమో కానీ, సినిమాను చుట్టేసిన ఫీలింగ్ కలుగుతుంది. కల్యాణ్ బలమైన కథను రాసుకోవాల్సింది. దాన్ని తీర్చదిద్దడంలో నైపుణ్యం కొరవడింది. దర్శకుడిగానే కాదు రచయితగానూ ఇంకా కసరత్తులు చేస్తే బాగుండేది.
తెరముందుః
: రవితేజ, మాళవిక శర్మ, జగపతిబాబు, అలీ, పృథ్వీ, పోసాని కృష్ణమురళి తదితరులు
తెరవెనుకః
సంగీతం: శక్తినాథ్ కార్తిక్, సినిమాటోగ్రాఫర్: ముఖేశ్, కూర్పు: చింత కె ప్రసాద్, నిర్మాత: రామ్ తళ్లూరి, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: కల్యాణ్ కృష్ణ
బ్యానర్: ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్