అనుష్క- క్రిష్ ల ‘ఘాటీ’

అనుష్క- క్రిష్ ల కొత్త సినిమా ఘాటీ
*****************

టాలీవుడ్‌లో హీరోలతో సమానంగా స్టార్‌డమ్‌ను అందుకున్న హీరోయిన్లు లో అనుష్క శెట్టి ఒకరు. ఆకట్టుకునే అందంతో పాటు అద్భుతమైన నటనతో మాయ చేసిన ఈమె.. చాలా కాలం పాటు వరుస చిత్రాలతో సందడి చేసింది. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం అనుష్క కాస్త స్లోగానే మూవీలను చేస్తోంది.

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మూవీతో గత ఏడాది వచ్చి సక్సెస్ సాధించిన అనుష్క శెట్టి.. ఇప్పుడు మలయాళంలో ఓ మూవీని చేస్తోంది. దీనితో పాటు ప్రస్తుతం ఈమె.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఘాటీ అనే పేరుతో ఓ సినిమాను చేస్తుంది. ఇటీవలే ఈ చిత్రాన్ని మొదలు పెట్టారు. గతంలో వీళ్ల కాంబోలో ‘వేదం’ వంటి మూవీ రావడంతో దీనిపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

క్రేజీ సబ్జెక్టుతో రాబోతున్న సినిమాకు సంబంధించి ఇప్పటికే హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సెట్‌లో షూట్‌ను జరుపుతున్నారు. దీని తర్వాత ఒడిశా వెళ్లి కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, మూవీ స్టోరీలైన్ వివరాలు బయటకు వచ్చేశాయి. ఈ సినిమా ఆంధ్రా – ఒడిశా సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా రాబోతుందట. ఓ అనుకోని ఘటన వల్ల ఓ రొచ్చులో చిక్కుకుని అన్యాయానికి గురైన అమ్మాయి.. శత్రువులను మట్టబెట్టే క్రిమినల్‌గా ఎలా మారింది అన్న కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోందని సమాచారం.

అనుష్క శెట్టి – క్రిష్ జాగర్లమూడి కలిసి చేస్తున్న ఈ సినిమాలో విక్రమ్ ప్రభు హీరోగా నటిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Scroll to Top