సంక్రాంతికి కాంతార ప్రీక్వెల్


రిషభ్ శెట్టి కథానాయకుడిగా 2022 సెప్టెంబర్ 30వ తేదీన థియేటర్లలో వచ్చిన ‘కాంతార’ జనాలకు పూనకాలు తెప్పించిన విషయం తెలిసిందే. కన్నడలో భారీ విజయాన్ని సాధించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సంచలనాన్ని నమోదు చేసింది. తెలుగులో కూడా ఈ సినిమా అందర్నీ బాగా మెప్పించింది. వరాహరూపం పాట సినిమాలోనే హైలెట్ గా నిలిచిందని, ఆ పాట కోసం పదేపదే సినిమాను చూసిన వారు కూడా లేకపోలేదు. అప్పటినుంచి ఈ సినిమా సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని చాలామంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే సినిమాకు సంబంధించి సీక్వెల్ వస్తుందనుకుంటే ప్రీక్వెల్ వస్తుందని చిత్ర యూనిట్ ఆసక్తికర ప్రకటన చేసింది. గత కొంతకాలంగా సినిమా చిత్రీకరణ జరుగుతుందని, ఈ ప్రీక్వెల్ ను సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నామని, అందుకు తగినట్టుగానే అన్నింటినీ ప్లాన్ చేసుకుంటున్నామని పేర్కొన్నారు.

అసలు ‘కాంతార’ కథలో చివరలో హీరో అదృశ్యమైన తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలని సినీ అభిమానులు ఎదురు చూస్తుంటే, అసలు కథ మొదలు కావడానికి ముందు ఏం జరిగిందో చెప్పడానికి చిత్ర యూనిట్ ప్రీక్వెల్ ను రెడీ చేస్తుంది. కేవలం 16 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన కాంతార సినిమా అన్ని భాషల్లోనూ కలుపుకొని 450 కోట్ల వరకు సంపాదించి రిషభ్ శెట్టి కి మంచి పేరు తెచ్చిపెట్టింది. కాంతార సినిమాలో రిషభ్ శెట్టి యాక్షన్ అందరినీ ఆకట్టుకుంది. ఇక కాంతార సక్సెస్ కావడంతో, ప్రీక్వెల్ ను కాస్త గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దీనికోసం కాస్త ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారట. కాంతార సినిమాను మించి ఈ ప్రీక్వెల్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్టు సమాచారం. ప్రతి సంక్రాంతికి టాలీవుడ్లో పెద్ద హీరోల సినిమాలతో విపరీతమైన పోటీ ఉంటుంది. మరి ఈసారి వచ్చే సంక్రాంతికి పందెం కోడిగా రిషబ్ శెట్టి కాంతార ప్రీక్వెల్ నిలవనుందని తెలుస్తోంది.

Scroll to Top