అభిమానులను అలరించే ‘సర్కారువారి పాట”

దాదాపు రెండున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సర్కారు వారి పాట రూపంలో అసలు సిసలు పండుగ వచ్చేసింది.  సర్కారు వారి పాట చిత్రం గురువారం (మే 12) విడుదలైంది.ఈ సినిమా ఎలా ఉందంటే..?కథబ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక మహేష్ (మహేష్ బాబు) తల్లిదండ్రులు చనిపోతారు. ఇక చిన్నతనంలో అలా తన తల్లిదండ్రులను కోల్పోయిన మహేష్.. అప్పు లేని వాడు బలవంతుడు అని.. ఆ అప్పును రికవరీ చేసేవారు ఇంకా బలవంతులని తెలుసుకుంటాడు. అలా మహేష్ చివరకు అమెరికాలో మహి ఫైనాన్స్ కార్పోరేషన్ పెడతాడు. అందరికీ అప్పులు ఇస్తుంటాడు. వడ్డీలు వసూలు చేస్తుంటాడు. అలాంటి మహి వద్ద మోసం చేసి కళావతి (కీర్తి సురేష్) లోన్ తీసుకుంటుంది. ఆ లోన్ రికవరీ చేసేందుకు కళావతి తండ్రి రాజేంద్ర నాథ్ (సముద్రఖని) కోసం వైజాగ్ వస్తాడు మహేష్. ఈ క్రమంలో మహేష్‌కు తన చిన్నతనంలో చూసిన బ్యాంక్ మేనేజర్ (నదియా) తారసపడుతుంది. వైజాగ్‌కు వచ్చిన మహేష్ ఏం చేశాడు? బ్యాంక్ మేనేజర్ కథ ఏంటి? అసలు పది వేల కోట్ల మ్యాటర్ ఏంటి? అన్నది అసలు కథ.నటీనటులుఅప్పు ఇవ్వడం, వడ్డీలను వసూల్ చేసే మహేష్ పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా నటించాడు. మహి కారెక్టర్, యాటిట్యూడ్, నటించిన తీరు, రొమాంటిక్ యాంగిల్ ఇలా ప్రతీ ఒక్క సీన్‌లో మహేష్ బాబు తన మార్క్ చూపించాడు. ఈ సినిమా మొత్తాన్ని మహేష్ బాబు ఒంటి చేత్తో నడిపించేశాడు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక కీర్తి సురేష్‌ను ఈ సినిమాలో చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇలాంటి పాత్రలో కీర్తి సురేష్ ఇంత వరకు కనిపించలేదు. కళావతి పాత్రలో కీర్తి సురేష్ అందంగా కనిపించడమే కాకుండా అద్బుతంగా నటించేసింది. ప్రతినాయకుడిగా రాజేంద్ర నాథ్ పాత్రలో సముద్రఖని మెప్పించాడు. తనికెళ్లభరణి, నదియా, వెన్నెల కిషోెర్, సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీను ఇలా అందరూ కూడా పర్వాలేదనిపించారు. మహేష్ బాబు తండ్రిగా నాగబాబు కనిపించాడు. ఫ్లాష్ బ్యాక్‌లో ఓ రెండు మూడు నిమిషాలు కనిపించే సీన్‌లో నాగబాబు మెప్పించాడు.విశ్లేషణసర్కారు వారి పాట పైకి కాస్త కమర్షియల్ కథలానే అనిపించినా.. లోతుల్లో మాత్రం సందేశాన్ని అందింస్తుంది. అది ప్రతీ ఒక్కరికీ రిలేట్ అవుతుంది. బ్యాంకులు, ఈఎంఐలు, అప్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పుల్లేని మనుషులు సాదారణంగా కనిపించకపోవచ్చు. అప్పులు తీసుకునేటప్పుడు ప్రవర్తించే తీరు.. తీర్చేటప్పుడు కనిపించకపోవచ్చు. అప్పు తీసుకోవడం, తీర్చడం వంటి విషయాల మీద ఈ సినిమాను నడిపించాడు దర్శకుడు.దేశంలోని ప్రస్తుత పరిస్థితి, జరిగిన కొన్ని విషయాలను స్పృశిస్తూ ఈ కథను దర్శకుడు పరుశురామ్ రాసుకున్నట్టు కనిపిస్తోంది. రైతులు, సాధారణ ప్రజలు, మధ్య తరగతి వాళ్ల మీద బ్యాంకులు చూపించే ప్రతాపం.. వేల కోట్ల ఎగవేసి విదేశాలకు పారిపోయే వారి మీద చూపించదని పరోక్షంగా చురకలు అంటించారు. కొంత మంది వేలకోట్లు ఎగవేస్తే.. వాటిని సాధారణ ప్రజల నుంచే బ్యాంకులు, ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయ్ అని ఈ సినిమా ద్వారా సందేశాన్ని అందించారు. వారు ఎగవేస్తే వాటిని ప్రజలు కడుతున్నారంటూ అందరిలోనూ ఆలోచనలు కలిగించేలా మాటలు, కథను డైరెక్టర్ రాసుకున్నాడు.అయితే ఇలాంటి సీరియస్ అంశానికి వినోదాన్ని జోడించి చూపించడం పంటికింద రాయిలా అనిపిస్తుంది. కానీ కమర్షియల్ లెక్కలు, ఫ్యాన్స్ ఈక్వేషన్స్ దృష్ట్యా అవి తప్పవు. అయితే ఈ కథలో మాత్రం ఆహా అనిపించే ట్విస్టులు గానీ, ఓహో అనిపించే సీన్లు గానీ, సీటు అంచున కూర్చోబెట్టే కథనం గానీ ఉండదు. అంతా కూడా ఊహకందేలానే సాగుతుంటుంది. ఫస్ట్ హాఫ్‌లో మహేష్ బాబు కామెడీ, కీర్తి సురేష్‌తో రొమాంటిక్ ట్రాక్ బాగానే వర్కవుట్ అయింది.ఇక ద్వితీయార్థంలో కాస్త సీరియస్‌గా కథ సాగుతుందని అనుకుంటే అక్కడా నిరాశే ఎదురవుతుంది. అయితే సెకండాఫ్‌లో కీర్తి సురేష్ పాత్రకు బొత్తిగా ప్రాధాన్యం లేనట్టు అనిపిస్తుంది. మహేష్ బాబు, కీర్తి సురేష్ మధ్యలో వచ్చే సీన్లు అంతగా ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోవచ్చు. క్లైమాక్స్ ఎలా ఉంటుందో ప్రేక్షకుడికి ఎప్పుడో అర్థమవుతుంది. ఇక ఇందులో యాక్షన్ సీక్వెన్స్ మాత్రం మహేష్ అభిమానుల చేత విజిల్స్ వేయిస్తాయి.అప్పు తీసుకునేటప్పుడు భయం ఉండాలి.. తీర్చేటప్పుడు గర్వం ఉండాలి.. ఒక్కసారి ఆ గర్వం ఎలా ఉంటుందో చూడండి అని చివర్లో మహేష్ బాబు విలన్‌కు చెప్పే డైలాగ్స్ మాత్రం అందరిలోనూ ఆలోచనలు రేకెత్తిస్తుంటాయి. అప్పు అంటే ఆడపిల్లలాంటిదని, బాధ్యత గల అమ్మాయి తండ్రిలా మార్చుతాను అంటూ మహేష్ బాబు చెప్పే మాటలు బాగున్నాయి. తమన్ పాటలు, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌లో ఉన్న మ మ మహేషా పాట ఫ్యాన్స్‌కు కిక్కిస్తుంది. ఇక సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, నిర్మాణ విలువలు అన్నీ బాగున్నాయి.నటులు:మహేష్ బాబు,కీర్తి సురేష్,వెన్నెల కిషోర్,సముద్రఖనిదర్శకుడు: పరశురామ్

Scroll to Top