
గ్రాఫిక్స్ సాంకేతికత పెరిగిన తర్వాత ఫాంటసీ సినిమాలు తెలుగులో భారీగా పెరిగాయి. ఆ కోవలో వచ్చిన మరో సినిమా ‘రావు బహదూర్’.
‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వెంకటేష్ మహా ఆ తరువాత నటుడిగా, నిర్మాత, కో ప్రొడ్యూసర్గా వెంకటేష్ మహా బిజీగా మారిపోయాడు. మళ్లీ ఇటీవల దర్శకుడిగా రెండో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ఈ సారి సత్యదేవ్తో ‘రావు బహదూర్’ అనే సినిమాని అందించాడు..ఇది ఎలా ఉందంటే…?
కథ
రామప్ప రావు బహదూర్ (సత్య దేవ్) ఎనిమిదేళ్ల పాటు ఒకే గదికి పరిమితమై ఉంటాడు. అతని భార్య రేణుక (దీపా థామస్) కూడా మరో గదిలో అలాగే 8 ఏళ్ల పాటు బంధీగా ఉంటుంది. కొలనులో పడిపోయి చనిపోయిన చిన్న కొడుకు కుసుమప్ప గురించే ఆలోచిస్తుంటాడు రామప్ప. రాజ భవనాన్ని, తండ్రి బాగోగులు చూసుకుంటూ అతని పెద్ద కొడుకు లవనప్ప ఉండిపోతాడు. ఇక రామప్పకి ఆచారి స్నేహితుడు మాత్రమే కాకుండా వైద్యుడు కూడా. అయితే రామప్పకు లివర్ క్యాన్సర్ ఉంటుంది. ఇక చనిపోతాడు అని వైద్యులు చెప్పిన ప్రతీ సారి.. తిరిగి వచ్చేస్తాడు రామప్ప. తనకు అనుమానం అనే పెనుభూతం పట్టింది.. అది పోయే వరకు తన దేహం విడిచి ఆత్మ వెళ్లదురా అని తన స్నేహితుడు, వైద్యుడైన ఆచారి కి రామప్ప చెబుతాడు. కుసుమ తన కొడుకు కాదని రామప్ప నమ్ముతుంటాడు. మరి రామప్ప అనుమానం ఎలా తీరుతుంది? అసలు కుసుమ తన కొడుకు కాదని రామప్ప ఎందుకు అనుకుంటాడు? రామప్ప గతం ఏంటి? రామప్ప వెనక ఉన్న రహస్యాలు ఏంటి? అనుమానం అనే పెనుభూతం నుంచి రామప్పకు చివరికి విముక్తి కలిగిందా? నిజాలు బయటకు వచ్చాయా? అన్నదే కథ.
కొరవడిన స్పష్టత
రావు బహదూర్ పాయింట్ బాగుంటుంది. మెరిసేదంతా బంగారం కాదు.. నలుపు, తెలుపు అన్న తేడాతో వ్యక్తుల్ని భిన్నంగా చూడకూడదు.. అనే పాయింట్లు చెప్పే ప్రయత్నాన్ని వెంకటేష్ మహా చేసినట్లు అనిపిసిస్తుంది. కాకపోతే ఆ పాయింట్ని కథగా మలిచి, సినిమా కోసం రాసుకున్న బ్యాక్ డ్రాప్, తీసిన విధానం మాత్రం అర్థం కాదు. తెలుగులో ఇలాంటి టేకింగ్, స్క్రీన్ ప్లే మాత్రం కొత్త అని చెప్పుకోవచ్చు.
గందరగోళంగా ఫస్ట్ హాఫ్
భువనాలయం అనే రాజ కోట.. అందులో రామప్ప ఒకే గదిలో 8 ఏళ్ల పాటుగా ఉండడం. ఇదంతా కూడా ప్రారంభంలో ఓ రకంగా అనిపించొచ్చు. అసలేం చేస్తున్నాడు.. ఏమై ఉంటుంది.. ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు.. అనే ప్రశ్నలు కలుగుతాయి. ఒకసారి చిన్నగా కథ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లడం, మళ్లీ వర్తమానంలోకి వస్తుండటంతో ఇంట్రెస్టింగ్ ఫీల్ కలగొచ్చు. కుసుమప్ప, రామప్ప, రేణుక, ఆచారి, లవణప్ప, అచ్చమ్మ పాత్రలతో ఫస్ట్ హాఫ్ అంతా కాస్త గందరగోళంగా సాగుతుంది. రేణుకతో రామప్ప ఉన్న సీన్లు కాస్త రిలీఫ్గానే అనిపిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా సాదాసీదాగానే అనిపిస్తుంది.
క్లైమాక్స్లో ఊహించని ట్విస్ట్
ద్వితీయార్దం ఆరంభంలో కుసుమప్పగా పిల్లాడితో, రామప్ప సీన్లు కాసేపు నవ్విస్తాయి. ఇక కొత్త అనుమానాలు పుట్టుకురావడం, ఆచారి పాత్ర మీద డౌట్ కలిగించేలా సీన్లు పడటం, పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవ్వడం తో కథ కాస్త ముందుకు వెళ్లినట్టుగా అనిపిస్తుంది. అక్కడ వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగుంటుంది. అయితే క్లైమాక్స్లో మాత్రం ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ వస్తుంది.
భ్రమలు, భయాలు, అనుమానాలు అంటూ రకరకాల పేర్లు పెట్టి ఓ సింపుల్ కథకు తన నాలెడ్జ్ను వెంకటేష్ మహా జోడించినట్టుగా అనిపిస్తుంది. ఇందులో దర్శకుడు చెప్పాలని అనుకున్నది, చూపించింది ఏంటో.. సామాన్య ప్రేక్షకులకు అర్థం కాకపోవచ్చు. సహనంగా, ఓపికతో భరిద్దాం అని చివరి వరకు చూసిన ప్రేక్షకుడికి కాస్త రిలీఫ్గా ఓ రెండు ట్విస్టులు ఉంటాయి. ఆ ఐదు నిమిషాలు మాత్రమే కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది.
నటన
నటీనటుల విషయానికి వస్తే సత్యదేవ్ వన్ మెన్ షో అని చెప్పుకోవచ్చు. రకరకాల గెటప్స్, లుక్స్ వాటికి తగ్గట్టుగా డబ్బింగ్లో వేరియేషన్స్.. ఇలా అన్నీ కలిపి సత్య దేవ్ తన టాలెంట్ను మరోసారి చూపించినట్టు అనిపిస్తుంది. ఆ తరువాత హీరోయిన్గా రేణుక పాత్రలో దీపా థామస్ ఓకే అనిపిస్తుంది. ఆమెకు అంత స్పేస్ దక్కలేదు. ఇక మిగిలిన పాత్రల్లో ఆచారి, లవణ, కుసుమ, అచ్చమ్మ ఇలా అందరూ తమ పరిధి మేరకు ఆకట్టుకుంటారు. చివర్లో పోలీస్ ఆఫీసర్గా వచ్చిన నటుడు ఆనంద్ కూడా మెప్పిస్తాడు. మిగిలిన వారంతా కూడా తమ తమ పాత్రల వరకు పర్వాలేదనిపిస్తారు.
సాంకేతికంగా
సాంకేతికంగా చూసుకుంటే.. విజువల్స్ చాలా కొత్తగా అనిపిస్తాయి. దాదాపు ఒకే సెట్లో, ఒకే చోటలో తీసినా కూడా చాలా వరకు డిఫరెంట్గా చూపించారు. కొన్ని యాంగిల్స్, చూపించిన తీరు కూడా చాలా కొత్తగా కనిపిస్తాయి. మ్యూజిక్ బాగుంటుంది. ఎడిటింగ్ కూడా బాగుంటుంది. నిర్మాణ విలువలు ఓకే. కాస్టూమ్స్ బాగుంటాయి. తండ్రి కోసం కొడుకు రాసిన కవిత, కొన్ని డైలాగ్స్ బాగుంటాయి.
నటులు : సత్యదేవ్, దీపా థామస్, ఆనంద్ భారతి
దర్శకుడు:వెంకటేష్ మహా
