తెలుగు శబ్ద రత్నాకరుడు

తెలుగు శబ్ద రత్నాకరుడు బహుజనపల్లి సీతారామాచార్యులు

బహుజనపల్లి సీతారామాచార్యులు పేరు చెప్పగానే తెలుగు భాషాభిమానులకు, పండితులకు శబ్ధరత్నాకరమనే ప్రామాణికమైన నిఘంటువు కళ్లముందు మెదులుతుంది. తెలుగునాట సీపీబ్రౌన్ కావ్యాలు, ప్రబందాలు అచ్చువేయించకమునుపే తెలుగు భాషా సేవకునిగా తెలుగువారందరికీ బహుజనపల్లి సీతారామాచార్యులు చిరస్మరణీయులుగా నిలిచారు.

1827లో జన్మించిన వీరు ద్రవిడదేశ వైష్ణవులు. సీతారామాచార్యుల వారి పేరు వినగానే అందరికీ స్పురించునది. శబ్దరత్నాకరము. అచ్చ తెలుగులో (తెలుగు-తెలుగు) వెలువడిన గ్రంథం. దీని తర్వాత శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు. వీరు చెన్నపురి(చెన్నై) లోని పాఠశాల నందు1864లొ తెలుగు పండితులుగా ఉద్యొగమారంభించి ప్రథమ పండితులుగా కొనసాగారు.

సీతారామాచార్యులు మరో రచన ప్రౌడ వ్యాకరణము కూడా మిక్కిలి ప్రసిద్ధికెక్కింది. శబ్దరత్నాకరప్రాశస్త్యమును గ్రహించి చెన్నపురిలోని దేశభాషాగ్రంధకరణసభ వారు సీతారామాచార్యులకు సన్మానం చేసి ఆరోజుల్లో [దువేల రూపాయలు బహుమానంగా ఇచ్చారు. నిజం చెప్పాలంటే [ది లక్షల రూపాయలు ఇచ్చినా ఆయన రుణాన్ని తెలుగువారు తీర్చలేరని పండితులు పేర్కొంటారు.

“శరీరకష్టమును విత్త నష్టమును నించుకేనియుం బాటింపక” రేలుంబవళ్లు శ్రమించి రచించిన నిఘంటువని నిఘంటుకారులు వ్రాసికొనియేయున్నారు. శబ్దరత్నాకరములోని శబ్దములరూపనిర్ణయము సర్థనిర్ణయము శాస్త్రసమ్మతమైనది. పూర్వ నిఘంటువులకంటె నిది బహువిధముల మేలైనది. అక్షరక్రమముగా రచింపబడిన నిఘంటువులలో ఇదిశ్రేష్టమైనది. తెలుగులో ఈ రకమైన నిఘంటువులకు దారితీసినవారు ఎ.డి.కాంబెలు, సి.పి.బ్రౌను. వీరిర్వురు నాంగ్లేయులే. అక్షరక్రమ నిఘంటువులు తెలుగులో తీసుకురావడానికి సీతారామాచార్యులే ఇలా మర్గదర్శకునిగా నిలిచారు.

బరవస్తు చిన్నయసూరి ఆంధ్రజనసామాన్యమునకందు బాటులో నుండునటు లొక తెనుగుపదముల నిఘంటువును రచింపదలచి పదములు స్రామాణికగ్రంధములనుండి యెత్తివ్రాసికొని యచ్చటచ్చట గొన్నిపదముల కర్థనిర్ణయము చేసికొని తన క్ర్తవ్యాన్ని పూర్తిచేయకుండానే కాలధర్మం చెందారు.
వారియనంతరము సీతారామాచార్యులవారు సంస్కృతాంధ్రపదములు తదర్థములు కొన్నిప్రయోగములు చేర్చి శబ్దరత్నాకరము సంధానించిరి. ఇది 1885లో వెలువడినది. శబ్దరత్నాకరము తరువాత ‘శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు’ వెలువడిన విషయము తెలుగువారికి దెలిసినదే.

లాక్షణికులలో సీతారామాచార్యులుగారు ముఖ్యులు. ఈయన సూరికి శిష్యుడ నని వ్రాసికొనలేదు. కాని శిష్యుడైనట్లు జనశ్రుతి. ఆచార్యుల వారు ఒకచోట ఇలా రాశారు “ఫరవస్తు చిన్నయసూరిగారి కాంధ్రమునందును దదుపయుక్త సంస్కృత ప్రాకృతములయందును దలస్పర్శియగు పరిజ్ణానము కలదని వారుచేసిన లక్ష్యలక్షణగ్రంధములే నిరూపించుచున్నవి. మేము వారితో జిరకాలము సావాసము చేసియుంట వారిపాండిత్యము మాకనుభవసిద్ధము.” ఇది చూచి వీరి శైష్యోసాధ్యాయిక తెలిసికొన వచ్చును.

ఆచార్యులవారు పండితోత్తముడు సజ్జనాగ్రేసరుడునగు తమ తండ్రిగారికడ విద్యాభ్యాసము చేసిరి. కవితారసథార యథోచితముగ బసినాటనే కలిగినది. అప్పుడు బాలవయోవష్టాకాల వాసస్థానమైన నాగపట్టణములో నున్న సౌందర్యరాజ స్వామిపై శబ్దాలంకారభరితమైన శతక మొకటి రచించిరి. ఈ శతకము శతక కవిచరిత్ర కారులకు దొరికినది. కవిత ప్రాథమికమైనను నిటులు మాధురీభరితముగ నున్నది.

హరశూల నామశరదా
శరదాసితగాత్ర భక్తజనహితసరదా !
వరదామరుచిర సురదా
మరక్షాస్య మహిత సురాజ సుందరరాజా ! మలయజ శిశిర తనురుచిర
జలరుహదళ సదృశనయన జలనిధిశయనా !
కలరవ కలిత కటకయుగ
సులలిత మృదుపద పయోజ ! సుందరరాజా !

ఇది రాసేనాటికి ఆయన వయసు ఇరవై రెండేళ్ళు. అప్పటికి జిన్న సాహితియు గవితాధోరణియుగల యాచార్యులుగారు, ఇంక నిచట కూపమండూకమువలె నుండరాదని సమీపమునగల మదరాసునకు వచ్చెను. వచ్చి యానాడు చెన్నపురిలో మంచి వ్యుత్సన్నుడై ప్రామాణికుడైయున్న పరవస్తు చిన్నయసూరిని జేరి యతనితో ననేకవిషయములు చదివెను. సూరి రాజధానికళాశాలలో బ్రధాన పండితుడు. పురాణము హయగ్రీవశాస్త్రిగారు రెండవపండితులు. ఈయిర్వుర సాహచర్యము సీతారామాచార్యులుగారికి విద్యాసంగ్రహణమున జాల నుపకరించింది. ‘శబ్దరత్నాకర’ నిఘంటురచనాబీజ మాచార్యులవారి హృదయకేదారమున బడినది యీసమయమే. సూరి యహోరాత్రము లదేపనిగా విశ్వనిఘంటురచనోపయోగి పరికర సంగ్రహణ మొనరించుచున్న సమయమది. పాపము! అతనితలచినపని పూర్తికాకుండగనే 1862 మ్రింగి వైచింది. సూరి తత్సమపదములకర్థము వ్రాయవలయునని తలపెట్టలేదు. మన యాచార్యులుగారు తత్సమ పదములుచేర్చి, సూరినిఘంటువు నాదర్శముగా దీసికొని సర్వప్రశస్తముగా “శబ్దరత్నాకరము” నావిష్కరించిరి. సూరి గతించిన 1862 లో నారంభమై యించుమించు 23 సంవత్సరాల తర్వాత 1885లో శ్బ్ధరత్నాకరమునిఘంటువు బయటికివచ్చినదని చరిత్రకారులు స్పష్టం చేస్తున్నారు. శబ్దరత్నాకరరచన సాగుచున్న కాలముననే సీతారామాచార్యులు అనేక కృతులు రాశారు. నిఘంటునిర్విఘ్న పరిసమాప్తికి ‘వినాయక శతకము’రాశారు…అందులోని కొన్ని పద్యాలు… .

వంకర తొండము చేటల
సొంకము గలచెవులు పెద్దపొట్టయు దగ ని ర్వంకల వందులు వొగడగ
బింకముతో దాల్తువయ్య వేర్వెనకయ్యా!
తల్లిని పరిగొన భక్తుల
కుల్లాసము పుట్టజేసి యురు మదధారల్
వెల్లిగొన సొంపుసూసెడు
బల్లిదు నిను గొల్తునయ్య భవు వెనకయ్యా !

బహుజనపల్లి సీతారామాచార్యుల రచనలు:
సౌందర్యరాజస్వామి శతకము, 1849-వైకృతదీపిక, పదార్థనామకోశము,బాలచంద్రోదయము, 1871- ఆలఘుకౌముది, 1872-నీతిమాల, 1872- సతీధర్మసంగ్రహము, ప్రపన్న పారిజాతము, 1887-ఆంధ్రశబ్దమంజరి, ఉపాధ్యాయబోధిని, వినాయక శతకము, త్రిలింగ లక్షణశేషము, శబ్దరత్నాకరము 1855. సాహిత్య సేవ వంటి రచనలతో తెలుగుబాషని సుసంపన్నం చేసిన బహుజనపల్లి సీతారామాచార్యులు మార్చి 20, 1891న పరమపదించారు.

Scroll to Top