హస్యగీతాల రూపశిల్పి పిఠాపురం


తెలుగు చిత్రసీమలో హాస్యగీతాల రూపశిల్పిగా ప్రశంసలు అందుకున్న పిఠాపురం నాగేశ్వరరావు జయంతి ఈనెల 5. ఈ సందర్భంగా ఆయన జీవన విశేషాలు ముచ్చటించుకుందాం..

పిఠాపురం నాగేశ్వరరావు ప్రముఖ సినీ సంగీత దర్శకుడు. తెలుగు సినీ జగత్తులో మాధవపెద్ది – పిఠాపురం లను జంట గాయకులు అంటారు. పిఠాపురం నాగేశ్వరరావు, తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో 1930 మే 5 న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు విశ్వనాధం – అప్పయ్యమ్మ గార్లు. అసలు వీరి ఇంటి పేరు పాతర్లగడ్డ, కానీ, ‘చిత్తూరు’ నాగయ్య లాగా, నాగేశ్వరరావు గారు కూడా తమ ఊరి పేరునే తన ఇంటి పేరు చేసుకున్నారు.

పిఠాపురం నాగేశ్వరరావు అసలు పేరు పాతర్ల గడ్డ నాగేశ్వరరావు. పిఠాపురం నుంచి వచ్చాడనో ఏమో, అందరూ పిఠాపురం నాగేశ్వరరావు అనేవారుగాని, అసలు ఇంటి పేరు కలిపేవారు కారు. పిఠాపురంలో ఆర్.ఆర్.బి.హెచ్.ఆర్.ప్రభుత్వోన్నత పాఠశాలలో ఎస్.ఎస్.ఎల్.సి.వరకు చదువుకున్నారు. ఇతనికి రంగస్థలంపై మమకారం తండ్రి నుంచి వారసత్వంగా వచ్చింది. ఆయన తండ్రి, ఆ రోజులలో మంచి రంగస్థల నటుడు. గాత్ర శుద్ధి బాగా ఉన్న నాగేశ్వరరావు, స్నేహితుల ప్రోద్బలంతో, తండ్రి ప్రోత్సాహంతో 1944 నుంచి నవ్యకళా సమితి వారి నాటకాలైన శ్రీకృష్ణతులాభారం, బాలనాగమ్మ, కృష్ణార్జున యుద్ధం, దేవదాసు, ఏకలవ్య, లోభి, చింతామణి, రంగూన్‌రౌడీ వంటి నాటకాలలో అర్జునుడు, శ్రీ కృష్ణుడు, దుర్యోధనుడు, సుబ్బిశెట్టి పాత్రలను ధరించి ప్రేక్షకుల మెప్పు పొందారు. విశేషమేమిటంటే, పాడుకోలేని ఇతర నటీనటులకు తెర వెనుక నుండి పాటలు, పద్యాలు, శ్లోకాలు పాడే విధానానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఆ అనుభవంతో, సినిమాలలో పాడాలనే ఆశతో, ఇంట్లో చెప్పకుండా మద్రాసు పారిపొయివచ్చారు. తెలిసినవారందరిళ్ళలో తలదాచుకుని తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

1946 లో విడుదలైన మంగళ సూత్రం అనే సినిమాలో తొలిసారిగా పాడి, సినీ రంగంలో కాలుమోపారు. అప్పటికాయన వయస్సు కేవలం పదహరేళ్ళే . జెమినివారి ప్రతిష్ఠాత్మక సినిమా చంద్రలేఖ లో పాడే అవకాశం రావడంతో సినీపరిశ్రమలో నిలదొక్కుకున్నారు. అప్పటి నుంచి, సుమారు పాతికేళ్ళు అనేక సినిమాల్లో పాడి తనసత్తా నిరుపించుకున్నారు. అది సోలో అయినా, యుగళగీతమైనా సరే, ఆయన పాడినవన్ని దాదాపు హస్యగీతాలే. ఘంటసాల వారితో కలిసిపాడిన “మా ఊళ్ళో ఒక పడుచుంది” (అవేకళ్ళు) పాట, మాధవపెద్ది గారితో కలిసిపాడిన ” అయ్యయో! జేబులోడబ్బులుపొయనే ” (కులగోత్రాలు) పాట, పిఠాపురం గారికి ఎనలేని పేరు తెచ్చాయి. ఈనాటికి ఆ పాటలు అందరి నోళ్లలో నానుతాయంటే అతిశయోక్తి కాదు. ఆయన చివరిసారిగా “చల్లని రామయ్య – చక్కని సీతమ్మ” అనే పాట 1978లో బొమ్మరిల్లు సినిమా కోసం పాడారు. 1996 మార్చి 5 న హస్యగీతాల రూపశిల్పి పిఠాపురం మృతి చెందారు.

Scroll to Top