బహుముఖ ప్రజ్ఞావతి భానుమతి

బహుముఖ ప్రజ్ఞావతి భానుమతి
– సెప్టెంబర్ 7 భానుమతి జయంతి

భారతదేశం గర్వించదగ్గ నటీమణుల్లో భానుమతీ రామకృష్ణ ఒకరు. నటిగానే కాకుండా గాయనిగా, రచయితగా, నిర్మాతగా, సంగీత దర్శకురాలిగా, దర్శకురాలిగా ఆమె అందుకున్న శిఖరాగ్రాలు అనితరసాధ్యమైనవి. ఏడు దశాబ్దాలు ఆమె సినీకళామతల్లికి చేసిన సేవలు అజరామరం.

“చలనచిత్ర ధరిత్రి చరిత్ర ముఖపత్రాన్ని గర్వకారణాల తోరణాలతో అలంకరించడానికి అక్షరక్రమాన పేర్లు ఎన్నికచేస్తే ‘బి’ శీర్షిక కింద బహుముఖ ప్రజ్ఞావతి భానుమతి పేరు చేరుతుందని సినీజనులూ, సినీ జనాభిమానూలు కూడా అంగీకరిస్తారు” – ఇది 1959 సెప్టెంబరు 16న ఆంధ్ర సచిత్ర వారపత్రికలో “తెలుగు వెలుగులు” శీర్షికలో అచ్చయిన వ్యాసంలోని ప్రారంభ వాక్యం. నిజమే అందులో ఎలాంటి సందేహం లేదు.

కేవలం పురుషులకే సాధ్యం అయిన సినీ సాంకేతిక నైపుణ్యంలోనూ ప్రావీణ్యం సంపాదించి నటిగా, గాయనిగా, దర్శకురాలిగా, నిర్మాతగా, రచయితగా, సంగీత దర్శకురాలిగా విభిన్న కోణాలను స్పృశిస్తూ సాటిలేని మేటి తెలుగు కళాకారిణిగా ఎదిగారు భానుమతి. ఆరణాల తెలుగింటి అత్తగారి కథల “భానుమతి”గా ఆమె పేరు తెలుగు సినీవినీలాకాశాన దాదాపు అర్ధశతాబ్దం పాటు మారుమోగిందంటే అతిశయోక్తికాదేమో. ఈ నెల 7వ తేదీ భానుమతి జయంతి సందర్భంగా ఆ మహానటి గురించి ముచ్చటించుకుందాం.

1925వ సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన.. ప్రకాశం జిల్లా, ఒంగోలులోని దొడ్డవరం గ్రామంలో భానుమతి జన్మించారు. హీరోయిన్లుగా ఆడవారి వేషాలు కూడా మగవారే వేసే ఆ రోజుల్లో ధైర్యం గా నేనున్నానంటూ కేవలం 13 సంవత్సరాల ప్రాయంలో ఇంట్లో సనాతన కట్టుబాట్లను ఎదిరించి, సంప్రదాయ సంగీత కళాకారుడైన తండ్రి బొమ్మ రాజు వెంకటసుబ్బయ్యను ఒప్పించి సినిమాలలో వేషం కట్టారు భానుమతి. తండ్రి స్ఫూర్తితో తాను కూడా సంప్రదాయ సంగీతాన్ని, నృత్యాన్ని నేర్చుకుని అపార సంగీత జ్ఞానాన్ని సముపార్జించారు.

1939 సంవత్సరంలో తొలిసారిగా “వర విక్రయం” అనే చిత్రంలో నటించిన భానుమతి కెరీర్‌ను ఆ తరువాత వచ్చిన “కృష్ణప్రేమ”, “స్వర్గసీమ” చిత్రాలు మలుపుతిప్పాయి. ఆ సినిమాలో హీరోతో సమానమైన పాత్రలనే ఒప్పుకునేవారు ఆమె. చాలా మంది ఆమెకున్న కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే నైజాన్ని అందరు పొగరు అనుకునేవారు. అయినా ఆమె చలించేవారు కారు.

1943, ఆగష్టు 8వ తేదీన తమిళ, తెలుగు చిత్ర నిర్మాత, డైరెక్టరు, ఎడిటరు అయిన శ్రీ పి.యస్. రామకృష్ణారావును భానుమతిగారు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమె ప్రేమ వివాహం గురించి అందరికి తెలిసినా ఆ ప్రేమను సాధించుకోడానికి భానుమతిగారు నిరశన దీక్ష చేయడం, గౌరిదేవి పటం ముందు మౌనంగా కూర్చొని రోదించిన విషయం చాలా మందికి తెలియదు. తాను అనుకున్నది సాదించుకోవడం భానుమతి గారికి తెలిసినంతంగా మరెవరికి తెయదు. వీరిద్దరి ఏకైక కుమారుడు భరణి. ఆయన పేరుమీదనే ‘భరణి’ సంస్థను స్థాపించిన ఈ దంపతులు అనేక అపూర్వ చిత్రాలను అందించారు.

దాదాపు 200కు పైగా చిత్రాలలో నటించిన భానుమతి మూడుతరాల నటులతో పనిచేశారు… ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణతో “మంగమ్మగారి మనవడు” చిత్రంలో నటించడమేగాక, ఆ చిత్రంలో టైటిల్‌ రోల్‌ను కూడా పోషించారు. రచయితగా ఆమె రాసిన “అత్తగారి కథలు” ఆంధ్రలో విశేష ప్రాచుర్యం సంపాదించాయి.
అంతేగాకుండా… భానుమతిగారు చేసిన సాహిత్యసేవకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆమెకు “పద్మశ్రీ” బిరుదును ఇచ్చి సత్కరించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం భానుమతి కళాసేవను గుర్తించి ఆమెకు “కళాప్రపూర్ణ” బిరుదుతో డాక్టరేట్‌ను ఇచ్చి సత్కరించింది. ఆమె ‘నాలోనేను’ అనే స్వీయ చరిత్రాత్మక నవలను కూడా రచించారు. అత్తగారి కథలు, నాలో నేను గ్రంథాలు ఆమెలోని ప్రతిభకు తార్కాణాలుగా నిలిచాయి.

అవార్డులు
1956నందు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర గౌరవ పురస్కారము
మూడు సార్లు జాతీయ అవార్డులు (అన్నై అను తమిళ సినిమాకు, అంతస్తులు , పల్నాటి యుద్ధం అను తెలుగు సినిమాలకు)
అన్నాదురై నడిప్పుకు ఇళక్కనం (నటనకు వ్యాకరణం) అని బిరుదు ఇచ్చి గౌరవించాడు.
1966లో ఆమె రాసిన అత్తగారి కథలు అను హాస్యకథల సంపుటికిగాను పద్మశ్రీ బిరుదు ఇచ్చి భారత ప్రభుత్వము ఈమెను సత్కరించింది.
ఇదే సంపుటికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడెమీ అవార్డు కూడా వచ్చింది.
1975 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు కళా ప్రపూర్ణ ఇచ్చి సత్కరించింది.
1984 కలైమామణి బిరుదుతో తమిళనాడు నందలి ఐయ్యల్ నాటక మన్రము సత్కరించింది.
బహుకళా ధీరతి శ్రీమతి అను బిరుదుతో 1984ననే లయన్స్ క్లబ్బు సత్కరించింది.
1984లో తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటుతో సత్కరించింది.
1986లో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డును ఇచ్చింది.
1986 లో ఉత్తమ దర్శకురాలిగా అవార్డును ఆంధ్ర ప్రభుత్వము నుండి అందుకుంది.

భానుమతి మూడుసార్లు జాతీయస్థాయి ఉత్తమనటిగా అవార్డులు అందుకున్నారు. తమిళనాట కూడా ఆమె చిత్రాలు విజయదుందుభిని మోగించాయి. అప్పట్లో తమిళనాడు ముఖ్యమంత్రి అన్నాదురై భానుమతికి ‘కలైమామణి’ బిరుదును ఇచ్చి సత్కరించడం విశేషం. తమిళనాట ఆమెను అష్టావధానిగా పిలిచేవారు. ఎందుకంటే అప్పటికే భానుమతి నటిగానేగాక, తన పాత్ర కు తానే పాటలు స్వయంగా పాడుకునేవారు.

తన బహుముఖ ప్రజ్ఞా విశేషాలతో ఎన్నో సాధించి, ఎందరికో ఆదర్శంగా నిలిచిన భానుమతీ రామకృష్ణ 2005వ సంవత్సరం, డిసెంబర్ 24వ తేదీన చెన్నైలోని తన స్వగృహంలో కన్నుమూశారు.

Scroll to Top