పాత్రలకు జీవం పోసిన నటి

వయసుకు మించిన పాత్రల్లో జీవించిన నిర్మలమ్మ
ఫిబ్రవరి 19 నిర్మలమ్మ వర్థంతి

సినీనటి నిర్మలమ్మ తెలుగు చిత్రసీమలో బామ్మ పాత్రలకు ప్రాణం పోసిన సహజనటి. నిర్మలమ్మ వందలాది తెలుగు చిత్రాలలో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక పాత్రలలో నటించిన ఆమె సహజ నటిగా గుర్తింపు పొందారు.

నిర్మలమ్మ అసలు పేరు రాజమణి. స్వస్థలం కృష్ణా జిల్లా బందరు. చిన్ననాటినుంచి నాటకాలంటే ఆమెకు ప్రాణం. ఆదే ఆమె సినీరంగ ప్రవేశానికి ద్వారాలు తెరిచింది. 1943లో తన పదహారేళ్ల వయసులో గరుడ గర్వభంగం సినిమాలో చెలికత్తె పాత్రలో తొలిసారి నటించారు. ఆ తరువాత సుమారు వెయ్యి సినిమాల్లో నటించారు. తనకన్నా పెద్దవారైన నాటి నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, యస్వీ రంగారావు ల నుంచి నేటి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వరకు ఎందరో హీరోలకు బామ్మగా, అమ్మగా నటించారు. మయూరి, సీతారామరాజు సినిమాలకు నంది అవార్డులను అందుకున్నారు.

శంకరాభరణం, యమగోల, పదహారేళ్ల వయసు, మావిచిగురు, గ్యాంగ్ లీడర్, శుభసంకల్పం, ఆపద్బాంధవుడు, స్వాతిముత్యం తదితర చిత్రాల్లో వయసు మీద పడినా ఓపికతో నటించిన ఆమె అనంతరం ఆరోగ్యకారణాలతో నటన విరమించుకున్నారు. స్నేహం కోసం చిత్రం తరువాత ఆమె దాదాపు నటించటం మానేశారు. ఎస్వీ కృష్ణారెడ్డి బలవంతం మీద ఆమెను చివరి చిత్రం ప్రేమకు ఆహ్వానంలో నటించడానికి ఒప్పించాడు.

ప‌ద‌హార‌వ యేటా సినీ రంగంలోకి ప్ర‌వేశం చేసి సుమారు 60 ఏండ్ల పాటు తెలుగు తెర‌పై ప‌లు పాత్ర‌ల‌ను పోషించారు. వీటిలో బామ పాత్ర‌ల‌కు పెట్టింది పేరుగా నిలిచారు. ఆమె తొలి త‌రంలో నాట‌కాలు న‌టించిన త‌రువాత రోజులు మాత్రం వెయ్యి వ‌ర‌కు సినిమాల్లో న‌టించారు. ఆమెకు న‌ట‌న అంత పిచ్చి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కృష్ణాజిల్లాలోని మచిలీప‌ట్నంలో గంగ‌య్య‌, కోట‌మ్మ దంప‌తులకు 1905లో నిర్మ‌ల‌మ్మ జ‌న్మించారు. ఈమె అస‌లు రాజ‌మ‌ణి. ప‌దేండ్ల‌కే నాట‌క‌రంగంలోకి అడుగుపెట్టారు నిర్మ‌ల‌మ్మ‌. స‌తీస‌క్కుబాయి అనే నాట‌కం చేస్తున్న‌ప్పుడు నిర్మ‌ల‌మ్మ గొంతు స‌రిగ్గా తెగ‌ల‌క‌పోయేది. దీంతో ప్రేక్ష‌కుల్లో ఒక‌టే అల‌జ‌డి. త‌రువాతి కాలంలో దొంగాట‌కం వంటి నాట‌కాల్లో త‌న గొంతు స‌రిచేసుకుని ప్ర‌ధాన పాత్ర‌లు పోషించి బేష్ అనిపించారు.

తెలుగు సినిమా అత్త‌గా సూర్య‌కాంత‌మ్మ పేరు సాధించ‌గా బామ్మ‌గా మాత్రం నిర్మ‌ల‌మ్మ నిలిచిపోయారు. చిరుప్రాయంలో సూర్య‌కాంత‌మ్మ ఎన్నో పాత్ర‌లు వేసి మెప్పించి రాను రాను వెన‌క‌బడుతూ రాగా..నిర్మ‌ల‌మ్మ చిన్న వ‌య‌స్సులో ప్రాముఖ్య‌త లేని పాత్ర‌లు వేస్తూ వ‌చ్చిన వ‌య‌స్సు మీద‌ప‌డే బామ్మ పాత్ర‌ల్లో బ్ర‌హ్మాండంగా రాణించారు. నిర్మ‌ల‌మ్మ సినిమా రంగానికి వ‌చ్చే ముందు ఎన్నో క‌ష్ట‌న‌ష్టాలు ఎదుర్కున్నారు. ఆమె గురించి తెలుసుకుంటే మ‌నమంతా ఎంత‌గానో ఇన్‌స్పెయిర్ అవుతాము. ఆమెకు న‌ట‌న అంటే ప్రాణం. న‌ట‌న కావాలా..? పెళ్లి కావాలా అంటే న‌ట‌నే కావాలని ప‌ట్టు ప‌ట్టే ర‌కం. కండీష‌న్లు పెట్టి మ‌రీ పెళ్లాడిన గ‌తం నిర్మ‌ల‌మ్మ‌ది.

కాకినాడ‌లో క‌రువు రోజులు అనే నాట‌కంలో న‌టిస్తుండ‌గా.. పృథ్విరాజ్‌క‌పూర్ నుంచి ఆమెకు ప్ర‌శంస‌లు అందాయి. వ‌చ్చే రోజుల్లో మంచి నటిగా పేరు సాధిస్తామ‌న్న ఆశీస్సులు సైతం అందుకున్నారు. నిర్మ‌ల‌మ్మ భ‌ర్త పేరు జీవీ కృష్ణారావు. ఈయ‌న కూడా రంగ‌స్థ‌ల న‌టుడే. ఒక సంద‌ర్భంలో నిర్మ‌ల‌మ్మ‌నుచూసి ప్రేమ‌లో ప‌డ్డ ఆయ‌న సాంప్ర‌దాయం ప్ర‌కారం.. పెళ్లి చూపుల కోసం నిర్మ‌ల‌మ్మ ఇంటివ‌ద్ద‌కు వెళ్లాడు. తాను పెళ్లి అయ్యాక కూడా న‌టిస్తాన‌ని.. న‌ట‌న‌కు అడ్డు చెప్ప‌కుంటేనే ఈ పెళ్లికి ఒప్పుకుంటాన‌ని కండీష‌న్ పెట్టింది. ఇంట్లో వారంద‌రూ ఆమెకు స‌ర్ది చెప్పే ప్ర‌య‌త్నం చేయ‌గా.. కృష్ణ‌రావు మాత్రం త‌న‌కున్న నాట‌కాల పిచ్చిని అర్థం చేసుకున్నారు. దీంతో వారిద్ద‌రికీ వివాహం జ‌రిగింది.

వివాహం జ‌రిగిన ఉద‌యం అనే నాట‌క సంస్థ‌ను ఏర్పాటు చేశారు. నాట‌క రంగంలో మంచి పేరు రావ‌డ‌మే కాదు.. కొంద‌రూ సినీ ప్ర‌ముఖులు సినిమాలు చేయ‌వ‌చ్చు క‌దా అని కోర‌డంతో భార్య భ‌ర్త‌ల దృష్టి సినిమాల వైపు మళ్లింది. నిర్మ‌ల‌మ్మ తొలి చిత్రం గ‌రుడ గ‌ర్వ భంగం ఈ చిత్రంలో నిర్మ‌ల‌మ్మ చెలిక‌త్తే పాత్ర‌లో న‌టించింది. తిరునాళ్ల‌లో చిన్న చిన్న పాత్ర‌లు రావ‌డం.. భ‌ర్త ప్రొడక్ష‌న్ మేనేజ‌ర్ అవ‌తారం ఎత్తి అంతంతా సినిమాలు ద‌క్క‌డంతో డ‌బ్బుకు బాగా క‌ష్టంగా ఉండేది. దీంతో అప్పులు చేయాల్సి వ‌చ్చేది. ఈ అప్పులు తీర్చ‌డానికి తిరిగి నాట‌క రంగం వైపున‌కు వెళ్లాల్సి వ‌చ్చింది. కొన్నాళ్ల త‌రువాత 1961లో కృష్ణ‌ప్రేమ అనే చిత్రంలో నిర్మ‌ల‌మ్మ రుక్మిణి పాత్ర ల‌భించింది. ఆ త‌రువాత కాలంలో మంచి అవ‌కాశాలు లభించాయి.

భార్య‌, భ‌ర్త‌లు చిత్రంలో అక్కినేని త‌ల్లిదండ్రులుగా గుమ్మ‌డి-నిర్మ‌ల‌మ్మ క‌లిసి న‌టించారు. ఈ కాంబినేష‌న్ హిట్ కావ‌డంతో ఈ ఇద్ద‌రు 20 సినిమాల వ‌ర‌కు జంట‌గా న‌టించారు. మ‌నుషులు మారాలిలో శోభ‌న్‌బాబుకు త‌ల్లి పాత్ర పోషించ‌గా.. అక్క‌డి నుంచి త‌ల్లి, పిన్ని పాత్ర‌లు పోషిస్తుండ‌గా.. ఆ క్యారెక్ట‌ర్లు ఆమెకు వెతుక్కుంటూ వ‌చ్చాయి. ఇలా క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు నిర్మ‌ల‌మ్మ‌. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ‌, శోభ‌న్‌బాబు త‌రం త‌రువాత ఆమె చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున, వెంక‌టేష్ త‌రంలో న‌టించారు. క‌ర్త‌వ్యం, కిల్ల‌ర్‌, స్వాతిముత్యం, సోగ్గాడేపెళ్లాం, గ్యాంగ్‌లీడ‌ర్‌, మాయ‌లోడు, ఆ ఒక్క‌టి అడ‌క్కు వంటి ఎన్నో సినిమాల్లో బామ్మ‌గా న‌టించి తెలుగింటి బామ్మ‌గా స్థిర‌ప‌డిపోయారు. ఓరీ తింగ‌రి స‌చ్చినోడా.. నీ అమ్మ క‌డుపు మాడా అంటూ.. నిర్మ‌ల‌మ్మ తిట్టిన తిట్లు కూడా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతాయి. నిర్మలమ్మ అనారోగ్యంతో హైదరాబాదు‌లో 19 ఫిబ్రవరి, 2009న మృతిచెందారు.

Scroll to Top