మల్టీ స్టారర్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘భైరవం’


తెలుగులో ముగ్గురు హీరోలు మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్‌కి కలిసి నటించిన ‘భైరవం’ అనే మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ ‘గరుడాన్’ సినిమాకు విజయ్ కనకమేడల మార్పులు, చేర్పులు చేసి ‘భైరవం’గా మార్చారు. ఈ చిత్రం విశేషాలు.

దేవీ పురంలో వారాహి అమ్మవారి దేవాలయానికి ధర్మకర్త నాగరత్నమ్మ (జయసుధ) ఉంటారు. ఆమె మనవడు గజపతి వర్మ (మంచు మనోజ్), అతని స్నేహితుడు వరద(నారా రోహిత్) కలిసి మెలిసి ఉంటాడు. గజపతి వర్మకు నమ్మిన బంటు శ్రీను (బెల్లంకొండ శ్రీనివాస్). మంత్రి విదుర పల్లి (శరత్ లోహితశ్వ)కి వారాహి అమ్మవారి ఆలయ భూముల మీద కన్ను పడుతుంది. వెయ్యి కోట్ల విలువైన ఆ భూమిని కాజేయాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో నాగరాజు (అజయ్) సాయం తీసుకుంటాడు. ఈ స్కాంలోకి సీఐ పార్థసారథి (సంపత్)ని లాగుతారు. ఇక వీరి కుట్రతో గజపతి, వరద మధ్య దూరం ఎలా పెరుగుతుంది? గజపతి భార్య నీలిమ (ఆనంది), వరద భార్య పూర్ణిమ (దివ్యా పిళ్లై), శ్రీనుని ప్రేమించే వెన్నెల (అదితీ శంకర్) పాత్రల ప్రాముఖ్యత ఏంటి?చివరకు శ్రీను ఎవరి వైపు నిలబడతాడు? నమ్మిన బంటు గానే ఉంటాడా? ధర్మం వైపు నిలబడతాడా? అన్నది కథ.

భైరవం సినిమా తమిళ చిత్రానికి రీమేక్. సూరి, శశి కుమార్, ఉన్ని ముకుందన్ కలిసి చేసిన ‘గరుడాన్’ మూవీని తెలుగులో విజయ్ కనకమేడల రీమేక్ చేశాడు. అక్కడ సూరి పోషించిన పాత్రను ఇక్కడ బెల్లంకొండ శ్రీను, శశి కుమార్ పోషించిన పాత్రను నారా రోహిత్, ఉన్ని ముకుందన్ వేసిన పాత్రను ఇక్కడ మనోజ్ పోషించారు. ఇక ఈ కథలో ఉన్ని ముకుందన్ కారెక్టర్‌లో ఎక్కువ షేడ్స్, ఎక్కువ విలనిజం ఉంటుంది.. కానీ తెలుగులో వచ్చే సరికి ఆ స్థాయిని చాలా తగ్గించారు. మనోజ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా మార్చేశారు. మనోజ్ తనలోని నెగెటివ్ షేడ్స్‌ని, విలనిజాన్ని చక్కగానే పండించారు.

తమిళంలో సూరి పోషించిన పాత్రను తెలుగులో బెల్లంకొండ శ్రీను పోషించాడు. అయితే ఈ పాత్రలోని సోల్ మాత్రం మిస్ అయినట్లు అనిపిస్తుంది. ఒరిజినల్ పాత్రలో సూరీ తన యజమాని మీద ఈగ కూడా వాలనివ్వడు. ప్రాణమిత్రుడైనా సరే తన యజమాని మీద చేయి లేపినా, గొంతు ఎత్తినా అడ్డుకుంటాడు. కానీ ఇక్కడ తెలుగులో మాత్రం అలా ఉండదు. ఒకరి వైపు నిలబడకుండా.. ఇద్దరినీ బ్యాలెన్స్ చేసినట్టుగా ఆ క్యారెక్టర్ అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్‌ని కూడా కాస్త మార్చినట్టుగా కనిపిస్తుంది. అక్కడ సూరి ఏమో తన యజమాని ఉన్ని ముకుందన్ చెప్పడం, సైగ చేయడంతో చేతిని నరికేస్తాడు. ఇక్కడ ఉన్నది బెల్లంకొండ కాబట్టి.. ఆ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఉండాలి కాబట్టి.. సొంతంగానే నిర్ణయం తీసుకుని చేతిని నరికినట్లు చూపించారు.

ఇలా విజయ్ కనకమేడల చాలా వరకు చిన్న చిన్న మార్పుల్ని చేశారు. అలా చివరకు ఈ భైరవం ముగ్గురు హీరోల కథ అన్నట్టుగా మారింది. కానీ గరుడాన్ మాత్రం మూడు పాత్రల చుట్టూ తిరిగే కథగా అనిపిస్తుంది. ఒరిజినల్‌కు, ఈ రీమేక్‌కు పోల్చుతూ పోతే ఇక చివరకు ఏమీ మిగలేదేమో అన్నట్టుగా ఉంటుంది. మాస్ ఆడియెన్స్‌కు నచ్చేలా హీరోల ఎంట్రీని పెట్టాడు విజయ్ కనకమేడల.

ఇక తమిళంలో ఒరిజినల్ సినిమా చూడని వారు కనుక ఈ భైరవం మూవీని చూస్తే కాస్త బెటర్‌గా ఫీల్ అవుతారు. మనోజ్ యాక్టింగ్, మనోజ్ అప్పియరెన్స్ చాలా కొత్తగా అనిపిస్తుంది. బెల్లంకొండ శ్రీను కూడా తన విశ్వరూపం చూపించినట్టు అనిపిస్తుంది. ఒరిజినల్‌లోని ఉన్న ట్విస్టుల్ని తెలుగులోనూ పెద్దగా మార్పులు చేయకుండా పెట్టేసుకున్నారు. అయినా ఆ ట్విస్టులు కూడా గొప్పగా, ఆశ్చర్యపోయేలా అయితే ఉండవు. కథ, కథనం కొత్తగా ఏమీ అనిపించకపోయినా.. మనోజ్, శ్రీను నటన ప్రధానంగా అందరినీ మెప్పిస్తుంది.

హీరోయిన్లలో ఆనంది, దివ్యా పిళ్లై పాత్రలకు మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక అదితీ శంకర్ పాత్ర అయితే రొటీన్ కమర్షియల్ హీరోయిన్‌‌లా అనిపిస్తుంది. అజయ్ కారెక్టర్, సందీప్ రాజ్ పాత్రలు బాగుంటాయి. జయసుధ, గోపరాజు రమణ, ఇనయ సుల్తానా, టెంపర్ వంశీ, సంపత్, శరత్, వెన్నెల కిషోర్ ఇలా అన్ని పాత్రలు ఓకే అనిపిస్తాయి.

ఫస్ట్ హాఫ్‌లో చాలా వరకు అసలు కథ స్టార్ట్ కాదు. పోలీస్ ఆఫీసర్ సంపత్ పాత్రతో ఈ కథను ఆడియెన్స్‌కు నెరేట్ చేస్తుంటాడు. ముగ్గురు హీరోల పరిచయం, గుడి భూమి మీద మంత్రి కన్ను పడటం, పావులు కదిపేందుకు అజయ్ పాత్ర ఎంట్రీ ఇవ్వడం.. హీరోల మధ్య కాస్త దూరం పెరిగినట్టుగా అనిపించడం.. ఆ తరువాత ఇంటర్వెల్ బ్లాక్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో అసలు కథ, సంఘర్షణ మొదలవుతుంది. వరద, గజపతి పాత్రల మధ్య వచ్చే సీన్ బాగుంటుంది. ఇటుక బట్టీలో వచ్చే సీన్ మెప్పిస్తుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో మార్పులు చేర్పులు చేసినా కూడా మాస్ ఆడియెన్స్‌ను మెప్పిస్తాయి.

సాంకేతికంగా భైరవం మూవీ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. విజువల్స్ గ్రాండియర్‌గా ఉంటాయి. ఆర్ఆర్ అదిరిపోతుంది. ముగ్గురు హీరోలకు మూడు రకాల థీమ్స్‌ను అదరగొట్టేశాడు. సాంగ్స్ వినడానికి, చూడటానికి బాగుంటాయి. కానీ కథలో మాత్రం అడ్డు పడినట్టుగా అనిపిస్తుంది. ఇక మాటలు కొన్ని చోట్ల మెప్పిస్తాయి. వరదను దాటి చేయడు.. దాచి మాట్లాడడు.. మనలో మనకే జరిగే కురుక్షేత్రం అంటూ రాసిన కొన్ని డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ బాగుంటుంది. నిర్మాణ పరంగా భైరవం చాలా రిచ్‌గా ఉంటుంది. ఎక్కడా కూడా రీమేక్ మూవీ అన్నట్టుగా కనిపించదు.

నటులు:బెల్లంకొండ శ్రీనివాస్,నారా రోహిత్,మంచు మనోజ్, జయసుధ, అజయ్, ఆనంది, దివ్యా పిళ్లై, గోపరాజు రమణ, ఇనయ సుల్తానా, టెంపర్ వంశీ, సంపత్, శరత్, వెన్నెల కిషోర్ తదితరులు.
దర్శకుడు: విజయ్ కనకమేడల

Scroll to Top