పాటలపల్లకిలో ఊరేగించిన వేటూరి

తెలుగు సినీరంగాన్ని పాటల పల్లకిలో ఊరేగించిన మేటి సినీకవి వేటూరి సుందరరామ్మూర్తి. ఆయన వర్ధంతి ఈనెల 22. ఈ సందర్భంగా ఆయనను స్మరించుకుందాం…

ఆయన పేరు వింటే కృష్ణాతరంగాలు సారంగ రాగాలు వినిపిస్తాయి. ఆయన పేరు తలచినంతనే పాట వెన్నెల పైటేసి ఒయ్యారమొలకబోస్తుంది. నాట్యం విలాసంగా నర్తిస్తుంది. ఆయనే పాటల సిరి.. వేటూరి. ఆ సుందరమూర్తి శృంగార కవే కాదు.. ఆధ్యాత్మిక తత్వాన్ని, జీవిత పరమార్థాన్ని సంపూర్ణంగా అవగతం చేసుకున్న భక్త యోగకవి. అల్లరి పాటలతో ‘మాస్‌’ మనసులను దోచుకున్నా, యమకగమకాలతో ‘క్లాస్‌’ మదిని ఝమ్మనిపించినా అది ఆయనకు మాత్రమే సాధ్యం. సాహిత్య విలువలు కలిగిన వైవిధ్యభరిత గీతాలెన్నింటినో మనకందించి, అందరి మదిలో పాటై నిలిచిపోయిన సినీ కవిరాజు వేటూరి సుందరరామ్మూర్తి

వేదం, నాదం, శాస్త్రం మూడు విభూది రేఖలుగా తెలుగుజాతి కీర్తి పతాకమై విరాజిల్లే పెదకళ్లేపల్లి గడ్డపై వేటూరి సుందరరామ్మూర్తి పుట్టారు. వేటూరి చంద్రశేఖర శాస్త్రి – కమలమ్మ దంపతులకు 1936 జనవరి 29వ తేదీన పెదకళ్లేపల్లి గ్రామంలో వేటూరి సుందరరామ్మూర్తి జన్మించారు. వేటూరి కవిని కన్నతల్లి గర్భంబు ధన్యంబు అని జాషువా చెప్పినట్లు ఆయన తల్లి 40 ఏళ్ల వయస్సులో నవమాసాలు మోసి మూడురోజులపాటు ప్రసవ వేదన భరించి ఈ కవి రత్నాన్ని ఆంధ్రజాతికి అందించింది. తెలుగు సాహితీ దిగ్గజాల్లో ఒకరైన వేటూరి ప్రభాకరశాస్త్రి ఈయన పెద్దనాన్న.మద్రాసులోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్, బెజవాడలో డిగ్రీ పూర్తిచేశారు. ఆంధ్ర ప్రభ పత్రిక ఉప సంపాదకుడిగా పనిచేశారు. 1956 నుంచి పదహారేళ్ళపాటు పాత్రికేయ వృత్తిలో ఉన్నారు.

తొలినాళ్ళలో పాత్రికేయునిగా పనిచేసిన వేటూరి కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీత కథ ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. తర్వాత కొన్ని వేల పాటలను రాశారు. వేటూరి సుందరరామ్మూర్తి 8 నంది అవార్డులతో పాటు మొత్తం 14 అవార్డులు, ఒక జాతీయ పురస్కారం అందుకున్నారు. తెలుగు పాటకు శ్రీశ్రీ తర్వాత జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టింది వేటూరియే.

స్వరాలకు పద సౌందర్యాన్ని అద్ది, సాహిత్య సామ్రాజ్యంలో ప్రకాశింపచేసిన మూర్తి వేటూరి 18 ఏళ్ల ప్రాయంలోనే కలం పట్టుకుని పత్రికా రంగంలో ప్రవేశించారు. 1962లో నాటి ప్రధాని నెహ్రూ శ్రీశైలం విచ్చేసిన సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు. ఆంధ్ర జనతా పత్రికలో ఎడిటర్‌గా ఎదిగి, భద్రాచలం సమీపంలోని పాల్వంచ వద్ద జరిగిన ఒక బహిరంగ సభలో నాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ పొరపాటుగా మాట్లాడిన అంశాన్ని బాక్స్‌ ఐటమ్‌గా ఇచ్చి సంచలనం సృష్టించిన ధైర్యవంతుడు వేటూరి. ఈయన కలం నుంచి జాలువారి, ఆంధ్రదేశాన్ని ఒక ఊపు ఊపిన ‘సిరికాకుళం చిన్నది’ గేయ రూపకాన్ని సినీ దర్శకుడు విశ్వనాథ్‌ విని, తొలిసారిగా ఓ సీత కథ చిత్రంలో వేటూరికి అవకాశం కల్పించారు. నాటి నుంచి వేటూరి సినీ వినీలాకాశంలో ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఈయన మది నిండా భావాలే. ఈయన పెదవి విప్పితే మాట పాటై ఎదుట నిలుస్తుంది. ఈయన కలానికి పదునూ, వేగం రెండూ ఎక్కువే. అందుకే ఆయన 1974 నుంచి 1800 తెలుగు సినిమాలకు ఆరు వేల పాటలను అందించి, తనదైన ఇజాన్ని సృష్టించుకున్నారు. నంది సహా ఎన్నో జాతీయ స్థాయి అవార్డులను అందుకున్నారు.

సాంప్రదాయ కీర్తనల్లోని పల్లవుల్ని, పురాణసాహిత్యంలోని పంక్తుల్నీ గ్రహించి అందమైన పాటల్ని అలవోకగా రచించడంలో ఆయన అసాధ్యుడు. వేటూరి అనగానే వెంటనే స్ఫురించేది అడవి రాముడు, శంకరాభరణం. ఇంకా సిరిసిరిమువ్వ, సాగరసంగమం, సప్తపది, సీతాకోకచిలుక, ముద్దమందారం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం… ఇలా ఎన్నో సినిమాలు…ఈ సినిమాలలోని అందమయిన అద్బుతమయిన పాటలు!

“పిల్లనగ్రోవికి నిలువెల్లగాయాలు అల్లన మ్రోవిని తాకితే గేయాలు” “నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మా ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ” ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు స్పందించు నవనాడులే వీణాగానాలు కదులు ఎదలోని సడులే మృదంగాలు ఇలాంటి అపురూప పదవిన్యాసాలు ఆయన పాటల్లో అడుగడుగునా కనిపిస్తాయి.

వేటూరి చాలా రకాల పాటలను రాసారు. సంప్రదాయ కవిత్వం దగ్గర నుండి జానపద గీతాల వరకు అన్నింటిలోనూ తన ప్రతిభను నిరూపించుకున్నారు.పండితుల నుండి పామరుల వరకు అందరిని అలరించిన విశిష్ట శైలి ఈయన సొంతం. శ్రీశ్రీ తర్వాత తెలుగు సినిమా పాటకి జాతీయ ఉత్తమ సినిమా పాటల రచయిత పురస్కారాన్ని అందించారు. ఆయన మాతృదేవోభవ సినిమాకి రాసిన రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే… అనే పాటకి 1994వ సంవత్సరానికి గాను ఈ పురస్కారం వచ్చింది. ఇది తెలుగు పాటకు రెండవ జాతీయ పురస్కారం. అయితే కేంద్ర ప్రభుతం తెలుగు భాషకు ప్రాచీన భాషా హోదా ఇవ్వనందుకు నిరసనగా తన పాటకు వచ్చిన జాతీయ పురస్కారాన్ని తిరిగి ఇచ్చి వేసిన మాతృ భాషాభిమానం ఈయన వ్యక్తిత్వ శైలికి ఒక మచ్చు తునక.

తెలుగు పాటకు వన్నెలద్ది, సంస్కృత సమాసాలనైనా, సరస పదాలనైనా అలవోకగా లిఖించిన వేటూరి, 2010 మే22న పాటల పల్లకిలో ఊరేగుతూ గంధర్వ లోకాలకు వెళ్లిపోయారు. ఆయన భౌతికంగా కనుమరుగైనా, తెలుగు వారి గుండెల్లో పాటై, నట్టింట్లో కూనిరాగమై నిలిచే ఉంటారు.

Scroll to Top