ప్రజా వాగ్గేయకారుడు..గద్దర్

ప్రజా వాగ్గేయకారుడు… గద్దర్
బడుగు, బలహీన వర్గాల గొంతు గద్దర్
ప్రజా గాయకుడు గద్దర్ ఇకలేరు…

బడుగు, బలహీన వర్గాల సమస్యలపై గొంతెత్తిన ‘ప్రజా యుద్ధనౌక’ ఆగిపోయింది. తన పాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చిన ఆ గొంతు శాశ్వతంగా మూగబోయింది. ప్రజా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం (ఆగస్టు 6) మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. ఉమ్మడి మెదక్ జిల్లా తూఫ్రాన్‌‌కు చెందిన లచ్చమ్మ, శేషయ్య దంపతులకు 1949లో ఆయన జన్మించారు. కొన్ని రోజుల కిందట ఆయన గుండె సంబంధిత రుగ్మతతో బాధపడుతూ అమీర్‌పేటలోని ఆపోలో స్పెక్ట్రా ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆయన గుండెకు బైపాస్ సర్జరీ నిర్వహించారు. పలువురు ప్రముఖులు ఆస్పత్రిలో ఆయణ్ని పరామర్శించారు. కోలుకుంటున్నానని ప్రకటన కూడా విడుదల చేశారు గద్దర్. కానీ, ఇంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అశేష అభిమానులను శోకసంద్రంలో ముంచారు.

గద్దర్‌కు భార్య విమల, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారి పేర్లు: సూర్యుడు, చంద్రుడు, వెన్నెల. గద్దర్ మరణవార్తను ఆయన కుమారుడు సూర్యం (సూర్యుడు) ధ్రువీకరించారు. నిజామాబాద్, హైదరాబాద్‌లో గద్దర్ విద్యాభ్యాసం చేశారు. 1975లో కెనరా బ్యాంకులో ఉద్యోగం చేశారు.

పొడుస్తున్న పొద్దు మీద..

తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్ పాడిన ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా.. పోరు తెలంగాణమా’ పాట ఎంతటి ప్రభావం చూపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉద్యమం అప్పటిదాకా ఒక ఎత్తు. ఆ పాట తర్వాత మరొక ఎత్తుగా కొనసాగింది. గద్దర్ ఆటా పాట కోట్లాది మందిని కదిలించింది. ఉద్యమాన్ని ఉరకలెత్తించింది. ‘అమ్మా తెలంగాణమా..’, ‘బండెనక బండి కట్టి..’, ‘భద్రం కొడుకో..’, ‘మదనాసుందరి’, ‘అడవి తల్లికి వందనం’ ఇలాంటి వందలాది పాటలతో ప్రభావం చూపారు గద్దర్. జనం గోసలను తన పాటల ద్వారా వినిపించారు. ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై పాటకు’కు నంది అవార్డుకు ఎంపికయ్యారు గద్దర్. కానీ, నంది అవార్డును స్వీకరించేందుకు తిరస్కరించారు.

పీపుల్స్‌ వార్‌, మావోయిస్టు ఉద్యమం, తెలంగాణ ఉద్యమాల్లో తన గొంతు వినిపించారు గద్దర్. తన గళంతో కోట్లాది మంది ప్రజలను ఉత్తేజపరిచారు. 1987లో కారంచేడు దళితుల హత్యలపై గద్దర్‌ అవిశ్రాంతంగా పోరాటం చేశారు. నకిలీ ఎన్‌కౌంటర్లను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే 1997 ఏప్రిల్‌ 6న గద్దర్‌పై హత్యాయత్నం జరిగింది. నాడు మరణం అంచుల దాకా వెళ్లి, ప్రాణాలతో బయటపడ్డారు. నాటి నుంచి ఆయన శరీరంలో ఒక బుల్లెట్ అలాగే ఉండిపోయింది. ఆ బుల్లెట్‌ను తొలగించేందుకు శస్త్రచికిత్స చేస్తే, ఆయన ప్రాణాలకే ప్రమాదమని అలాగే వదిలేశారు వైద్యులు.

గద్దర్ పేరు ఎలా వచ్చిందంటే?

1969 తెలంగాణ ఉద్యమంలోనూ గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. భావజాల వ్యాప్తి కోసం ఊరురా తిరిగి బుర్రకథలతో ప్రచారం చేసేవారు. అలా ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకులు బి. నరసింగరావు.. భగత్ సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ప్రతి ఆదివారం ఆయన ప్రదర్శనలు ఇచ్చేవారు. 1971లో బి. నరసింగరావు ప్రోత్సాహంతో గద్దర్ ‘ఆపర రిక్షా’ పేరుతో తన మొదటి పాట రాశారు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. ఇదే ఆయన పేరుగా స్థిరపడింది.

గండె సమస్య నుంచి బయటపడ్డా.. లంగ్స్ సమస్య తిరగబెట్టడంతో
గద్దర్ మృతిపై అపోలో స్పెక్ట్రా ఆస్పత్రి (అమీర్‌పేట) ఒక ప్రకటన విడుదల చేసింది. ఊపిరితిత్తులు, మూత్రపిండాల సమస్యలతో భాద పడుతూ గద్దర్ కన్నుమూశారని తెలిపింది. ‘గుమ్మడి విఠల్ రావు అలియాస్ గద్దర్ తీవ్ర గుండె సంబంధిత సమస్యతో జూలై 20న అడ్మిట్ అయ్యారు. ఆయనకు ఆగస్టు 3న బైపాస్ సర్జరీ నిర్వహించాం. దాని నుంచి ఆయన కోలుకున్నారు. అయితే, ఆయన సుదీర్ఘ కాలంగా ఊపిరితిత్తులు, మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. ఆ సమస్యలు తీవ్రమవడంతో చికిత్స పొందుతూ.. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు చివరి శ్వాస విడిచారు’ అని ఆస్పత్రి వర్గాలు ప్రకటన విడుదల చేశాయి.. ఆయన అంత్యక్రియలు అశేషసంఖ్యలో హాజరైన అభిమానుల అశృనివాళుల మధ్య సోమవారం జరిగాయి.

Scroll to Top