హరికథా పితామహుడు ఆదిభట్ల

(జనవరి 2 ఆదిభట్ల నారాయణదాసు వర్థంతి)

అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు సంగీతం, సాహిత్యం, నృత్యాల మేళవింపుతో హరికథ ప్రక్రియని సృజించి ‘‘హరికథా పితామహ’’ అనే బిరుదంతో ప్రఖ్యాతిగాంచారు. సంస్కృతాంధ్రాలలో అనేక రచనలు చేసిన రచయిత, కవి, బహుభాషా కోవిదుడు, తాత్వికుడు. తెలుగునాటనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా హరికథా ప్రదర్శనలిచ్చి, ప్రజల మన్ననలను పొందిన కళాకారుడు. ఆయన వర్ధంతి జనవరి2.

1864 ఆగష్టు 31 న ఇప్పటి విజయనగరం జిల్లా, బొబ్బిలి వద్ద, ప్రస్తుతం బలిజిపేట మండలంలో ఉన్న అజ్జాడ గ్రామంలో లక్ష్మీ నరసమాంబ, వేంకటచయనులు దంపతులకు ఈయన జన్మించారు. ఆయన అసలు పేరు సూర్యనారాయణ. హరికథకుడిగా ప్రసిద్ధి చెందాక, ఆయన నారాయణదాసుగా ప్రఖ్యాతిగాంచారు. పేదరికం కారణంగా చిన్నతనంలో బడికి వెళ్ళలేకపోయినా, పద్యాలు, శ్లోకాలు విని, కంఠతా పట్టి తిరిగి వల్లించేవారు.
కేవలం ఐదేళ్ళ చిరు ప్రాయంలోనే, భాగవతం లోని పద్యాలు ఎన్నో చెప్పేవాడట. ఒకసారి వారి అమ్మగారు పిల్లవాడిని ఏదో పుణ్యక్షేత్రానికి తీసుకువెళ్ళిందట. అక్కడ పుస్తకాల కొట్టులో, భాగవతం చూసి (బాల దాసు)అది కావాలి అని మారాం చేస్తుంటే, ఆ కొట్టు యజమాని, భాగవతం నీకేమి అర్థమవుతుంది అన్నాడట. అంతే ఆ కుర్రవాడు ఆపకుండా భాగవతం లోని పద్యాలు గడగడా చెప్పేయడం చూసి, ఆ కొట్టు యజమాని ఆనందంగా పిల్లవానికి ఆ పుస్తకంతో పాటు, కొంత దక్షిణ కూడా ఇచ్చి పంపించాడుట.

ఇది ఇలా ఉండగా, ఒకసారి దాసు వాళ్ళ తాతగారింటికి వెళ్లినపుడు అక్కడ అరుగు మీద కూర్చుని రాగయుక్తంగా పద్యాలు పాడుతూ ఉంటే, అది చూసి వాళ్ళ తాతగారు ముచ్చటపడి, తన దగ్గరే ఉంచుకుని సంగీతం నేర్పుతానని వాళ్ళ అమ్మగారికి చెప్పాడట. దాంతో అప్పటిదాకా, ఎటో సాగుతున్న నావకి చుక్కాని దొరికినట్లైంది. తన 14 వ ఏట ఒకటవ తరగతిలో చేరారు. ఒకప్రక్క సంగీత సాధన, ఇంకో ప్రక్క విద్యాభ్యాసం. ఇలా రెంటినీ అతను ఎంతో నేర్పుగా సంబాళించగలిగారు చిన్నవయసులోనే.

అపార పాండిత్యం
తెలుగు, సంస్కృతం, తమిళం, హిందీ, బెంగాలీ, ఉర్దూ, ఆంగ్లం, అరబ్బీ, పారశీకం భాషలలో ఆయన ప్రావీణ్యం సంపాదించారు. అష్టావధానాలు చేసేవారు. అచ్చతెలుగులోను, సంస్కృతంలోను, వివిధ విషయాలపై శతాధిక గ్రంథాలు రచించిన మహా పండితుడు. అంతకు ముందు తెలుగులో ఉమర్‌ ఖయ్యామ్‌ రుబాయితులను వ్రాసినవారు ఎక్కువగా ఎడ్వర్డ్‌ ఫిడ్జిరాల్డ్‌ రచించిన ఆంగ్ల రచననే మూలంగా తీసుకొన్నారు. అలా చేయడం వలన మూలగ్రంథాలలోని విషయం సరిగా చూపడం కుదరలేదని తలచారు ఆదిభట్ల నారాయణదాసు. ఈ విషయం ఋజువు చేయడానికి ఆయన పారశీక భాష లోని మూల గ్రంథం కవితలనూ, ఫిడ్జిరాల్డ్‌ ఆంగ్లానువాదాన్నీ కూడా అచ్చ తెలుగులోకీ, సంస్కృతంలోకీ వేరు వేరు ఛందస్సులలో అనువదించారు. 1932లో వెలువడిన ఈ రచన పాండిత్యానికి పరాకాష్ఠగా ప్రశంసలందుకుంది. మరొక గొప్ప రచన – 1922లో ప్రచురితమైన నవరస తరంగిణి – ఇందులో సంస్కృత మహాకవి, నాటక కర్త కాళిదాసు రచనలనుండి, ఆంగ్లభాషలో ప్రసిద్ధ నాటక రచయిత షేక్స్‌పియర్‌ రచనలనుండి నవరసాలను వర్ణించే ఖండికలను తెలుగులోకి అనువదించి చూపాడు. మరొకటి ఉద్గ్రంథంగా చెప్పబడేది జగజ్యోతి అనే తాత్విక రచన. వివిధ భారతీయ తాత్వికుల సిద్ధాంతాలను, దృక్పథాలనూ ఈ గ్రంథంలో వివరించాడు. నారాయణదాసు సంస్కృత రచనలలో ముఖ్యమైనవి – మూడు హరికథల కూర్పు హరికథామృతం, స్వతంత్ర రచన తారకం, రెండు శతకాలు రామచంద్ర శతకం, కాశీ శతకం.
దశవిధ రాగ నవతి కుసుమ మంజరి అనే పాటలో మంజరీ వృత్తంలో 90 రాగాలు కూర్చాడు. అంతవరకూ ఎవరూ సాహసించని ఈ ప్రక్రియ సంగీతంలోనూ, కవితలోనూ నారాయణదాసుకు ఉన్న ప్రతిభకు తార్కాణం. ఋక్‌సంగ్రహం అనే బృహత్తర కావ్యంలో ఈయన ఋగ్వేదములోని 300 పైచిలుకు ఋక్కులకు సంగీతాన్ని సమకూర్చి, వాటిని వీణమీద వాయించడం విద్యార్థులకు నేర్పాడు. ఆ ఋక్కులను తెలుగులో గీతాలుగా అనువదించారు. నారాయణదాసు సంగీత ప్రతిభ ఆయన సాహితీ ప్రకర్షకు సమస్థాయిలో పరిమళించింది. ఆనాటి సంగీత విద్వాంసులు ఆయనను లయబ్రహ్మ అనీ, పంచముఖి పరమేశ్వర అనీ సన్మానించారు. ఒకేమారు ఐదు తాళాలకు అనుగుణంగా పాడడం ఆయన ప్రత్యేకత. ఈ పంచముఖి ప్రదర్శనలో నారాయణదాసు రెండు చేతులు, రెండు కాళ్ళు, తలలతో ఐదు తాళాలకూ దరువు చూపేవారు. అప్పుడు ఆయనకు ఐదుగురు వివిధ వాద్యకారులు సహకరించేవారు. సంగీత సాహిత్య స్వర బ్రహ్మ అని ఆయనకు బిరుదు ప్రసాదించారు. ఆనంద గజపతి నారాయణ దాసును తన ఆస్థాన విద్వాంసునిగా నియమించాడు.

హరికథా వైభవం
ఈయనకే ప్రత్యేకమైన హరికథని వెలుగులోకి తెచ్చింది మాత్రం జయంతి రామదాసు. అతని ప్రోద్బలంతో, మొదటి హరికథా కాలక్షేపాన్ని రాజమండ్రిలో ఏర్పాటు చేశారు. ఇప్పటిలా కరెంటు లేదు. మైకులు, సౌండ్‌ బాక్స్‌ లు లేవు. ఉన్నదల్లా, ఇసుక వేస్తే రాలనంత జనం, మధ్యలో వేదిక మీద నారాయణ దాసు. అంతే ఉన్నట్లుంది మ్రోగింది కంచు కంఠం . ఊరంతా ఉలిక్కిపడిరది. గంభీరమైన ఆకారం, ఒక చేతిలో చిడతలు, కాళ్ళకి గజ్జెలు. అలా మొదటి హరికథకి అంకురార్పణ జరిగింది. ఇక ఆ తరువాత నారాయణ దాసు వెనక్కి తిరిగి చూసుకోలేదు. అతని ఖ్యాతి వాడవాడలా వ్యాపించింది. కవిత్వం, సంగీతం, నాట్యం అనే మూడు రంగాలలోనూ తనకున్న ప్రతిభను జోడిరచి నారాయణదాసు హరికథ అనే కళను అత్యున్నత శిఖరాలకు కొనిపోయారు. ఈ మూడిరటి కలయికకూ భక్తి అనే భావం ప్రాణంగా హరికథలు రచించారు, చెప్పారు, నేర్పారు. ఆయన హరికథ వినడం ఒక గొప్ప అనుభూతిగా అప్పటివారు చెప్పుకొనేవారు. మొత్తం ఆయన తెలుగులో 17, సంస్కృతంలో 3, అచ్చతెలుగులో ఒకటి హరికథలను రచించారు. 1919లో అప్పటి విజయనగరం మహారాజు స్థాపించిన విజయరామ గాన పాఠశాలకు మొదటి ప్రధానాధ్యాపకునిగా నారాయణదాసును నియమించారు. ప్రసిద్ధ వయొలిన్‌ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు ఈయనకు సహాధ్యాపకునిగా ఉన్నారు. నారాయణదాసు ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలో చదువుకొన్నామని చెప్పుకోవడం అప్పట్లో ప్రతిష్ఠాత్మకంగా భావించేవారు. నారాయణదాసు హిందూస్థానీ భైరవి రాగాలాపనను గురుదేవులు రవీంద్రనాథ టాగూరు ఎంతగానో ప్రశంసించారు. తన జీవితం మొత్తం, తాను జన్మించిన తెలుగు గడ్డకి తన వంతు సేవ చేసి, 1945, జనవరి 2వ తేదీన మరణించారు.

Scroll to Top