ఇండియన్ మ్యూజిక్ ఐకాన్

ఇండియన్ మ్యూజిక్ ఐకాన్ ఏ.ఆర్. రెహమాన్

భారతీయ సినీ సంగీతానికి ట్రెండ్ సెట్టర్ ఎ. ఆర్. రెహమాన్ పేరుతో పేరుగాంచిన అల్లా రఖా రెహమాన్. 6 జనవరి 1967న జన్మించిన ఆయన్ సంగీత దర్శకుడు, స్వరకర్త, గాయకుడు, గీత రచయిత, నిర్మాత, సంగీతకారుడు,, దాతగా కూడా సుప్రసిద్ధుడు. రెహమాన్ జన్మనామం ఎ. ఎస్. దిలీప్ కుమార్. తండ్రి నుంచి సంగీత వారసత్వం పుచ్చుకున్న రెహమాన్ చిన్నతనంలో తండ్రి మరణంతో కుటుంబాన్ని పోషించడానికి పలువురు సంగీత దర్శకుల దగ్గర సహాయకుడిగా పనిచేశాడు. వాణిజ్య ప్రకటనలకు సంగీతం సమకూర్చాడు. తర్వాత మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా చిత్రానికి కూర్చిన సంగీతంతో మంచి పేరు వచ్చింది. మొదటి సినిమాతోనే ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారం దక్కింది.

రెహమాన్ గీతాలు తూర్పుదేశాలకు చెందిన శాస్త్రీయ సంగీతాన్ని (ముఖ్యంగా భారతీయ శాస్త్రీయ సంగీతం) ప్రపంచ సంగీతం, ఎలక్ట్రానిక్ సంగీతం, సంప్రదాయ ఆర్కెస్ట్రా అరేంజ్మెంట్లనూ మేళవించే శైలికి పేరొందాయి. ఆయన పొందిన పురస్కారాల్లో రెండు ఆస్కార్ అవార్డులు, రెండు గ్రామీ పురస్కారాలు, ఒక బిఎఎఫ్‌టిఎ పురస్కారం, ఒక గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు, నాలుగు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, పదిహేను ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, పదమూడు ఫిల్మ్ ఫేర్ సౌత్ పురస్కారాలు ఉన్నాయి.

తొలి జీవితం
రెహ్మాన్‌ అసలు పేరు ఎ. ఎస్‌. దిలీప్‌ కుమార్‌. తండ్రి ఆర్. కె. శేఖర్, తల్లి కస్తూరి. శేఖర్ సంగీత దర్శకుడు. ఆలయాల్లో భజన పాటలు పాడేవాడు. రెహమాన్ కు ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్ళు. అక్క కొడుకు జి. వి. ప్రకాష్ కూడా ప్రముఖ సంగీత దర్శకుడిగా ఎదిగాడు. నాలుగేళ్ళ వయసు నుంచే తండ్రి దగ్గర పియానో వాయించడం నేర్చుకున్నాడు. తొమ్మిది సంవత్సరాల ప్రాయంలోనే తండ్రి మరణించాడు. ఆ సమయంలో ఇంట్లోని సంగీత పరికరాల్ని అద్దెకిస్తూ కుటుంబాన్ని పోషించేది తల్లి. తల్లి, ముగ్గురు అక్కచెల్లెళ్ళు- పేదరికం. 11 సంవత్సరాల ప్రాయంలో కుటుంబ బాధ్యతలు నెత్తిపై వేసుకొని తల్లికి చేదోడుగా ఉంటూ గిటార్‌, హార్మోనియం, పియానో, కీబోర్డు ప్లేయర్‌గా ఇళయరాజా, రమేష్ నాయుడు, రాజ్ కోటి లాంటి పలు సంగీత దర్శకుల ట్రూప్‌లో పనిచేస్తూ జీవితం ప్రారంభించాడు. దూరదర్శన్ వండర్ బెలూన్ అనే ఒక కార్యక్రమంలో ఒకేసారు నాలుగు కీబోర్డులు వాయిస్తూ కనిపించాడు.
బడికి సరిగా వెళ్ళలేక పోయాడు. సంగీత దర్శకులు కూడా సొంత పరికరాలు కొనుక్కోవడంతో వీరి అద్దె వ్యాపారానికి గిరాకీ తగ్గింది. దాంతో తల్లి కూడా అతన్ని చదువు మానేసి సంగీతం మీదనే దృష్టిపెట్టమని చెప్పింది. మొదట్లో చదువుకోలేకపోయినందుకు అసంతృప్తి చెందినా తరువాత జీవిత పాఠాలు నేర్చుకున్నందుకు సంతోషపడ్డాడు. 1987 లో చెన్నై లోని కోడంబాకం లోకి వచ్చిన రెహమాన్ కుటుంబం అప్పటి నుంచీ అక్కడే ఉంటోంది. అమెరికాలోని లాస్ ఏంజిలెస్ లో కూడా రెహమాన్ కు ఓ ఇల్లుంది. పని ఒత్తిడి నుంచి బయటపడ్డానికి, సాధారణ జీవితం గడపడానికి అక్కడికి వెళుతూ ఉంటాడు.

తల్లి నగలు అమ్మి ఆధునిక హంగులతో ఇంట్లోనే ఒక స్టూడియో ప్రారంభించాడు. రెహమాన్ తల్లికి ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ. ఇంట్లో హిందూ దేవుళ్ళతోపాటు మేరీమాత, మక్కా మదీనా చిత్రాలు కూడా ఉండేవి. భర్త చనిపోయిన తర్వాత ఆమె ప్రశాంతత కోసం నెల్లూరు జిల్లా, తడ దగ్గరలోని సూఫీ ప్రవక్ర కరీముల్లా షా ఖాద్రీ బోధనలకు ఆకర్షితులై వీరి కుటుంబం 1989వ సంవత్సరంలో ఇస్లామ్‌లోకి మారింది. ఇది జరగక మునుపే చెల్లెలు పెళ్ళి కోసం ఓ జ్యోతిష్కుడి దగ్గరకు వెళ్ళారు. అప్పటికే దిలీప్ అనే పేరు అంతగా నచ్చని రెహమాన్ తనకు పేరు మార్చుకోవాలని ఉందని ఆయన్ను అడిగాడు. ఆయన అబ్దుల్ రహీమ్ కానీ అబ్దుల్ రెహమాన్ కానీ పేరు మార్చుకుంటే అంతా మంచే జరుగుతుందని సలహా ఇచ్చాడు. రెహమాన్ అనే పేరు నచ్చడంతో అప్పటి నుంచి అలాగే పేరు మార్చుకున్నాడు. తల్లి ఆ పేరు ముందు అల్లా రఖా అనే పేరును చేర్చింది. ఆమె కూడా తన పేరును కరీమాగా మార్చుకుంది.

 

సంగీత ప్రస్థానం
సినిమాల్లోకి రాక మునుపు బాపు సహకారంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన అక్షరమాల ప్రాజెక్టుకు సంగీతం సమకూర్చాడు. తెలుగులో రెహమాన్ మొదటి ప్రాజెక్టు అదే. బాపు కుమారుడు వేణుగోపాల్ వ్యక్తిగతంగా రెహమాన్ కు మంచి స్నేహితుడు కూడా. తన సంగీత జీవితాన్ని రాజ్ – కోటి లాంటి కొందరి వద్ద అసిస్టెంటుగా ప్రారంభించి, కొన్ని ప్రకటనలకు జింగిల్స్ సమకూర్చి, తదనంతరం మలయాళ దర్శకద్వయం సంతోష్-శివన్ ల దర్శకత్వంలో మోహన్ లాల్ కథానాయకునిగా నటించిన యోధ సినిమాతో పరిచయం అయ్యాడు. అయితే ప్రఖ్యాత తమిళ దర్శకుడు మణిరత్నం సినిమా రోజా ద్వారా మొత్తం భారతదేశమంతటా పేరు పొందాడు. మణిరత్నం సోదరి కుటుంబం నిర్వహించే ఓ వాణిజ్య ప్రకటనల సంస్థకు రెహమాన్ సంగీతం సమకూర్చేవాడు. అలా మణిరత్నంతో పరిచయం ఏర్పడింది.

“స్లమ్‌డాగ్ మిలియనీర్” అనే చిత్రంలో ‘జై హో’ అనే పాటకు సమకూర్చిన సంగీతానికి ప్రతిష్ఠాత్మకమైన “గోల్డెన్ గ్లోబ్ అవార్డు”ను కైవసం చేసుకున్న రెహ్మాన్ ఈ గౌరవం తనకు మాత్రమే దక్కలేదని, వంద కోట్ల భారతీయులందరికీ లభించిన అరుదైన గౌరవం అన్నారు. ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయుడు రెహ్మాన్. రెహ్మాన్ ప్రభావానికి తనుకూడా లోనుకాక తప్పలేదని తనకు రెహ్మాన్ అంటే భయమనీ, జలసీ అని ప్రఖ్యాత స్వరకర్త ఎస్ ఎల్ వైద్యనాథన్ అన్నాడు. రెహ్మాన్‌లా తను కూడా వేర్వేరు ప్లేన్స్‌లో, లేయర్స్‌లో, సకాలంలో వచ్చేకౌంటర్స్‌తో బాణీలు కట్టాలని ప్రయత్నించి చాలా సార్లు విఫలమైనానని ఒప్పుకున్నాడు. కర్నాటక సంగీతాన్ని, ఖవ్వాలీ సంప్రద్రాయాన్ని, రెగే, హిప్-హాప్, ర్యాప్, రాక్, పాప్, జాజ్, ఒపెరా, సూఫీ ఆఫ్రికన్, అరేబియన్, పాశ్చాత్య సంగీతాన్ని శ్రావ్యంగా మిళితం చేయగలిగాడు రెహ్మాన్. అలా చేస్తూ కూడా పూర్తి స్థాయి ఒరిజినల్ బాణీలను తయారుచేశాడు.

 

రెహమాన్ పొందిన గౌరవాలు బిరుదులు ఎన్నో ఉన్నాయి. టైమ్ మ్యాగజైన్ రెహ్మాన్‌ కు మొజార్ట్ ఆఫ్ మద్రాస్ బిరుదు ఇచ్చింది. ఆయన పాటలు ఆస్కార్ కు నామినేట్ అయ్యాయి. “స్లమ్‌డాగ్ మిలియనీర్” చిత్రంలో ‘జై హో’ పాటకు సమకూర్చిన సంగీతానికి ప్రతిష్ఠాత్మకమైన “గోల్డెన్ గ్లోబ్ అవార్డు”, రెండు ఆస్కార్ అవార్డులను అందుకొన్న తొలి భారతీయుడు. రెండు ఆస్కార్‌ అవార్డులను గెలుచుకొని భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లిన ఘనత రెహ్మాన్‌కే దక్కుతుంది. జాతీయ స్థాయిలో నాలుగుసార్లు ఉత్తమ సంగీత దర్శకుడుగా హిందీ, తమిళ చిత్రాలకు 19 సార్లు ఫిలిమ్‌ఫేర్‌ అవార్డులను, తమిళ ప్రభుత్వ అవార్డులను అందుకున్నాడు. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును స్వీకరించాడు. 2005 లో టైం మ్యాగజీన్ ఎంపిక చేసిన 10 ఉత్తమ సౌండ్ ట్రాక్స్ లో రోజా చిత్రంలోని పాట కూడా ఉంది. 2009 లో ప్రపంచంలోని అత్యంత ప్రభావశోలురైన వ్యక్తులలో ఒకడిగా గుర్తించింది. రెహమాన్ గౌరవార్ధం కెనడా లోని ఒంటారియో రాష్ట్రంలోని ఒక వీధికి అతని పేరు పెట్టారు.

వ్యక్తిగతం
రెహమాన్ భార్య సైరా బాను. సైరా కుటుంబం గుజరాత్ నుంచి వచ్చి చెన్నైలో స్థిరపడింది. తడ దర్గా ఖాద్రీ ఈమెను రెహమాన్ తల్లికి చూపించి సరైన జోడీ అని చెప్పారు. అలా వీరి వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఖతీజా, రహీమా, అమన్‌. రెహమాన్ పుట్టిన రోజైన జనవరి 6 నే కుమారుడు అమన్ కూడా జన్మించడం విశేషం.
50కి పైగా ప్రముఖ చిత్రాలకు సంగీత నిర్దేశకత్వం చేసిన రెహమాన్ తన స్వంత సంగీత పాఠశాల ‘కెఎమ్ మ్యూజిక్ కాలేజ్ అండ్ టెక్నాలజీ’ని రంజాన్ న 2013 ఆగస్టు 9న ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చేత లాంఛనంగా ప్రారంభింపజేశాడు. ఈ మ్యూజిక్ కాలేజ్ క్యాంపస్ వైశాల్యం దాదాపు 27వేల సెక్టార్లు ఉంటుంది. ఈ క్యాంపస్‌లో వాద్యబృంద సంగీత కళాశాలను పేదపిల్లల కోసం సంగీతంలో శిక్షణ ఇస్తూ వారిందరికీ వసతి కల్పించేందుకు వీలుగా ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా రెహ్మాన్ మాట్లాడుతూ సంగీత కళాశాలలో శిక్షణ పొందేందుకు వీలుగా రికార్డింగ్ స్టూడియోలను విడివిడిగా నిర్మించి వాటిలో మ్యూజిక్ డ్రమ్స్, పియానో, తీగ వాయిద్యాలు వంటి పరికరాలను ఏర్పాటుచేసినట్టు తెలిపాడు. తన అపూర్వ ప్రతిభతో భారతీయ సంగీతాన్ని సుసంపన్నం చేస్తున్న రెహమాన్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుందాం…

Scroll to Top