దర్శకశిఖరం భారతీరాజా మృతి


దక్షిణాది చలనచిత్ర రంగంలో అద్భుతమైన చిత్రాల సృష్టికర్తగా, క్రియేటివ్ డైరెక్టర్‌గా ప్రసిద్ధి చెందిన దిగ్గజ దర్శకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత భారతీరాజా (84) మరణం భారతీయ సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలు, తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యంతో బాధపడుతున్న భారతీరాజా చెన్నైలోని తన నివాసంలో బుధవారం తుదిశ్వాస విడిచారు. భారతీయ చలనచిత్ర వ్యాకరణాన్ని మార్చేసిన లెజెండరీ డైరెక్టర్ మరణవార్త దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది సినీ అభిమానులను, చిత్ర పరిశ్రమను తీవ్ర శోకసంద్రంలో ముంచెత్తింది.

భారతీరాజా తమిళనాడులోని తేని జిల్లాలో ఉన్న తేని అనే పట్టణంలో పెరియమాయ, కరుతమ్మాల్ దంపతులకు 1941 జులై 17న జన్మించారు. అసలుపేరు చిన్నసామి పెరియమయతేవర్. 1970ల కాలంలో స్టూడియోలకే పరిమితమైన సినిమాలను బయటకు తీసుకువచ్చి పల్లెటూరి పచ్చదనాన్ని, మట్టి వాసనను ప్రేక్షకులకు పరిచయం చేశారు భారతీ రాజా. వాస్తవికతకు అద్దం పట్టేలా సహజమైన పల్లెటూరి వాతావరణంలో, లైవ్ లొకేషన్లలో సినిమాలు తీసారు.

1977లో వచ్చిన ’16 వయతినిలే’ (తెలుగులో ‘పదహారేళ్ల వయసు’) చిత్రంతో దర్శకుడిగా పరిచయమై అప్పటివరకు ఉన్న ట్రెండ్‌ను సమూలంగా మార్చేశారు భారతీరాజా. తెలుగు చిత్రసీమతోనూ ఆయనకు విడదీయరాని బంధం ఉంది. తెలుగులో ఆయన తెరకెక్కించిన క్లాసిక్ ప్రేమకావ్యం ‘సీతాకోకచిలుక’ ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డుతో పాటు నంది పురస్కారాన్ని కూడా గెలుచుకుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ‘పద్మశ్రీ’ (2004) పురస్కారంతో పాటు మొత్తం 6 జాతీయ చలనచిత్ర అవార్డులు, 6 తమిళనాడు రాష్ట్ర అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. దర్శకుడిగానే కాకుండా, నటుడిగానూ ఎన్నో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న భారతీరాజా.. నిర్మాతలు, దర్శకులు, నటుల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ అంకితభావంతో పనిచేశారు.

చలనచిత్ర పరిశ్రమకు అనేక మంది కొత్త ముఖాలను పరిచయం చేయడంలో కూడా ఆయన ప్రసిద్ధి చెందారు. ఆయన కొత్త ముఖాలుగా పరిచయం చేసిన అనేక మంది నటులలో కార్తీక్, రాధ, రేవతి, రాధిక, విజయశాంతి ప్రముఖులుగా నిలిచారు. ప్రధాన నటులనే కాకుండా, ఆయన ఒక పెద్ద సహాయ నటుల బృందాన్ని కూడా పరిచయం చేశారు. వారిలో జనగరాజ్, వడివుక్కరసి, చంద్రశేఖర్, పాండియన్ మరియు నెపోలియన్ చెప్పుకోదగ్గవారు. ఒక ప్రయోగాత్మక చొరవగా, ఆయన కొత్త నటులకు తన చిత్రాలలో చిన్న పాత్రలను ఇచ్చేవారు, ఆ తర్వాత వారు ప్రజలలో ప్రాచుర్యం పొంది బిజీ నటులుగా మారారు. నేడు ప్రసిద్ధ దర్శకులుగా ఉన్న ఎందరో, ఒకప్పుడు ఆయన చిత్రాలలో చిన్న పాత్ర ద్వారా నటులుగా పరిచయమయ్యారు: కె. భాగ్యరాజ్, మణివణ్ణన్, మనోబాల, త్యాగరాజన్ మరియు పొన్వణ్ణన్ వీరిలో ఉన్నారు.సత్యరాజ్‌ను మొదటిసారిగా ప్రధాన పాత్రలో చూపించడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. భారతీరాజా ఎంతో మంది యువ చలనచిత్ర దర్శకులకు స్ఫూర్తినిచ్చారు చలనచిత్ర నిర్మాణంపై భారతీరాజా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సినిమా (భృఈఈఛ్) అనే పాఠశాలను కూడా నడిపారు. భారతీరాజా మహిళలు వారి సంక్లిష్టమైన పరస్పర సంబంధాలపై ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ సామాజిక నేపథ్య చిత్రాలను నిర్మించారు. ఆయన తన చిత్రాలలో కుల వివక్ష వంటి ఇతర సామాజిక రుగ్మతలను కూడా ప్రస్తావించారు.

భారతీరాజా మరణవార్త తెలియగానే తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. చెన్నై నీలాంకరైలోని దర్శకుడి నివాసానికి స్వయంగా చేరుకున్న సీఎం విజయ్.. భారతీరాజా పార్థివ దేహానికి పూలమాల వేసి చేతులు జోడించి అంజలి ఘటించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదారుస్తూ తన గాఢ సానుభూతిని తెలియజేశారు. తమిళ సినిమా రంగానికి పితామహుడి లాంటి వ్యక్తిని కోల్పోయామంటూ సీఎం విజయ్ భావోద్వేగానికి గురయ్యారు.

భారతీరాజా మృతికి తమిళనాడు ప్రభుత్వం అత్యున్నత గౌరవాన్ని ప్రకటించింది. తమిళ సినిమాకు ఆయన చేసిన అసమాన సేవలకు గుర్తింపుగా భారతీరాజా అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి విజయ్ ప్రకటించారు. ‘తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్’ (TFAPA) విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 2020లో పలువురు ప్రముఖ నిర్మాతలను ఏకం చేస్తూ భారతీరాజా స్థాపించిన TFAPA సంస్థ ఆయన దూరదృష్టితో కూడిన నాయకత్వం వల్లే నేడు 400 మందికి పైగా క్రియాశీల నిర్మాతలతో బలమైన శక్తిగా ఎదిగింది.

Scroll to Top