అమెరికా హెచ్ 1బీ వీసా డ్రాప్ బాక్స్ రూల్స్ మరింత కఠినం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సమీక్షిస్తున్న సర్కార్ వీసా నిబంధనలు మరింత కఠినం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే అమెరికా వీసాలకు సంబంధించి డ్రాప్ బాక్స్ రూల్స్ను మరింత కఠినం చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువరించకపోయినప్పటికీ.. వీసా అప్లికేషన్ సెంటర్లలో కొత్త రూల్స్ను అమల్లోకి తీసుకువచ్చినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. దీంతో ఇప్పటినుంచి హెచ్-1బీ, టూరిస్ట్ వీసాలు కలిగి ఉన్నవారు తమ వీసాలను రెన్యువల్ చేసుకునేందుకు ఎక్కువ రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
వీసాల పునరుద్ధరణ కోసం అమెరికా తీసుకువచ్చిన డ్రాప్బాక్స్ నిబంధనలను కఠినతరం చేసినట్లు తెలుస్తోంది. గతంలో వీసా గడువు ముగిసిన తర్వాత 48 నెలల వరకు ఇంటర్వ్యూలు లేకుండా రెన్యువల్ చేసుకునే అవకాశం ఉండగా.. ఇప్పుడు దాన్ని 12 నెలలకు తగ్గించారు. అంటే హెచ్ 1బీ, టూరిస్ట్ వీసా గడువు ముగిసిన వారు 12 నెలల లోపు రెన్యువల్ చేయించుకోకపోతే.. ఆ తర్వాత మళ్లీ ఇంటర్వ్యూ కు హాజరు కావాల్సి ఉంటుంది. గతంలో వీసా గడువు దాటి 48 నెలలలోపు మళ్లీ రెన్యువల్ చేసుకునేందుకు డ్రాప్బాక్స్ విధానంలో దరఖాస్తు చేసుకునే వీలు ఉండేది. వారికి ఎలాంటి ఇంటర్వ్యూలు నిర్వహించేవారు కాదు. తాజా నిబంధనలతో వీసా గడువు ముగిసి 12 నెలల్లోపు వారికి మాత్రమే డ్రాప్బాక్స్ పద్దతిలో రెన్యువల్ చేసుకునే అనుమతి ఇచ్చారు.
అధికారికంగా ఈ నిబంధనలను వెల్లడించక పోయినా.. వెంటనే వాటిని అమల్లోకి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ వీసా రెన్యూవల్కు సంబంధించిన కొత్త నిబంధనలను ఇప్పటికే వీసా అప్లికేషన్ కేంద్రాల్లో అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా తీసుకువచ్చిన రూల్స్తో హెచ్-1బీ వీసాలతోపాటు బీ1, బీ2 వంటి నాన్ఇమిగ్రెంట్ వీసాదారుల అప్లికేషన్లపైనా తీవ్ర ప్రభావం పడుతున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి వీసాదారులు తమ వీసాలను రెన్యువల్ చేసుకోవడానికి ఇప్పుడు సుదీర్ఘకాలం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
కరోనా మహమ్మారి వెలుగు చూడక ముందు ఈ 12 నెలల నిబంధన ఉండేది. కరోనా తర్వాత వీసా మంజూరు, రెన్యువల్కు పడుతున్న సమయాన్ని దృష్టిలో ఉంచుకుని 2022లో అప్పటి జో బైడెన్ సర్కార్ ఈ డ్రాప్బాక్స్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. తాజాగా అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్.. మళ్లీ పాత పద్ధతిలోనే వీసా రెన్యువల్ చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో భారతీయులపైనే అధిక ప్రభావం పడుతుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే హెచ్ 1బీ, టూరిస్ట్ వీసాలు కలిగిన భారతీయులు.. వాటిని రెన్యువల్ చేసుకోవడం మరింత ఆలస్యం కానుంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబై నగరాల్లో బీ 1, బీ2 వంటి వీసా దరఖాస్తుదారులు ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ల కోసం 440 రోజులకు పైగా వేచి చూస్తున్నారు. తాజా నిర్ణయంతో అది మరింత ఎక్కువ కానుందనే భయాలు నెలకొన్నాయి.