తెలుగు సాహితీ రుధిరజ్యోతి


తెలుగు సాహితీ రుధిరజ్యోతి శ్రీరంగం నారాయణబాబు

తన కవిత్వాన్ని రుధిరజ్యోతి ద్వరా ఆవిష్కరించిన తెలుగుకవి శ్రీరంగం నారాయణబాబు. అందుకే ఆయనని నారాయణబాబు కవిత్వ ఆల్కెమీ అని అంటారు. ఆయన జయంతి మే 17. ఈ సందర్భంగా ఆయన సాహిత్య, జీవిత విశేషాలు…

విజయనగరంలో, 1906, మే 17వ తేదీన శ్రీరంగం నారాయణబాబు జన్మించారు. వీరు ఆజన్మ బ్రహ్మచారి గా జీవితం గడిపారు. దీర్ఘ సంస్కృత సమాసాలను తృణీకరించి, ఐదారు అక్షరాల సాదా పదాలే పాదాలుగా, అనితర సాధ్యమైన ఊహాశాలిత్వంతో కవితలు రాసిన వాస్తవికవాది, అతి నవ్యకవి శ్రీరంగం నారాయణబాబు. తన కాలం నాటి భావకవులు రాత్రి ఆకాశాన్ని పూలతోటగాను, నక్షత్రాలను పూలుగాను వర్ణన చేశారు. నారాయణబాబు ‘‘నల్లని త్రాచుకోరలు/ తెల్లని మశూచి కుండలు/ గగనమ్మున చుక్కలు’’ అని రాయగలిగాడు. తానూ, శ్రీశ్రీ తొలినాళ్లలో భావకవిత్వాన్ని రాశామని, అనంతర కాలంలో దానిని తామే విసిరికొట్టామని నారాయణబాబు చెప్పేవారు.

1930–50 సంవత్సరాల మధ్య నారాయణబాబు రాసిన నలభై కవితల్ని ఆరుద్ర 1972లో ‘రుధిరజ్యోతి’ కవితా సంపుటిగా ముద్రించారు. 47 ఏళ్ళ తరువాత 2019లో ఈ పుస్తకాన్ని విజయనగరం నుండి ఎన్‌. కె. బాబు పునర్ముద్రించారు.

భగత్‌ సింగ్‌ను ఉరితీసే సందర్భానికి స్పందించి. ‘‘భారతవీరుని/ కపాల మొక్కటి/ కపర్ది చేతిని/ రివ్వున వాలింది’’ అని రాశారు నారాయణబాబు, భగత్‌ సింగ్‌ పేరు చెప్పకుండానే! శివుని కంటి మంటకు చేతిలోని బ్రహ్మకపాలం నశిస్తే దాని స్థానంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్‌ సింగ్‌ పుఱ్ఱె చేరిందట. దేశభక్తుని పుఱ్ఱె బ్రహ్మకపాలం కంటే గొప్పదని ప్రకటించారు. పౌరాణిక ఇతివృత్తాన్ని నేరుగా తీసుకొని, ఆధునిక సంఘటనకు ముడిపెట్టి రాసిన ఈ కవిత చదివిన ప్రముఖ సాహిత్యవేత్త రోణంకి అప్పలస్వామి “నారాయణబాబు కవనం మన్ను నుంచి మానవులను సృష్టిస్తుంది,” అన్నారు. “వెయ్యేళ్ళ తెలుగు కవితా భవనానికి నారాయణబాబు ఈ ‘కపాలమోక్షం’ ద్వారా ఒక ఆధునిక కవితా గవాక్షాన్ని ఆవిష్కరించాడు” అని విశ్లేషించారు మరో కవి అవంత్స సోమసుందర్‌.
“శ్రీశ్రీ కవిత ఛందస్సుల జలపాత వేగంతో ఉరకలిడి బాహ్యస్వరూపంతో పాఠకుణ్ణి మైమరపిస్తే, నారాయణబాబు కవిత సెలయేటి మార్దవంతో పఠిత హృదయంలో చేరి అనంత భావజాలాన్ని ప్రేరేపుతుంది,” అని సోమసుందర్‌ పేర్కొన్నారు.

‘‘రుధిర జ్యోతిర్‌/ జ్వలనా లలనా/ ప్రియుండ!/ విప్లవ ఋషిని/ విద్రోహ కవిని,’’ అని రాశారు నారాయణబాబు. రుధిరజ్యోతిర్జ్వలనాన్ని లలనతోను, ఋషిని విప్లవంతోనూ సంపర్కం చేయించి, కొత్తదైన రసాయన చర్యను కలిగిస్తారు. పాఠకుల మనసుల్లో భావాన్ని గింగిర్లు కొట్టిస్తాడు. ‘విద్రోహం’ అనే పదం నజ్రుల్‌ ఇస్లాం ప్రభావంలో నారాయణబాబు రాశారు. 1930ల్లో బంగ్లా మహాకవి నజ్రుల్‌ ఇస్లాం, హరీంద్రనాథ ఛటోపాధ్యాయల ప్రభావం దేశమంతటా ప్రసరించింది.

ప్రాచీన సాహిత్యంలో శ్రీకృష్ణదేవరాయల ‘ఆముక్తమాల్యద’ కావ్యం ఎలాంటిదో, ఆధునిక సాహిత్యంలో నారాయణ బాబు ‘రుధిరజ్యోతి’ అలాంటిదని సాహితీ విమర్శకుల ప్రశంసలందుకున్నారు.

నారాయణబాబు పద్య రచనలకు, భావ కవిత్వానికి భిన్నంగా కొంతమందితో కలసి సర్రియలిజం  అనే విదేశీయ ప్రక్రియను అనుసరించి రచనలు చేశారు. ఒక యదార్థ రూపాన్ని కవితలోనో, చిత్రలేఖనంలోనో చూపించినపుడు, ఆ విషయం యొక్క మూల స్వరూపాన్ని వివిధ విపరీత పరిస్థితులలో వర్ణించి మరువలేని చిత్రంగా ప్రదర్శించడమే “సర్రియలిజం” అంటారు. దీనిని “అధివాస్తవికత” అని కొందరు అంటే “అతి వాస్తవికత” అంటే బాగుంటుందని వీరు భావించారు. విధానం విదేశీయమైనది అయినా మన దేశపు పౌరాణిక గాథలు, సమయోచితమైన అర్థాన్నిచ్చే ఆంధ్ర, సంస్కృత శబ్ద ప్రయోగం వీరి రచనలకు ప్రత్యేక లక్షణాలు.

కొన్నాళ్ళు సినిమా రంగంలో కూడా పనిచేసిన శ్రీరంగం నారాయణ బాబు 1961, అక్టోబర్ 2వ తేదీన చెన్నైలో కాలధర్మం చెందారు.

Scroll to Top