
రాత్రి నిద్రపోయేటప్పుడు లైట్ ఆన్ చేసి పడుకునే అలవాటు నెమ్మదిగా గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని తాజా శాస్త్రీయ అధ్యయనం గట్టిగా హెచ్చరిస్తోంది. ప్రతిష్ఠాత్మకమైన జామా నెట్వర్క్ ఓపెన్ జర్నల్లో ప్రచురితమైన తాజా అధ్యయనం ప్రకారం, నిద్ర సమయంలో గదిలో వెలుతురు ఉండటం వల్ల గుండె జబ్బుల ముప్పు గణనీయంగా పెరుగుతున్నట్లు తేలింది. ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు దాదాపు 89,000 మందిని దీర్ఘకాలం పాటు గమనించి, వారి నిద్ర అలవాట్లు అదే సమయంలో గుండె ఆరోగ్యాన్ని విశ్లేషించారు. ఈ అధ్యయన ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉండటంతో పాటు భయపెట్టేలా కూడా ఉన్నాయి. నిద్రపోయేటప్పుడు లైట్ వేసుకుని పడుకునే వారిలో హార్ట్ అటాక్ వచ్చే అవకాశం 47 శాతం ఎక్కువగా ఉందని వెల్లడైంది. అలాగే హార్ట్ ఫెయిల్యూర్ ముప్పు 56 శాతం వరకు అధికంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
రాత్రి సమయంలో వెలుతురు ఉండటం వల్ల శరీరంలోని సహజ జీవ గడియారం అయిన సర్కేడియన్ రిథమ్ తీవ్రంగా దెబ్బతింటుంది. దీని వల్ల నిద్ర నాణ్యత తగ్గడమే కాకుండా, స్ట్రెస్ హార్మోన్లు పెరగడం, రక్తపోటు అసమతుల్యత, మెటబాలిజం మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ మార్పులన్నీ కలిసి గుండెపై అదనపు భారం పెడతాయని అధ్యయనం స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా టీవీ ఆన్ చేసి నిద్రపోవడం, నైట్ ల్యాంప్స్, మొబైల్, ల్యాప్టాప్ స్క్రీన్ లైట్స్ నుంచి వచ్చే వెలుతురు కూడా ఇదే రీతిలో ప్రమాదకరమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పూర్తిగా చీకటి లేకపోవడం వల్ల మెదడు “ఇంకా చీకటి పడలేదు” అన్న సంకేతాన్ని అందుకుని శరీరానికి విశ్రాంతి ఇవ్వదని వారు చెబుతున్నారు. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే, మంచి నిద్ర కోసం పూర్తి చీకట్లోనే పడుకోవడం అత్యంత అవసరం అని పరిశోధకులు సూచిస్తున్నారు.
