
హాస్య బ్రహ్మ జంధ్యాల – వర్ధంతి (జూన్ 19)
*****************
తెలుగు చిత్ర సీమలో నవ్వుల పువ్వులు వెదజల్లిన హాస్య చక్రవర్తి. తన చమత్కారాలతో ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తిన ప్రతిభాశాలి.. హాస్యం ఉన్నంత కాలం ఆయన పేరు అజరామరం. కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్.. హాస్య బ్రహ్మ జంధ్యాల. జంధ్యాల వర్ధంతి (జూన్ 19) సందర్భంగా ఆయనని గుర్తుచేసుకుందాం.
నవ్వడం ఒక యోగం.. నవ్వించడం ఒక భోగం.. నవ్వలేకపోవడం ఒక రోగం..అనే తన మాటలనే అక్షరాలా పాటించారు హాస్య చక్రవర్తి జంధ్యాల . తన సినిమాలతో తెలుగు సినీ లోకాన్ని కడుపుబ్బా నవ్వించారాయన. తాను ఈ లోకాన్ని విడిచినా తన సినిమాలతో ఇప్పటికీ ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతూనే ఉన్నారు. తెలుగు వెండితెరపై జంధ్యాల అంటే పేరు కాదు అదొక బ్రాండ్. అందుకే ఆయన మరణించి రెండున్నర దశాబ్దాలు అవుతున్నా.. జంధ్యాల పేరు వినిపిస్తే చాలు తెలుగువారి పెదాలపై తెలియకుండానే నవ్వులు పూచేస్తాయి. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా తనదైన కామెడీ మార్క్తో సినిమాలు తీసిన జంధ్యాల తెలుగు సినీ ఇండస్ట్రీలో కొత్త ఒరవడి సృష్టించారు. తన సినిమాల్లోని క్యారెక్టర్లకి ఏదొక మేనరిజం పెట్టి దానితోనే హాస్యం పుట్టేలా చేయడం ఆయన ప్రత్యేకత.
మనందరికీ జంధ్యాలగానే సుపరిచితమైనా ఆయన పూర్తి పేరు జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి. 1951 జనవరి 14న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు. బి.కామ్ వరకు చదువుకున్నాడు. చిన్నతనం నుండి నాటకాల పట్ల ఆసక్తిగా ఉండేవారు. స్వయంగా నాటకాలు రచించారు. ఆయన రాసిన నాటకాల్లో ఏక్ దిన్ కా సుల్తాన్, గుండెలు మార్చ బడును ప్రముఖమైనవి. ఆయన నాటకాలు అనేక బహుమతులు అందుకున్నాయి. నాటకాలకు ఆయన రాసే డైలాగులు ప్రేక్షకులను నవ్వించడమే కాదు ఆలోచింపజేసేవి. దీంతో నువ్వు సినిమాల్లోకి వెళ్లొచ్చు కదా అంటూ స్నేహితులు చెప్పిన మాటలతో ఆయన సర్కారు రైలెక్కి మద్రాసు చేరుకున్నారు.
1976లో పాతికేళ్ళ వయసులో ‘దేవుడు చేసిన బొమ్మలు’తో రచయితగా పరిచయం అయ్యారు జంధ్యాల. అక్కడి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. సిరిసిరిమువ్వ, అడవి రాముడు, శంకరాభరణం, సాగరసంగమం, వేటగాడు, సప్తపది లాంటి ఎన్నో సినిమాల్లో అద్భుతమైన మాటలు రాశారు జంధ్యాల. కామెడీతో ప్రేక్షకుల కడుపు చెక్కలయ్యేలా నవ్వించమే కాదు.. వారిచేత కంటతడి పెట్టించడమూ ఆయనకు తెలుసు. అలా జంధ్యాల కలానికి రెండు వైపులా పదును ఉండేది. సుమారు 85 సినిమాలకు రచయితగా పని చేయగా అందులో 80 శాతం సినిమాలు ఘన విజయం సాధించడంతో మంచి రచయితగా పేరు తెచ్చుకున్నారు.
వేటగాడు సినిమాలో రావు గోపాలరావు తో జంధ్యాల పలికించిన మాటల ప్రాసలు తూటాలై పేలి రచయితగా ఆయనకు ఎనలేని ఖ్యాతి తీసుకొచ్చాయి. గుక్క తిప్పుకోకుండా ఆయనతో చెప్పించిన ప్రాస డైలాగులు ఈ రోజుకు పాపులరే. మాటల రచయితగా ప్రారంభమైన జంధ్యాల కెరీర్.. ఆ తర్వాత దర్శకుడిగా మారాక గోదావరి నదిలా ఉరకలెత్తింది. కుటుంబం అంతా కూర్చుని తరాల పాటు చూడగలిగే ఆరోగ్యకరమైన హాస్య చిత్రాలు అందించారు జంధ్యాల. ఎన్ని తరాలు మారినా.. జంధ్యాల హాస్యానికి ఎక్స్పైరీ లేదు. దర్శకుడిగా చేసిన తొలి చిత్రం ‘ముద్ద మందారం’తో ఘన విజయం అందుకున్నారు. ఈ రోజు మనం చూస్తున్న ఎంతోమంది కమెడియన్స్ను జంధ్యాలే పరియం చేసారు. సుత్తివేలు – వీరభద్రరావు జంట నుంచి కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం వరకు అందరికీ గురువు జంధ్యాలే.
ఎప్పుడో మూడు, నాలుగు దశాబ్దాల క్రితం జంధ్యాల తీసిన కామెడీ సినిమాలు ఇప్పటికీ ఎప్పటికీ నిత్యనూతనంగానే ఉన్నాయంటే ఆయన టేకింగ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఇక జంధ్యాల, బ్రహ్మానందం జోడీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తన జిల్లాకు చెందినవాడైన బ్రహ్మానందాన్ని తెలుగు తెరకు పరిచయం చేసింది జంధ్యాలే. అత్తిలిలో జూనియర్ లెక్చరర్గా విద్యార్థులకు పాఠాలు చెబుతున్న ఆయన్ని తీసుకొచ్చి ‘అహ నా పెళ్లంట’లో అరగుండుతో చూపించారు. ఆ సినిమాలో బ్రహ్మీ నత్తితో చెప్పే డైలాగులు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ తర్వాత ‘జయమ్ము నిశ్చయమ్మురా’ హౌస్ ఓనర్ గోపాలం అయినా.. ‘హైహై నాయకా’లో పటేల్ మాస్టర్ అయినా.. కారెక్టర్ ఏదైనా జంధ్యాలతో బ్రహ్మి జోడీ కుదిరిందంటే కడుపులు చెక్కలవ్వాల్సిందే. ఇక 1992లో వచ్చిన ‘బాబాయ్ హోటల్ ’ సినిమాలో బ్రహ్మానందాన్ని మరో కోణంలో చూపించి మెప్పించారాయన. అలాగే కోట శ్రీనివాసరావును కూడా ఎన్ని రకాల అద్బుతమైన పాత్రల్లో చూపించారు జంధ్యాల.
జంధ్యాల అంటే కామెడీ ఒక్కటే కాదు.. తన మార్క్ డైలాగ్స్ కూడా. దరిద్ర నారాయణుడికి దిక్కుమాలిన స్వరూపం అని వర్ణించినా.. పాండురంగారావును జేమ్స్ పాండ్ చేసినా.. హై హై నాయకాలో బూతు బూతు అంటూ వినీ వినిపించని బూతులు తిట్టించినా.. శ్రీలక్ష్మీతో బాబూ చిట్టి అని పిలిపించినా.. ఆమెతో అరటి పండు లంబా లంబా, బంగాళాదుంప భౌ భౌ అనే వంటకాలు వండించినా, చూపులు కలిసిన శుభవేళలో కోటతో అచ్చ తెలుగులో మాట్లాడించినా.. అది ఒక్క జంధ్యాల ఒక్కడికే సొంతం. జంధ్యాల సినిమాల్లో కొన్ని విచిత్రమైన తిట్లు ఉంటాయి. ష్ గప్చుప్ అనే సినిమాలో 3 నిమిషాల పాటు నాన్ స్టాప్ తిట్లతోనే పాట రాశారు. అది ఇప్పటికీ పాపులరే. ఇక హాస్య కిరీటీ రాజేంద్రప్రసాద్తో జంధ్యాల కాంబినేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వాళ్లిద్దరి కాంబినేషన్లో అహ నా పెళ్లంట, రెండు రెళ్లు ఆరు, జయమ్ము నిశ్చయమ్మురా, వివాహ భోజనంబు, ప్రేమ జిందాబాద్ లాంటి సినిమాలు ప్రేక్షకులను గిలిగింతలు పెట్టాయి.
జంధ్యాల సినిమా అంటే కేవలం కామెడీ అని చాలామంది అనుకుంటారు. ఆయనలో మరో కోణమూ ఉంది. ముఖ్యంగా తెలుగు భాషపై ఆయనకు ఉన్న పట్టు ఇంతా అంతా కాదు. కామెడీతో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన జంధ్యాల నుంచే ఆనందభైరవి లాంటి క్లాసిక్ వచ్చింది. క్లాసికల్ డాన్స్ ఇతివృత్తంతో ఆయన తీసిన ఈ సినిమాతో ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు సొంతం చేసుకున్నారు. అప్పట్లో చిరంజీవి, బాలయ్య లాంటి అగ్ర హీరోలతో చంటబ్బాయి, బాబాయ్ అబ్బాయి, సీతారామ కళ్యాణం లాంటి సినిమాలు చేసారు జంధ్యాల. ముఖ్యంగా ఊర మాస్ సినిమాలు చేస్తున్న చిరంజీవిని చంటబ్బాయిలో జంధ్యాల చూపించిన తీరు అద్భుతం. మెగాస్టార్ కెరీర్లో అదొక క్లాసిక్గా నిలిచిపోయింది. కెరీర్ చివర్లో ‘ఆపద్భాందవుడు’ సినిమాలో చిరంజీవితో కలిసి నటించారు జంధ్యాల. ఆ చిత్రానికి కె.విశ్వనాథ్ దర్శకుడు. ఇంటిల్లిపాది చూసే ఆరోగ్యకరమైన హాస్యం రాసిన ఘనత జంధ్యాల సొంతం.
జంధ్యాల ఒక్కో చిత్రం ఒక హాస్యపు ఆణిముత్యం. అప్పట్లో చిరంజీవి, బాలయ్య లాంటి అగ్ర హీరోలతోనూ చంటబ్బాయి, బాబాయ్ అబ్బాయి, సీతారామ కళ్యాణం లాంటి సినిమాలు చేసారు జంధ్యాల. ముఖ్యంగా ఊర మాస్ సినిమాలు చేస్తున్న చిరంజీవిని చంటబ్బాయిలో జంధ్యాల చూపించిన తీరు అద్భుతం. ఆయనలో ఉన్న కామెడీ కోణాన్ని అంత అందంగా చూపించిన ఘనత హాస్య బ్రహ్మ జంధ్యాలకే దక్కుతుంది. చంటబ్బాయిలో శ్రీలక్ష్మీ, పొట్టి ప్రసాద్ ట్రాక్ అద్భుతం అంతే. నేను కవిని కానన్నవాడిని కత్తితో పొడుస్తా, నోటికి మాట నెత్తికి రీటా కాళ్లకు బాట నేను తింటా సపోటా లాంటి డైలాగులు ఇప్పటికీ హాస్య ప్రియులను అలరిస్తునే ఉన్నాయి.
టైటిల్స్ విషయంలోనూ జంధ్యాల ట్రెండ్ సెట్ చేసారు. అహనా పెళ్లంట, ఒహోనా పెళ్లంట, చూపులు కలిసిన శుభవేళ, జయమ్ము నిశ్మయమ్మురా, వివాహా భోజనంబు, నీకు నాకు పెళ్లంట, ప్రేమ ఎంత మధురం, బావబావ పన్నీరు లాంటి పాత తెలుగు సినిమాల్లోని పాటల పల్లవులు టైటిల్స్గా పెట్టే ట్రెండ్కు శ్రీకారం చుట్టారు జంధ్యాల. కెరీర్ చివర్లో ఆపద్భాందవుడులో చిరంజీవితో కలిసి నటించారు జంధ్యాల.
నటీనటులెవరైనా.. జంధ్యాల సినిమాలో ఉన్నారంటే ఆయన మార్క్ ఉండాల్సిందే. సింహభాగం కామెడీ సినిమాలే చేసినా.. అందులో వేటికవే ప్రత్యేకం. ఇంటిల్లిపాది చూసే ఆరోగ్యకరమైన హాస్యం రాసిన ఘనత జంధ్యాల సొంతం. తెలుగు వాళ్లను నవ్వులతో ముంచిన హాస్యబ్రహ్మ జంధ్యాల .. 2001 జూన్ 19న శోకసంద్రంలో ముంచుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
