దినకరుడు.. నిత్య శుభకరుడు

ఈనెల 16 సూర్య జయంతి (రథసప్తమి)

సీ:
సర్వసజ్జన నాథ! సమయ స్వరూపుడా!
     ఆరోగ్య దాతవై అలరు దేవ
ఉదయము బ్రహ్మనీవుద్దిన శివుడవు
     సాయంపు సమయముc చక్రివీవు
రథ సప్తమీ తిథి ప్రభవించి రహియించె
     తారలే రథముగా తరలి వచ్చె
దినకరుడౌపడె దివ్యతేజస్సుతో
     భువిజనులందరూ పొంగెపోయె

ఆ:
మిహిరుడా జగతికి మిత్రుడవై వెల్గి
అహమను తుహినంబు నణగ జేయ
ఇహ పరంబులన్ని ఇరుసగ నినుజేసి
చక్రగతిన తిరుగ సాక్షి నీవు

శ్రీ సూర్యనారాయణుడు కనిపించే ఏకైక దైవం… సమయ పాలనా చక్రవర్తి… ఆరోగ్యదాత… అభయప్రదాత… అన్న పేర్లున్నవాడు. రాత్రిపగళ్లతో చీకటివెలుగులను పంచడంలో సిద్ధహస్తుడు. భాస్కరుడు ప్రసరించే సహస్ర కిరణాలు మన శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యం లేకుండా కాపాడు తాయి. సూర్యభగవానుడు ఉదయం బ్రహ్మస్వరూపంగా, ప్రకృతిలో జీవాన్ని నింపి, మహే శ్వరునిగా మధ్యాహ్నం తన కిరణాల ద్వారా సృష్టియొక్క దైవిక వికారాలను రూపు మాపి, సాయం కాలం విష్ణురూపంగా భాసిల్లే తన కిరణాల వెలుగును మనోరంజకంగా ప్రసరింపజేస్తూ ఆనందాన్ని కలిగించే ప్రత్యక్షదైవం. అదితికశ్యపులకు పుట్టిన సూర్యభగవానుడి జన్మదినమే రథసప్తమి. ఈ నెల 16న రథసప్తమి సందర్భంగా ప్రత్యేక కథనం…

సూర్యుడు లేని ప్రపంచాన్ని ఊహించలేం. సూర్యుడు కర్మసాక్షి. మాఘశుక్ల సప్తమి నాడు తొలిసారిగా ఈ భూమికి కనిపించి రథమెక్కాడట భాస్కరుడు. ఈరోజు ఆకాశంలో నక్షత్రాలు రథాకారం దాల్చుతాయి. అందుకే రథసప్తమి అయిందని పురాణాలు అంటున్నాయి. సూర్యు డు ఆధ్యాత్మిక విశేషమే కాదు… భౌతిక, ఖగోళ, శారీరక ప్రాముఖ్యం కలిగిన గ్రహనాయకుడు కూడా. సమస్త మాన వాళి ఆరోగ్యం- భాస్కర ప్రసాదంగా చెబుతారు. విదేశీయు లు కూడా సూర్యస్నానం చేసేది అందుకే. ఉదయకాలం పూట కాసేపు సూర్యకాంతికి ఎదురునిలచోవడంలో అంత రార్ధం ఆరోగ్యసూత్రమే. మన సంప్రదాయాల్లోని సంధ్యా వందన నియమం అందుకేనని అంటారు.

ఆయా సమయాల్లో సూర్యకిరణాలు ఆరోగ్యాన్నందించేవిగా భావించడం వల్లే… సంధ్యావందన నియమాన్ని విధిగా ఆచరించ మని చెబుతోంది భారతీయశాస్త్రం. రథసప్తమి రోజున సూ ర్యభగవానుడిని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగి పో యి పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. హిందువులు మాఘ శుద్ధ సప్తమి రోజు రథసప్తమి పండుగ జరుపుకుంటారు. ఇతర మాసాలలోని సప్తమి తిథులకన్నా మాఘమాసమందలి సప్తమి బాగా విశిష్టమైనది. సుర్యుని గమనం ఏడు గుర్రాలు పూన్చిన బంగారు రథం మీద సాగుతుందని వేదం ‘హిరణ్యయేన సవితారథేన’ అని తెలు పుతుంది. సూర్య గమనం ప్రకారం ఉత్తరాయనం, దక్షిణా యనం అని రెండు విధాలుగా ఉంటుంది. ఆషాఢమాసం నుండి పుష్యమాసం వరకు దక్షిణాయనం.

సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూ ర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకం రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈరోజు పవిత్ర దినంగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. ‘భా’ అంటే సూర్యకాంతి, ‘రతి’ అంటే సూర్యుడు, కావున సూర్యుని ఆరాధించువారు అందరూ భారతీ యులు. ‘భారతీ’ అంటే వేదమాత. వేదమాత నారాధించువారు కూడా భారతీయులే.

అరసవల్లి ఆదిత్యుడు…
అజ్ఞాన తిమిరాన్ని కోటికోట్ల అరుణ కిరణాలతో చెల్లాచెదురు చేసి సమస్త జీవరాసులను మేల్కొలిపే ఆదిదేవుడు ఆదిత్యుడు. అటువంటి సూర్యభగవానుడు మూర్తీభవించిన దైవంగా శ్రీకాకుళం పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో అరసవల్లిలో నిత్యపూజలు అందుకుంటున్నాడు. ప్రపంచంలో నిత్యారాధనలు జరిగే ఏకైక సూర్యదేవాలయం ఇదొక్కటి మాత్రమే కావడం ఈ ఆలయ విశిష్టతను చాటి చెబుతోంది. ఆరోగ్య ప్రదాతగా నిలచిన ఆదిత్యుని జయంతి రథసప్తమినాడే జరుగుతుంది.

చరిత్ర పుటల్లో అరసవల్లి…
చరిత్ర పుటలను తిరగేస్తే అరసవల్లిలోని శ్రీ సూర్యదేవాల యాన్ని కళింగ రాజ్య పాలకులు తూర్పు గంగరాజులలో ప్రముఖుడైన దేవేంద్ర వర్మ క్రీస్తు శకం 545లో నిర్మించి నట్టు తెలుస్తోంది. ఆ తరువాత ఆయన వారసుడు ఒకటో దేవేంద్రవర్మ క్రీస్తు శకం 648లో సూర్యగ్రహణ సమయా న ఆదిత్య విష్ణుశర్మ, భానుశర్మలనే బ్రాహ్మణులకు అరస వల్లితో పాటు మరికొన్ని గ్రామాలను దానం ఇచ్చినట్టు ఆలయ పరిసరాల్లోని శాసనాలు స్పష్టం చేస్తున్నాయి. అనంతరం క్రీస్తు శకం 1077- 1150 సంవత్సరాల మధ్య జీవించిన అనంతశర్మ చోడగంగ దేవ రాజు సూర్యదేవునికి, శ్రీకూర్మ నాధునికి కొంతభూమి దానం చేసినట్టు అరసవల్లిలో దొరికిన శాసనాల ద్వారా తెలుస్తోంది. క్రీస్తు శకం 1609 నాటి శాసనంలో అరసవల్లిలో ఓ విద్యాలయం విద్యార్థులకు ఉచిత భోజన వసతితోపాటు చెరువు తవ్వకానికి భూదానం చేసినట్టు తెలిపారు. క్రీస్తు శకం 1434లో తూర్పుగంగ వంశం అంతరించినంత వరకు ఆదిత్యుడికి నిత్య పూజలు కొనసాగించారు.

ఆలయ నిర్మాణం జరిగిందిలా…
అరసవల్లిలో సూర్యదేవాలయం నిర్మాణం గంగరాజుల్లో ఒకరైన దేవేంద్రవర్మ హయాంలో జరిగింది. కళింగ దేశ రాజధా నిగా శ్రీముఖలింగం ఉన్న రోజుల్లో ఇప్పిలి అక్కన్న, సూరప్ప అనే సోదరులు రాజు దర్శనానికి వెళ్లి, తమకు సూర్యదేవుడు కలలో కనిపించి కొన్ని వివరాలు చెప్పారని విన్నవించారు. ఆ సోదరుల దైవభక్తిపై ఎంతో నమ్మకంతో వారిని అరసవల్లి సూర్యదేవాలయానికి అర్చకులుగా దేవేంద్రవర్మ నియమించినట్టు కొన్ని రచనల ఆధారంగా తెలుస్తోంది. కృష్ణా తీర ప్రాంతానికి చెందిన ఈ సోదరులు శ్రీముఖలింగం వస్తున్నప్పుడు వంశధార నదిలో ఒక తాళపత్ర గ్రంధం దొరికిందని, అందులో సూర్యదేవుని పూ జా విధానాలు ఉన్నాయని వారు మహరాజుకు తెలిపినట్టు చరిత్ర చెబుతుంది.

వారి వారసులే ఇప్పటికీ ఆలయ అర్చకులుగా కొనసాగుతున్నారు. గంగ వంశరాజులు తరువాత గజపతులు అరసవల్లితో పాటు ఉత్తరాంధ్ర ప్రాం తంలోని ఆలయాలను సంరక్షించారు. క్రీస్తు శకం 1599 లో హజరత్‌ కులీకుతుబ్‌షా శ్రీ కూర్మం వరకూ దండయా త్ర జరిపి అరసవల్లి ఆలయాన్ని ధ్వంసం చేసినట్టు సౌత్‌ ఇండియన్‌ ఇన్‌స్క్రిప్షిన్స్‌ 5వ సంపుటం ఆధారంగా తెలుస్తోంది. ఆ తరువాత ఏ ప్రాముఖ్యతా లేని ఈ ఆలయాన్ని 1778లో యలమంచిలి పుల్లాజీ పంతులు పునరుద్దరించారు. ఆ సమయానికి నల్లని గ్రానైట్‌ శిలతో రూపొందించిన మూలవిరాట్‌ విగ్రహం తప్ప మరే అవశేషం మిగిలి లేదు. అలా కాలక్రమంలో యిప్పిలి జోగారావు ఆలయ ధర్మకర్తగా ఉన్న సమయంలో సారవకోట మండలం అలుదు నివాసి వరుదు బాబ్జీరావు ఆదిత్య ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారు.

స్థల పురాణం…
ప్రాచీన చరిత్రలో విశిష్టతకు చిరునామాగా నిలిచిన సూర్యనారాయణస్వామి ఆలయానికి దేశంలోని అన్ని ఆలయాల వలే స్థల పురాణం కూడా వుంది. స్థల పురాణాలకు వేదికైన స్కంధ పురాణాలలో ఈ ఆలయాన్ని దేవేంద్రుడు నిర్మించినట్టు చెబుతారు. ఆయన తన వజ్రాయుధంతో తవ్విన చెరువునే ఇంద్రపుష్కరిణిగా పిలుస్తారు. ఆ చెరువులో దొరికిన సూర్యభగవానుడి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్టించారని స్కంధ పురాణం చెబుతోంది. నాగావళి నదీ తీరంలో బలరాముడు ప్రతిష్టించిన ఉమారుద్ర కోటేశ్వరస్వామిని దర్శించడానికి దేవేంద్రుడు రాగా, తన అనుమతి లేకుండా అతడు వచ్చినందుకు నంది కాళ్లతో తన్నిందని, దాంతో దేవేంద్రుడు అరసవల్లిలో పడ్డాడని అంటారు. నంది ఇచ్చిన శాపవిమోచనం కోసం దేవేంద్రుడు అరసవల్లిలో ఆలయ నిర్మించాడని మరో కథనం ప్రచారంలో వుంది.

సూర్యజయంతే రథసప్తమి…
సూర్యుడు మకరరాశిలోని ప్రవేశించిన తరువాత మాఘమాస శుద్దసప్తమిని రథసప్తమిగా పేర్కొంటారు. ఈ సప్తమి రోజు సౌరకుటుంబానికి కేంద్రమైన సూర్యుడు ఉద్భవించినట్టు చెబుతారు. సూర్యోదయాన్నే… ‘సప్తసప్తమహాసప్త’ శ్లోకాన్ని జపిస్తూ స్నాన మాచరిస్తే విశేష ఫలితాలు ఉంటాయని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ చెబుతున్నారు. ఇంద్ర పుష్కరణిలో భక్తులు తలపై జిల్లేడు ఆకులు, రేగుపండ్లు, నువ్వులు పోసుకోని మూడుసార్లు అభ్యంగన స్నానాన్ని ఆచరిస్తే పునర్జన్మ వుండదని అనాదిగా వస్తున్న నమ్మకం. రథసప్తమి రోజున స్ర్తీ సాంగత్యాన్ని, తైలం, మాంసాహారాన్ని ఎవరు త్యజిస్తారో వారికి సూర్యలోకం ప్రాప్తిస్తుందని చెబుతారు. స్వామి నిజరూప దర్శన పూజలతో భక్తులకు నవగ్రహ దోష నివృత్తి జరిగి ఆరోగ్య ఐశ్వర్యాలు సమకూరుతాయని నమ్మకం. అందువల్లే రథసప్తమి రోజున లక్షలాది మంది భక్తులు సూర్యదర్శనం కోసం తరలివస్తారు.

రథసప్తమి పూజలివిగో…
అరసవల్లిలో వెలసిన ఆదిత్యుని సన్నిధిలో రథసప్తమి రోజు ఉదయం మహా అభిషేక సేవ, పంచామృతాలు, సుగంద ద్రవ్యాలతో మూలవిరాట్‌కి మహా అభిషేకం జరుగుతుంది. ఈ రోజున స్వామివారి దర్శనం వల్ల ఈ జన్మలో జన్మంతరాలలో మాటలు, చేతలు, దృష్టిదోషం వల్ల చేసిన పాపాలు, ఏడు జన్మల పాపాలు నశిస్తాయని నమ్మకం. భక్తులకు ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు సమకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి. రథసప్తమి రోజు ఆవు పేడతో తయారు చేసిన పిడకలతో మట్టిపొయ్యి మీద బియ్యం, పాలు, పంచదార లేదా బెల్లంతో తయారుచేసిన క్షీరాన్నాన్ని వండాలి. పందిరి చిక్కుడు ఆకుల మీదగాని తెల్ల జిల్లేడు ఆకుల మీదగాని ఆ క్షీరాన్నాన్ని ఉంచి స్వామివారికి నైవేద్యం పెట్టాలి.

ఏకభుక్తం (ఒంటిపూట) చేస్తూ ఆ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల శరీరంలో ఉన్న ఉబ్బసరోగాలు, శ్వాసకు సంబంధించిన రోగాలు, నరాల వ్యాధులు నశిస్తాయని పురాణాల్లో పేర్కొన్నారు. తెల్లజిల్లేడు, పందిరి చిక్కుడు ఆకులకు, రేగు పళ్లకి, సౌరశక్తిని నిలువ చేసే శక్తి ఎక్కువగా వుంటుంది. వీటిపై ఉంచిన ప్రసాదాన్ని భుజించడం వల్ల అన్ని వ్యాధులు నశిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. అలాగే రథసప్తమి రోజున శిరస్సు మీద, భుజాలు మీద తెల్ల జిల్లేడు ఆకులు, రేగుపళ్లు పెట్టుకొని స్నానం చేయడం వల్ల దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయి. సూర్యజయంతి రోజున ఎర్ర చందనం (రక్తచందనం) అష్టదళ పద్మం వేసి (8 ఆకులమీద) సూర్యనారాయణ స్వామిని ఆవాహనం చేసి ఉపచార పూజలు చేయాలి.

రాగి పాత్రలో గరిక, పాలు, ఎర్రచందనం, మందార పువ్వులు కలిపిన పదార్థంతో సూర్య నారాయణ స్వామికి ఎదురుగా నిలబడి ఆర్ఘ్యం ఇస్తే స్వామి సంతృప్తి చెందుతారని, భక్తులకు భోగభాగ్యాలిచ్చి వచ్చే జన్మలో ఎటువంటి రోగాలు దరిచేరకుండా దీర్ఘాయిష్సు ప్రసాదిస్తారని నమ్మకం. భక్తులు మరణానంతరం సూర్యలోకం చేరుతారని పద్మ, బ్రహ్మ పురాణం, సౌరపురాణాలు చెబుతున్నాయి.

ఆదిత్యునికి నామాలెన్నో…
‘ఆరోగ్యం బాస్కరాధిచ్చేత్‌’ అని మాతృ పురాణం లో, ‘దివే శం సుఖార్ణ’ అని స్కందపురాణంలో, ‘తేజ స్నామో విభా వసు’ అని శ్రీమద్భాగవతంలో, ‘ఆదిత్య హృదయం పారా యణం సర్వశత్రు వినాశన’ అని రామాయణంలో శ్రీసూ ర్యభగవానుని ప్రస్తుతించారు. అంతటి మహిమాన్వితుడు, ప్రత్యక్షదైవం, ఆరోగ్య ప్రదాత, గ్రహరాజు, త్రిమూర్తి స్వరూపుడైన సూర్యభగవానుని మాసానికో పేరుతో పిలు స్తారు. అంటే 12 నెలలకు పన్నెండు పేర్లు… చైత్రమాసం లో ‘మిత్ర’ అని, వైశాఖంలో ‘రవి’, జ్యేష్టంలో ‘సూర్య’, ఆషాడంలో ‘వాసు’, శ్రావణంలో ‘ఖగ’, భాద్రపదంలో ‘పూష’, ఆశ్వయూజంలో ‘హిరణ్యగర్భ’, కార్తీకంలో ‘మరీచ’, మార్గశిరంలో ‘ఆదిత్య’, పుష్యంలో ‘సవిత్రు’, మాఘంలో ‘అర్క’, ఫల్గుణంలో ‘భాస్కరుడు’ అని పిలుస్తారు. భారతదేశంలో సూర్యభగవానునికి నిత్యపూజ, అర్చన జరిగే దేవాలయం అరసవల్లి మాత్రమే.

అపురూపం ఆదిత్య స్వరూపం…
అరసవల్లిలో వెలసిన ఉషా ఛాయా పద్మినీ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో ప్రత్యేకత లేని ది అంటూ ఏది లేదు. స్వామివారి దేవాలయం, సూర్య కిర ణాలు, ఇంద్ర పుష్కరిణికి ఎంత ప్రాధాన్యం ఉందో స్వామి వారి విగ్రహానికి అంతకు మించిన ప్రాధాన్యత ఉంది. స్వామివారిని కృష్ణ శిలతో కళాత్మకంతో తీర్చిదిద్దిన ఏక శిలా విగ్రహం ఇక్కడ వుంది. దీనికి అరుణ శిల అని కూడా ప్రసిద్ధి. దీనికి కారణం మూల విరాట్‌ను అరుణ అనే ప్రత్యేకమై శిలలో దేవ శిల్పి విశ్వకర్మచే చెక్కించారు.

ఆదిత్యునికి ఆరుణ శోభ…
సకల జీవులకు ప్రత్యక్ష దైవమైన ఆదిత్యుడు ప్రతీ ఏడాది అక్టోబరు, మార్చి నెలలో అరుణ శోభను సంతరించుకుంటాడు. సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయణంలోకి, దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం లోకి మారే సందర్భాలలో సూర్యకిరణాలు స్వామివారి ధృవమూర్తిని తాకుతాయి. ఆ సమయంలో బాలభాను ని లేలేతకిరణ స్పర్శకు ఆదిత్యుడు బంగారు ఛాయలో మెరిసిపోతూ అరుణశోభలో భక్తులకు దర్శనమిస్తాడు.

ప్రతీ ఏటా మార్చి 7 నుంచి 10వ తేదీ వరకు, అక్టోబరు 1 నుంచి 3వ తేదీ వరకు కనిపించే ఈ కమనీయ దృశ్యాన్ని చూసి తరించడానికి దేశం నలు మూలల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. ఆదిత్యున్ని పాదాలను సుమారు ఐదు నిమిషాల పాటు సూర్యకిరణాలు తాకే దృశ్యం ఆలయ నిర్మాణ నైపుణ్యానికి దర్పణంగా నిలుస్తోంది. గాలిగోపురం మధ్య నుంచి సూర్యకిరణాలు ఆలయంలోకి ప్రవేశించి స్వామివారి పాదాలను తాకే దృశ్యాన్ని చూసి తరించాల్సిందే. ఆలయ వాస్తునిర్మాణం లోనే ఈప్రత్యేకత ఉంది. చాలా వరకూ ఆలయాలు ఉత్తరాభిముఖంగా ఉంటే ఈ ఆలయంలో మాత్రం ముఖద్వారం తూర్పునకు అభిముఖంగా ఉంటుంది.

అదిత్యారాధన అన్నింటికీ మాతృక…
సూర్యభగవానుని ఆరాధన ను నిత్యం ఆచరిస్తే… వారికి మోక్షం లభిస్తుంది. సూ ర్యారాధనలోనే సకల దేవతారాధ నల మూలాలున్నాయి. రథసప్త మి రోజు అత్యంత శ్రేష్టమైన పర్వ దినం. ‘ఆరోగ్యం బాస్కరాధిచ్చేత్‌’ అన్ని జీవరాసులకూ ఆరోగ్యప్రదాత ఆదిత్యుడే… నిత్యం సూర్యనమస్కారాలు చేసేవారికి ఎటువంటి ఆనారోగ్య సమస్యలూ తలెత్తవు.
– ఇప్పిలి శంకర శర్మ,
అరసవల్లి ఆలయ ప్రధానార్చకులు

Scroll to Top