కథాశిల్పంలో చిరస్మరణీయుడు

కథాశిల్పంలో చిరస్మరణీయుడు…చాసో

తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన చాగంటి సోమయాజులు 1915 జనవరి 17న నాగావళి తీరాన శ్రీకాకుళం పట్టణంలో కానుకొలను తులసమ్మ, లక్ష్మీనారాయణలకు జన్మించారు. అప్పుడు ఆయన పేరు నరహరిరావు. నాగావళీ తీరంలో పైరుపచ్చల మధ్య బాల్యం గడిచింది. చాసో అయిదోఫారం వరకు శ్రీకాకుళంలో చదివారు.

పెంపుడు తల్లిదండ్రులు చాగంటి తులసమ్మ బాపిరాజు విజయనగరం తీసుకొచ్చాక చాగంటి సోమయాజులుగా పేరు మారింది. విజయనగరం ఉన్నత పాఠశాలలో ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి. పూర్తి చేసి మహారాజా కళాశాల విజయనగరంలో పైచదువులు చదివారు. చాసో ఆత్మీయ మిత్రులు రోణంకి, శ్రీశ్రీ , నారాయణబాబు, ఆరుద్ర. తోరుదత్‌, సరోజీనినాయుడుల రచనల ప్రభావంతో చాసో తొలినాట సాహితీ జీవితం ప్రారంభించారు. రెండో ప్రపంచయుద్ధం, రష్యా విప్లవం, టాల్‌స్టాయ్‌, గోర్కీ రచనలు, మార్కిస్టు రాజకీయ సిద్ధాంతం చాసోను విశేషంగా ప్రభావితున్ని చేశాయి. ప్రపంచ యుద్ధ బీభత్సం రోజుల్లో ఆయన తొలికవిత ‘ధర్మ క్షేత్రం’ శీర్షికతో 1941లో అచ్చయింది. ఆధునిక సాహిత్యంలో శ్రీశ్రీ మహాప్రస్థానం, నారాయణబాబు గీతాలు హృదిర జ్యోతి, చాసో కథలు మంచి పేరు తెచ్చుకున్నాయి.
సృజనాత్మక ప్రక్రియలైన కథ, కవిత్వం, రెండిరటినీ దాదాపు ఒకే సమయంలో వ్రాస్తూ వచ్చినా తర్వాతి కాలంలో ఆయన కథా రచనకే ప్రాధాన్యమిచ్చారు.

చాసో కథలలో వస్తువూ, శిల్పమూ పోటాపోటీగా సాగుతాయి. చాసో కథా నిర్మాణంలో వైశిష్ట్యం ఏమంటే చాసో కథ ద్వారా ఏదీ వాచ్యంగా చెప్పరు. అచ్చులో చాసో తొలికవిత ‘ధర్మక్షేత్రము’ భారతి 1941 జూన్‌ సంచికలో వెలువడిరది . తొలి కథ చిన్నాజీ 1942 భారతి పత్రికలో ముద్రించబడిరది..

వర్తమాన సమాజంలో వైరుద్ధ్యాలు, ఆర్థిక సూత్రాలే మానవ సంబంధాలలో, మనిషి మనుగడలో కీలకపాత్ర నిర్వహిస్తాయనే సత్యాన్ని అలవోకగా ‘కాందిశీకుడు’ కవిత( రచనాకాలం: 1937-40) ఆవిష్కరించింది. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో బర్మాపై జపాన్‌ బాంబు దాడులు జరిపాక, బర్మా నుండి అనేక తెలుగు కుటుంబాలు కట్టుబట్టలతో కాలినడకతో స్వగ్రామాలు చేరినప్పుడు ఇక్కడి దుర్భరస్థితిని ఒక తల్లి హృదయావేదనగా చాసో అక్షరీకరించారు. ‘నమ్ముకున్న పుడమితల్లి, కట్టుకున్న భార్య రెండూ అతడికి కాకుండా పోయాయని’, చివరికి ‘పొయి లో నిప్పులేదు, నీకేం పెట్టేది నా నాయనా’ అనే తల్లి విలాపం పఠితను కన్నీళ్ళు పెట్టిస్తుంది.

అభ్యుదయ సాహిత్యోద్యమ వేదిక, అభ్యుదయ రచయితల సంఘం మొదటి మహాసభలు తెనాలిలో 1943లో జరిగాయి. ఆనాటి నుంచి కన్నుమూసే వరకూ ఆయన ‘అరసం’లోనే ఉంటూ కార్యకర్తగా నాయకునిగా తెలుగునాట అభ్యుదయ సాహిత్య ఉద్యమానికి విశేష సేవలందించారు.

చాసో రాసిన కథలు 46 అయినప్పటికీ తెలుగు కథాసాహిత్యంలో శాశ్వత స్థానం సంపాదించారు. చాసోకు ఆత్మీయమైన రచన ‘చిన్నాజీ’ సమాజంలో అట్టడగు వర్గాలు, దిగువ, మధ్య తరగతి సహా ఉన్నత వర్గాల జీవితాల్లోని దోపీడీ వ్యవస్థ కనిపిస్తుంది. కష్టాలు, కార్మికుల బతుకులు, అవిద్య, అమాయకత్వం, సౌందర్య పిపాస, మతం తదితర అంశాలన్నీ చాసో కథా వస్తువులుగానే వాడేవారు.

ఆయన రాసిన కథ ‘కుంకుడాకు’ లో కథానాయిక ‘గవిరి’ ఎనిమిదేళ్ళ బాలిక. 1943 ఫిబ్రవరిలో పుట్టిన. ఒక కూలివాడి కూతురు. తల్లిదండ్రులు కూలికెడితే కర్రా, కంపా ఏరి ఇంటికి ఒకపూట వంట చెరకు తేవాల్సిన బాధ్యత ఆమె నెత్తిమీదుంది. అందుకే ఊళ్లోంచి పొలానికి బయల్దేరింది. వెంట మోతుబరి రైతు కూతురు పారమ్మ కూడా ఉంది. ‘‘ఊళ్ళో బడిపిల్లలు ప్రార్థన మొదలుపెట్టేరు. ‘తల్లీ నిన్ను దలంచి…’ అని మేష్టారందిస్తున్నారు. ‘తల్లీ నిన్ను దలంచి’ అని పిల్లలంతా ఒక్కమాటు వూరెగర గొడుతున్నారు. ఆకులూ, కంపలూ ఏరుకుంటున్న ‘గవిరి’ని చెయ్యని నేరానికి భుక్తగారు పాంకోడు తీసి విసురుతాడు. అది గవిరి పిక్కమీద ఎముకకి తగిలి- ‘పీక తెగ్గోసిన కోడిలాగ గిలగిల కొట్టుకొని చుట్టుకుపోయింది’. ఏడ్చి ఏడ్చి కళ్ళు తెరిస్తే- పొద్దు లేచిపోవటం- బడిలో పిల్లలు ఎక్కాలు వల్లె వేయటం వినబడుతోంది. లేచి కళ్ళంలోని కుంకుడాకుని పోగుచేసి తట్టలోకి ఎత్తింది. ఎమికమీద పాంకోడు దెబ్బ బాధ ‘ఓలమ్మో’ అంటూ మర్లా ఉక్కిరి బిక్కిరిగా ఏడ్చుకుంటూ గోర్జిలోకి వెళ్ళింది. బడి పిల్లలింకా ఎక్కాలు చదువుతున్నారు. …పదహారార్లు తొంభైయారు’ అని ఒకరు అరుస్తున్నారు. ‘పదాహారార్లు తొంభైయారు’ అని అంతా కలిసి పాడుతున్నారు.’’ గోచీపాత పెట్టుకున్న ఎనిమిదేళ్ళ గవిరి రోషంతో, ఆత్మాభిమానంతో భుక్తకి చెప్పిన సమాధానం ద్వారా వ్యవస్థ వికృత స్వరూపం మనకు దృశ్యమానమౌతోంది.

కొన్ని ఇతర రచనలు, సజీవ పాత్రలు
‘ఎందుకు పారేస్తాను నాన్నా’: దిగువ తరగతి ప్రజల స్థితిగతులకు అద్దం పడుతున్న చిన్నారి.
‘చిన్నాజీ’: ‘వెన్నెట్లో రేరాణి వాసనలా నీ మువ్వలమాటలు వింటాడే’ అంటూ పాడుతూ వచ్చే చిన్నాజీ.
‘వాయులీనం’ : ‘తల్లి వెళ్ళిపోయింది… వెళ్ళిపోతూ తల్లి గుణాన్ని చూపించుకుంది’ అంటూ ఇంటి ఖర్చులకుగాను తన ఫిడేలు అమ్మి తనకి చీరకూడా తెచ్చిన భర్త వంక అనారోగ్యంతో బాధపడుతూ గుడ్లనిండా నీళ్ళు నింపుకుని చూస్తున్న రాజ్యము.
‘కుక్కుటేశ్వరం’: ‘పదండి భడవల్లారా… నేనే దొంగ మార్కెట్‌లో అమ్ముకొని మేడలు కడుతున్నా ను. నాకు ఉరిశిక్ష తక్కువ వెయ్యకండి… నా పొగ కుక్కుటేశ్వరుడికి ధూపం వెయ్యండి’ అంటూ బియ్యపుమూటని భుజాన కెత్తుకొని రైల్వే ఉద్యోగుల వెంట వెళ్తున్న ముసలమ్మ.

మనుషులను చదివిన చాసో
చాసో తాను నడయాడిన ప్రాంతాల్లోని మనుషులను చదివారు. భాషల్ని, యాసల్ని పట్టుకుని తానెరిగిన జీవితాల నుంచే కథలు సృజించారు. పరబ్రహ్మం, మాతృధర్మం, బొండుమల్లెలు, కుక్కుటేశ్వరం, బొచ్చు తువ్వాలు తదితర కథలు ఆలోచింపజేస్తాయి. గురజాడది విమర్శనాత్మకమైన, వాస్తవికతతో కూడిన సామాజిక చైతన్య పురోగమనమైతే.. చాసో కాలం నాటికి మారిన ప్రపంచ, దేశ పరిస్థితుల నేపథ్యంలో మార్క్సిస్టు దృక్ఫథం ఆయన కథల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ఏలూరెళ్లాలి, వేలం, వెంకడు, ఎందుకు పారేస్తాను నాన్నా’ తదితర కథల్లో చిన్న చిన్న వాక్యాలతోనే బరువైన భావాలను పలికించిన చాసో 1994 జనవరి 2న తనువు చాలించారు.

Scroll to Top