అప్పుడే ఏడాది అయిపొయింది!

బాలు లేరు..ఆయన పాట మనసుల్లో మధురిమలను పంచుతోంది
– ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మనకు దూరమై ఈ నెల25తో ఏడాది

సెప్టెంబర్ 25/2020..సినీ సంగీత లోకానికి పెను విషాదాన్ని మిగిల్చిన రోజు. గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అస్తమించిన దుర్ధినం అది. తెలుగు సినిమా పాట అంటే అందులో సగం అయన గురించే చెప్పాలి.. 1966లో ఓ పాట మొదలైన అయన ప్రయాణం ఎక్కడికో వెళ్ళిపోయింది. అయన తర్వాత ఎంతో మంది గాయకులూ వచ్చారు.. వస్తూనే ఉన్నారు.. అందరకి అయన స్ఫూర్తి.. ఏడుపదుల వయసులో కూడా ఎంతో యాక్టివ్ అయన తన గాత్రంతో అలరించారు.. ఆ పాట అంటే ఆయనే పాడాలి.. అయన పాడితే ఈ పాట ఆయన కోసమే పుట్టిందా అన్నట్టుగా ఉంటుంది. దాదాపుగా 40వేలకి పైగా పాటలు పాడి చాలా మంది అభిమానులకి సొంతం చేసుకున్నారు. ఆయనే మనం ముద్దుగా పిలుచుకునే ఎస్పీ బాలు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, టెలివిజన్ వ్యాఖ్యాతగా ప్రాచుర్యం పొందారు.

బాలసుబ్రహ్మణ్యం 1946, జూన్ 4 న నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట గ్రామంలో శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు జన్మించారు. అతని స్వగ్రామం మొదట గోల్కొండ పాలకుల ఆధీనంలో ఉండేది. ఆ తరువాత 1825 నుండి మద్రాసు ప్రెసిడెన్సీలో భాగమయ్యింది. అతని తండ్రి పేరొందిన హరికథా కళాకారుడు. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు కల పెద్ద కుటుంబములో బాలసుబ్రహ్మణ్యం రెండవ కుమారుడుగా జన్మించారు. తండ్రి భక్తిరస నాటకాలు కూడా వేస్తుండేవాడు. సాంబమూర్తితో ఇంట్లో పండితులు, కవులు భాషా, సాహిత్య పరమైన చర్చలు జరుపుతూంటే విని, బాలసుబ్రహ్మణ్యానికి బాల్యం నుంచే భాషపై ఆసక్తి పెరిగింది. తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలుకు చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది.

ఐదేళ్ళ వయసులో తండ్రితో కలిసి భక్త రామదాసు అనే నాటకంలో నటించాడు. ప్రాథమిక విద్య నగరి లోని మేనమామ శ్రీనివాసరావు ఇంటిలో ఉంటూ పూర్తి చేశాడు. శ్రీకాళహస్తిలోని బోర్డు పాఠశాలలో స్కూలు ఫైనలు చదివాడు. చదువులోనే కాక, ఆటల్లో కూడా మొదటి వాడుగా ఉండేవాడు. శ్రీకాళహస్తిలో చదివేటప్పుడే జి. వి. సుబ్రహ్మణ్యం అనే ఉపాధ్యాయుడు చెంచులక్ష్మి సినిమాలో సుశీల పాడిన పాలకడలిపై శేషతల్పమున అనే పాటను ఆలపింపజేసి టేపు మీద రికార్డు చేయించాడు. రాధాపతి అనే మరో ఉపాధ్యాయుడు ఈయనను ఈ ఇల్లు అమ్మబడును, ఆత్మహత్య లాంటి నాటకాల్లో నటింప జేశాడు. తర్వాత తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో పియుసి చదువుతుండగా మద్రాసు ఆలిండియా రేడియోలో ప్రసారమయ్యే ఒక నాటికలో స్త్రీ పాత్ర ధరించాడు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో బాలు స్వయంగా రాసి, స్వరపరిచి పాడిన లలిత గీతానికి బహుమతి లభించింది.

తిరుపతిలో పి.యు.సి పూర్తి చేసుకుని నెల్లూరు వెళ్ళిన బాలు అక్కడ కొంతమంది మిత్రులతో కలిసి ఒక ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసి ప్రదర్శనలు ఇచ్చేవారు. తర్వాత అనంతపురంలో ఇంజనీరింగులో సీటు వచ్చింది. కానీ ఆయనకు అక్కడి వాతావరణం నచ్చక తిరిగి వచ్చేశారు. మద్రాసు వెళ్ళి ఇంజనీరింగుకి ప్రత్యామ్నాయమైన ఎ.ఎం.ఐ.ఇ కోర్సులో చేరారు. సాంబమూర్తికి తన కుమారుడు ఇంజనీరు కావాలని కోరిక. తండ్రి కోరిక ననుసరించి బాలసుబ్రహ్మణ్యం కూడా చదువుకునే రోజుల్లోనూ, ఆ తర్వాత పాటలు పాడే రోజుల్లోనూ కొన్నేళ్ళు మంచి ఇంజనీర్ కావాలని, ప్రభుత్వ శాఖల్లో ఇంజనీరుగా పనిచేయాలని కలలు కనేవారు. ఆ కాలం లోనే వివిధ పాటల పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకొన్నారు.

గాయకునిగా
1964లో మద్రాస్ సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ నిర్వహించిన లలిత సంగీత పోటీల్లో బాలుకి ప్రథమ బహుమతి లభించింది. ఆ పోటీకి సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తి, పెండ్యాల నాగేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు లు న్యాయనిర్ణేతలు. అదే పోటీలో ఎస్. పి. కోదండపాణి బాలు ప్రతిభను గమనించారు. సినిమాల్లో అవకాశం కల్పిస్తానని మాట ఇచ్చారు. అలా ఎ.ఎం.ఐ.ఇ రెండో సంవత్సరంలో ఉండగా బాలసుబ్రహ్మణ్యం చలనచిత్ర రంగ ప్రవేశం చేసారు. 1966లో నటుడు, నిర్మాత అయిన పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీగాయకునిగా చలన చిత్ర గాయక జీవితం ప్రారంభించారు. ఏమి ఈ వింత మోహం అనే పల్లవి గల ఈ పాటను ఆయన పి. సుశీల, కల్యాణం రఘురామయ్య, పి. బి. శ్రీనివాస్ లతో కలిసి పాడారు. ఈ చిత్రానికిఎస్.పి.కోదండపాణి సంగీత దర్శకత్వము వహించారు. కోదండపాణి, బాలు పాడిన మొదటి పాటను రికార్డిస్టు స్వామినాథన్ తో చెప్పి చెరిపివేయకుండా అలాగే ఉంచి తన దగ్గరకు వచ్చిన సంగీత దర్శకులను అది వినిపించి అవకాశాలు ఇప్పించేవారు. అలా తనకు సినీ గాయకునిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై భక్తితో, అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్ కు “కోదండపాణి ఆడియో ల్యాబ్స్” అని అతని పేరే పెట్టుకున్నారు బాలు.

గాయకుడిగా కెరీర్ ప్రారంభించాక ఆయనకు పెద్ద స్టార్స్ కు పాడే అవకాశం రాలేదు. కేవలం అప్పుడే వస్తున్న అప్ కమింగ్ హీరోలకే పాడే అవకాశం మాత్రమే వచ్చేది. అప్పటికే ఎన్టీఆర్, ఏన్నార్ లకు ఘంటసాల తప్ప ఎవరు పాడినా.. ప్రేక్షకులు అంగీకరించే పరిస్థితి లేదు. అయిన అడపా దడపా ఘంటసాలతో గొంతు కలిపే పాడే అరుదైన అవకాశాలు.. బాలుకు రానే వచ్చాయి. ప్రతిరాత్రి వసంత రాత్రి.. ప్రతిగాలి పైర గాలి.. అంటూ ‘ఏకవీర’ లో అమర గాయకుడు ఘంటసాల తో బాలు ఆలపించిన గానం నేటికి శ్రోతలను హమ్ చేసుకునేలా ఉంటాయి.

ఘంటసాల మరణం తర్వాత తెలుగు సినిమా పాటలకు పెద్ద దిక్కైయ్యారు బాల సుబ్రహ్మణ్యం. సన్నివేశానికి న్యాయం చేకూరుస్తూ..సన్నివేశ బలానికి తగినట్టు నటనను గాత్రంలో ప్రస్పుటంగా ప్రకటించగల గాయకుడు ఎప్పీ. ముఖ్యంగా బాలు సినీ జీవితం ‘శంకరాభరణం’ సినిమాతో పూర్తిగా మారిపోయింది. అప్పటివరకు మాస్ గీతాలకే పరిమితం అయిన బాలు.. ఈ సినిమాలో క్లాసికల్ పాటలను సైతం అద్భుతంగా పాడగలనని విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నారు. ఈ చిత్రానికి బాలు తొలిసారి జాతీయ స్థాయిలో ఉత్తమ గాయకుడిగా అవార్డు అందుకున్నారు.

పదాల మాధుర్యాన్ని గమనించి.. బాలూ చేసే ఉచ్చారణ పాటను పండిత పామరులకి చేరువ చేసింది. తరాలు మారినా ఎందరో నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా ఆయన పాటలు పాడి.. ప్రాణం పోశారు. ఒక పాట విన్న తర్వాత ఆ పాట ఏ హీరోదో చెప్పడం అది బాలూ పాడితేనే సాధ్యం. తెలుగులోనే కాదు ఉత్తరాదిన కూడా పాడి తన సత్తా చాటారు బాలూ. హిందీలో తొలిసారి పాడిన ‘ఏక్ దూజేలియే’ చిత్రంలో.. అద్భుతంగా పాడి అక్కడి వారిచేత శభాష్ అనిపించుకున్నారు. ఈ సినిమాకు కూడా ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డు దక్కడం విశేషం. ఈ విధంగా తెలుగు తో పాటు హిందీ, తమిళం, కన్నడ లాంటి నాలుగు భాషల్లో కలిపి ఆరు సార్లు జాతీయ ఉత్తమ గాయకుడిగా నిలవడం ఒక్క బాలసుబ్రహ్మణ్యానికే చెల్లింది.

‘చెల్లెలి కాపురం’ లో బాలు పాడిన.. చరణ కింకరులు ఘల్లు ఘల్లు మన…కర కంకణములు గల గల లాడగా అంటూ ఎస్పీ తన గొంతులో పలికించిన వేరియేషన్స్ శ్రోతల మదిలో ఇప్పటికీ అలాగే నిలిచిపోయాయి. ఏపాట పాడినా.. ఆ పాటకే అందం వచ్చేంతగా ఆలపించడం బాలు కి తప్పించి మరొకరికి సాధ్యం కాదు. భక్తి గీతాలను సైతం ఎంతో రసరమ్యంగా పాడ్డంలో బాలూ శైలే వేరు. ముఖ్యంగా అన్నమయ్య, శ్రీరామదాసు, శ్రీరామరాజ్యం చిత్రాలలో ఎస్పీ ఆలపించిన భక్తి గీతాలు ఇప్పటికీ ప్రతి ఇంటా వినిపిస్తూనే ఉన్నాయి.

గాయకుడిగానే కాకుండా.. సంగీత దర్శకుడిగా, నటుడిగా, టి.వి వ్యాఖ్యాతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నిర్మాతగా.. ఇలా బహుముఖ ప్రఙ్ఞను ప్రదర్శించారు బాలు. సంగీత దర్శకుడిగా ‘పడమటి సంధ్యారాగం’, ‘జాకీ’, ‘మగధీరుడు’, ‘జైత్రయాత్ర’ వంటి యాభై చిత్రాల వరకూ మ్యూజిక్ అందించారు. నిర్మాతగా ఆదిత్య369, శుభసంకల్పం, భామనే సత్యభామనే, వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలను నిర్మించి తన అభిరుచి చాటుకున్నారు. బాలసుబ్రమణ్యం పాటలు పాడుతుంటే వినేవారికి మాటలు రావు. ఓ పాపా లాలి చిత్రంలో ‘మాటేరాని చిన్నదాని కళ్లు పలికే ఊసులు’ అంటూ…బాలూ నటించి, ఆలపించిన బ్రీత్ లెస్ గీతం సంగీతాభిమానులు ఎప్పటికి మరిచిపోలేరు.

నాడు ఎన్టీఆర్ నటించిన ‘జగదేకవీరుని కథ’ సినిమాలో ఘంటసాల ఆలపించిన శివశంకరి పాట తెలియని సంగీత రసజ్ఞులు ఉండరు. తన గురువు ఘంటసాల బాటలో ‘భైరవ ద్వీపం’లో బాలూ పాడిన శ్రీ తుంబుర నారద నాదామృతం పాటలో..బాలూ ఆలపించిన గంధర్వ గానం శ్రోతలకు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది.నాలుగు దశాబ్దాల్లో…11భాషల్లో 40వేల పాటలు పాడి గిన్నీస్ రికార్డు నెలకొల్పాడు బాలు. ఆయన అందుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాలకు లెక్కే లేదు.

బాలు పాటలు ముఖ్యంగా యువతను ఆకట్టుకున్నాయి. చాలామంది నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా అతను పాటలు పాడి ప్రాణం పోశారు. అందుకే అమరగాయకుడు ఘంటసాల తరువాత తెలుగు సినీ పాటకు సిసలయిన వారసుడిగా నిలిచారు. పదాల మాధుర్యాన్ని గమనించి అతను చేసే ఉచ్చారణ అతని పాటను పండిత పామరులకి చేరువ చేసింది. శంకరాభరణం, సాగరసంగమం లాంటి తెలుగు చిత్రాలే కాకుండా ఏక్ దుజే కేలియే లాంటి హిందీ చిత్రాలకు అతను పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి. 40 ఏళ్ళ సినీ ప్రస్థానంలో 40 వేల పాటలు 11 భాషలలో పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచం లోనే ఒక అరుదయిన రికార్డు సృష్టించారు. తెలుగు, తమిళమే కాకుండా కన్నడంలో కూడా అతను పాడిన పాటలకు జాతీయ పురస్కారాలు లభించాయి. గాయకుడిగానే కాకుండా గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయా విభాగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాన్ని 29 సార్లు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఈ గాన గంధర్వుడు.
2016 నవంబరులో గోవాలో జరిగిన 47 వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో అతనికి శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారాన్ని (సెంటినరీ అవార్డ్‌ ఫర్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ 2016) ప్రదానం చేసారు.

నటునిగా

అతను 1969లో వచ్చిన పెళ్ళంటే నూరేళ్ళ పంట అనే చిత్రంలో మొదటిసారిగా నటుడిగా కనిపించారు. 1990 లో తమిళంలో వచ్చిన కేలడి కన్మణి అనే చిత్రంలో బాలు కథానాయకుడినా నటించారు. ఇందులో రాధిక కథానాయిక. ఈ సినిమా తెలుగులో ఓ పాపా లాలి అనే పేరుతో అనువాదం అయింది. ఇంకా ప్రేమ (1989), ప్రేమికుడు (1994), పవిత్రబంధం (1996), ఆరో ప్రాణం (1997), రక్షకుడు (1997), దీర్ఘ సుమంగళీ భవ (1998) వంటి సినిమాల్లో ప్రాధాన్యత కలిగిన సహాయ పాత్రలు నటించారు. 2012 లో తనికెళ్ళ భరణి దర్శకత్వంలో వచ్చిన మిథునం సినిమాలో కథానాయకుడిగా కనిపించారు బాలు. ఇందులో లక్ష్మి నాయికగా నటించింది. ఈ సినిమాకు ఉత్తమ చిత్రాల విభాగంలో మూడవ బహుమతిగా 2012 నంది పురస్కారం లభించింది. నంది ప్రత్యేక పురస్కారం లభించింది.

డబ్బింగ్ కళాకారుడిగా
కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ అనువాద చిత్రం మన్మధ లీలతో బాలు అనుకోకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా మారారు. అందులో కమల్ హాసన్ కు తెలుగులో డబ్బింగ్ చెప్పారు. తర్వాత ఆయన కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, భాగ్యరాజ్, మోహన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, కార్తీక్, నగేష్, రఘువరన్ లాంటి వారికి పలు భాషల్లో గాత్రదానం చేశారు. తమిళం నుంచి తెలుగులోకి అనువాదమయ్యే కమల్ హాసన్ చిత్రాలన్నింటికి ఈయనే డబ్బింగ్ చెబుతుండేవారు. 2010లో కమల్ హాసన్ కథానాయకుడిగా వచ్చిన దశావతారం చిత్రంలో కమల్ పోషించిన పది పాత్రల్లో 7 పాత్రలకు బాలునే డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇందులో కమల్ పోషించిన ముసలావిడ పాత్ర కూడా ఉంది. అన్నమయ్య చిత్రంలో సుమన్ పోషించిన వేంకటేశ్వర స్వామి పాత్రకు, సాయి మహిమ చిత్రంలో బాలు డబ్బింగ్ చెప్పారు. ఈ రెండు చిత్రాలకు ఆయనకు ఉత్తమ డబ్బింగ్ కళాకారుడిగా నంది పురస్కారం లభించింది. అటెన్ బరో దర్శకత్వంలో వచ్చిన గాంధీ చిత్రంలో గాంధీ పాత్రధారియైన బెన్ కింగ్‌స్లే కు తెలుగులో బాలు డబ్బింగ్ చెప్పారు.

టీవీ కార్యక్రమాలు
ఈటీవీలో పాడుతా తీయగా అనే కార్యక్రమంతో బాలసుబ్రహ్మణ్యం బుల్లితెర ప్రవేశం చేసారు. అనేక మంది కొత్త గాయనీ గాయకులను ఈ కార్యక్రమం ద్వారా పరిచయం చేసాడు. 1996 లో మొదలైన ఈ కార్యక్రమం 2020లో కోవిడ్ లాక్ డౌన్ కి ముందు వరకూ ఆయన వ్యాఖ్Yఆతగా కొనసాగించారు.

వ్యక్తిగత జీవితం
బాలుకు సావిత్రితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. పల్లవి, ఎస్. పి. చరణ్. కొడుకు ఎస్. పి. చరణ్ కొన్ని సినిమాల్లో పాటలు పాడి, తర్వాత సినీ నిర్మాతగా కూడా మారాడు. బాలు సోదరి ఎస్. పి. శైలజ కూడా సినీ నేపథ్య గాయని. అన్నయ్యతో కలిసి ఈమె పలు చిత్రాల్లో పాటలు పాడింది. నటుడు శుభలేఖ సుధాకర్ ను వివాహమాడింది. బాలు తండ్రి శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి 1987లో మరణించగా తల్లి శకుంతలమ్మ 2019 ఫిబ్రవరి 4 న 89 సంవత్సరాల వయసులో నెల్లూరులో మరణించింది.

పురస్కారాలు
భారతీయ భాషల్లో ఆయన సుమారు 40 వేలకు పైగా పాటలు పాడారు. అత్యధిక పాటలు రికార్డు చేసిన గాయకుడిగా ఆయన పేరిట ఒక రికార్డు ఉంది. ఆయన సుదీర్ఘ ప్రస్థానంలో 6 జాతీయ పురస్కారాలు, 6 ఫిల్మ్ ఫేర్ దక్షిణాది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నారు. 1979 లో వచ్చిన సంగీత ప్రధానమైన శంకరాభరణం చిత్రానికి ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. రెండు సంవత్సరాల తర్వాత ఆయనకు 1981 లో బాలీవుడ్ లో ప్రవేశించి ఏక్ దూజే కేలియే చిత్రానికి గాను రెండోసారి పురస్కారాన్ని అందుకున్నారు. తర్వాత సాగర సంగమం (1983), రుద్రవీణ (1988) చిత్రాలకు జాతీయ పురస్కారాలు అందుకున్నారు. 25 సార్లు ఉత్తమ గాయకుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నారు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నారు.
పద్మశ్రీ (2001), డాక్టరేటు, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం (1999), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గవర్నరు రంగరాజన్ చేతులమీదుగా పద్మభూషణ్ (2011), శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారం (2016) అందుకున్నారు. 2021లోమరణానంతరం కేంద్ర ప్రభుత్వం బాలుకు పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.

చివరి రోజులు
2020 ఆగస్టు 5 న ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తనకు కోవిడ్-19 వ్యాధి సోకినట్టు ప్రకటించారు. చికిత్స నిమిత్తం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. ఆ తరువాత కరోనా తగ్గినప్పటికీ ఇతర శ్వాసకోశ సమస్యలు ఏర్పడి ఆరోగ్యం విషమించడంతో ఎక్మో, వెంటిలేటర్‌ సాయంతో చికిత్స కొనసాగించారు. 2020 సెప్టెంబరు 25 న మధ్యాహ్నం 1.04 లకు బాలు తుదిశ్వాస విడిచారు. 2020 సెప్టెంబరు 26న తిరువళ్ళూరు జిల్లాలోని రెడ్ హిల్స్, తామరపాకం లోని ఆయన వ్యవసాయం క్షేత్రంలో తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో అంత్యక్రియలు జరిగాయి. ఆయన మనకు దూరమైనా ఆ మధుర గానం మన మనసుల్ని ఉత్తేజితం చేస్తూనే ఉంటుంది.

Scroll to Top