సొగసరి, గడసరి జమున ఇక లేరు

సీనియర్ నటి జమున (86) ఇకలేరు

సీనియర్ నటి జమున (86) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. హైదరాబాద్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఉదయం 11 గంటలకు జమున భౌతిక కాయాన్ని ఫిలింనగర్ ఛాంబర్ కు తీసుకువచ్చారు.
నేపథ్యం
1936 ఆగస్ట్ 30న హంపిలో జమున జన్మించారు. తల్లిదండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేశి. తండ్రి వ్యాపార రీత్యా.. జమున బాల్యమంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది. జమున తల్లి ఆమెకు శాస్త్రీయ సంగీతం, హార్మోనియంలలో శిక్షణ ఇప్పించారు. జమునకు ముందుగా నిర్ణయించిన పేరు జనాభాయి. జన్మ నక్షత్రం రీత్యా ఏదైనా నది పేరు ఉండాలని జ్యోతిష్కులు చెప్పడంతో మధ్యలో ‘ము’ అక్షరం చేర్చి జమునగా మార్చారు. ఉత్తరాదివారు యమునను జమునగా పిలవడంతో ఆమెకు ఆ పేరు ఉంచారు. సినిమా కోసం ప్రత్యేకంగా ఆమె పేరు మార్చలేదు. సినీనటుడు జగ్గయ్యదీ అదే గ్రామం కావడంతొ జమున కుటుంబానికి జగ్గయ్యతో కొంత పరిచయం ఉంది. సహజంగా బెరుకు అంటూ లేని జమున స్కూలులో చదివేకాలంలో నాటకాలపై ఆకర్షితురాలయ్యింది.

తెనాలి సమీపంలోని మండూరు గ్రామంలో ‘ఖిల్జీ రాజ్య పతనం ‘ అనే నాటిక ప్రదర్శన కోసం ప్రత్యేకంగా జగ్గయ్య జమున ఎంపిక చేసుకుని తీసుకువెళ్ళాడు. ఇదే నాటికలో మరో ప్రముఖ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు కూడా నటించాడు. నాటకాలలో ఆమె ప్రతిభ నలుమూలలకూ పాకడం వల్ల సినిమా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. బి.వి.రామానందం తీసిన పుట్టిల్లు ఆమె తొలిచిత్రం.

ఆ తరువాత అక్కినేని నాగేశ్వరరావు, జగ్గయ్య, నందమూరి తారక రామారావు తదితర నటుల సరసన నాయికగా నటించింది. ఎన్ని పాత్రలలో నటించినా ఆమెకు బాగా పేరు తెచ్చింది సత్యభామ పాత్రే. ఆ పాత్రలో ఇప్పటిటికీ ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోలేము అన్నట్టుగా నటించిందీమె. వినాయకచవితి చిత్రంలో మొదటి సారి సత్యభామలో జమున కనిపిస్తుంది. ఆ తర్వాత శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో కూడా అదే పాత్ర వేసింది. ఈ సినిమాలో సత్యభామ ఆహార్యం గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని పాత్రే ఆమెకు పేరు తెచ్చింది. కళపై ఉన్న మక్కువతో నాటకాల్లో బుర్రకథ బ్రహ్మ నాజర్‌ దగ్గర శిక్షణ తీసుకోవటం తన నట జీవితానికి పట్టం కట్టిందన్నారు.

అంతే కాదు మా భూమి అనే నాటకంలోనూ జమున కీలక పాత్ర పోషించి, అందర్నీ మెప్పించారు. అలా ఆమె అభినయం నచ్చి పుట్టిల్లు (1953) సినిమాలో ఆమెకు నటిగా అవకాశం వచ్చింది. ఈ సినిమాతోనే ఆమె సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని, జగ్గయ్య వంటి అలనాటి అగ్రహీరోల సరసన నాయికగా నటించిన జమున… తనకంటూ ఓ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. సత్యభామా కలాపంతో ప్రేక్షక జన హృదయాల్లో జమున నిలిచిపోయారు. అలా అంచలంచెలుగా ఎదిగి తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో కలిపి ఆమె 198 సినిమాల్లో నటించారు.

సినీతారలుగా ఉండి, రాజకీయాలలో ప్రవేశించి రాణించిన కథానాయికలలో ఆమె అగ్రస్థానంలో ఉంటారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ అంటే ఉన్న అభిమానం, గౌరవం నన్ను రాజకీయాలలోకి లాక్కొచ్చాయి అని తన రాజకీయ జీవితం గురించి చెబుతుంది జమున. ఈమె తెలుగు సినిమాలే కాక తమిళం, హిందీ సినిమాలలో కూడా నటించింది. ఆమె నటించిన మిస్సమ్మ, ఇల్లరికం, ఇలవేల్పు, లేతమనసులు, గుండమ్మ కథ చిత్రాలు విజయవంతమయ్యి రజతొత్సవం జరుపుకున్నాయి.

వ్యక్తిగత జీవితం
1965లో జూలూరి రమణరావును జమున వివాహం చేసుకున్నారు. ఆయన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జువాలజీ ప్రొఫెసర్ గా పనిచేశారు. 2014 నవంబరు 10లో రమణరావు గుండెపోటుతో మరణించారు. కాగా జమున, రమణరావు దంపతులకు కుమారుడు వంశీకృష్ణ, కూతురు స్రవంతి ఉన్నారు. వారు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు.

నటించిన సినిమాలు..
బంగారు పాప, వద్దంటే డబ్బు, దొంగ రాముడు, సంతోషం, మిస్సమ్మ, తెనాలి రామకృష్ణ, చిరంజీవులు, చింతామణి, భాగ్యరేఖ, మా ఇంటి మహాలక్ష్మి, గులేబకావళి కథ, గుండమ్మ కథ, పూజాఫలం, బొబ్బిలి యుద్ధం, దొరికితే దొంగలు, కీలు బొమ్మలు, తోడు నీడ, శ్రీకృష్ణ తులాభారం, వినాయకచవితి, లేత మనసులు, చదరంగం లాంటి మంచి సినిమాల్లో నటించి గొప్ప పేరు కూడగట్టుకున్నారు. ఆమెకు బాగా గుర్తింపు తెచ్చిన పాత్ర సత్యభామ. ఆ పాత్రలో ఆమెను తప్ప ఇంకెవరినీ ఊహించుకోలేమన్నట్టుగా జమున జీవించారు. మిస్సమ్మ సినిమా జమున సినీ కెరీర్‌కు మంచి టర్నింగ్ పాయింట్‌ అని చెప్పవచ్చు. కాగా ఆమె నటించిన చివరి చిత్రం రాజపుత్ర రహస్యం.

అవార్డులు
1968: ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు – మిలన్
1964: ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు – మూగ మనసులు
2008: ఎన్.టి.ఆర్ జాతీయ పురస్కారం
2021 సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ హాలులో జరిగిన సాక్షి మీడియా 2019, 2020 ఎక్స్‌లెన్స్‌ అవార్డుల కార్యక్రమంలో జమున జీవితసాఫల్య పురస్కారం అందుకున్నారు.

రాజకీయాల్లోనూ..
జమున 1980లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజమండ్రి నియోజకవర్గం నుంచి 1989లో లోక్ సభకు ఎంపిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత రాజకీయల నుండి తప్పుకున్నా.. 1990లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరపున ప్రచారం చేశారు.

Scroll to Top